రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే
రామాయణం పాఠ్యాంశంగా ఉండాల్సిందే
- – డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ టీచర్ల సంఘం
- 08/12/2014
దశాబ్దాల కల నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. వచ్చిన రాష్ట్రం బంగారు తెలంగాణ కావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా వివిధ స్థాయిలలో పాఠ్యాంశాల పునస్సమీక్ష జరుగుతోంది. ఇంతకాలం పాటు వివక్షకు గురైన తెలంగాణ ప్రాంత చరిత్రను, తెలంగాణ ప్రాంతానికి చెందిన వీరులు, యోధుల గాధలను, కవులు, రచయితల రచనలను పాఠ్యాంశాలలో చేర్చాల్సి ఉంది. అదే సమయంలో జాతికి నీతినీ, రీతినీ బోధించిన రామాయణ, భారతాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు పదవ తరగతి తెలుగు ఉపవాచకంగా సులభశైలిలో ఉన్న వచన రామాయణాన్ని బోధిస్తున్నారు. పునస్సమీక్షలో దీనిని ఉంచుతారో లేదో అన్న అనుమానాలు విద్యావేత్తలలోనూ, విద్యాభిమానుల్లోనూ పొడసూపుతున్నాయి. ప్రాథమిక పాఠశాల నుండి పి.జి. వరకు వివిధ స్థాయిలలో ఉపాధ్యాయుడిగా, ఉపన్యాసకుడిగా, అధ్యాపకుడిగా పనిచేసిన నా ముప్ఫయి ఏళ్ల బోధనానుభవంలో రామాయణ, భారత కథాంశాలను బోధిస్తున్నప్పుడు విద్యార్థులు అత్యంత ఆసక్తితో వినడంతోపాటు అభ్యాసన ప్రక్రియలో క్రియాశీలంగా స్పందించడం చూశాను. అందుకే ఇతిహాసాలు పాఠ్యాంశాలుగా ఉండాలన్న ధృఢమైన అభిప్రాయం అనేకమంది విద్యావేత్తలలో ఉంది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ తానూ ఎనిమిదవ తరగతిలో చదివిన మహాభారత పద్యాన్ని పలు సభలలో ప్రస్తావించి, తానూ గొప్ప వక్తగా ఎదగడానికి సాహిత్యం ఎలా దోహద పడిందో చెబుతుంటారు. ఇది బాల్యంలో విద్యార్థి చిత్తక్షేత్రాలలో పడే సంస్కార బీజాలు వారి జీవితాలను ఎలా తీర్చిదిద్దుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ. వాస్తవానికి ఇతిహాసాలు పురాణాలూ కావు, మతగ్రంథాలు అంతకంటే కావు. అవి జాతికి తరతరాల వారసత్వ సంపదగా నిలుస్తున్న తరగని నిధులు, ఎన్నటికీ చెరిగిపోని మానవతా మహోదధులు, సి.జి.యూంగ్ లాంటి ప్రపంచ ఖ్యాతి చెందిన మనస్తత్వ శాస్తవ్రేత్త ఇతిదిహాసాలు ఒక తరం నుండి మరో తరానికి సహజంగా వ్యాపిస్తాయని పేర్కొనడం వాటికున్న ప్రాధాన్యతకు అద్ధం పడుతుంది. భారతీయ సాహిత్యంలో రామాయణ, భారతాలు ఇతిహాసాలుగా బహుళ ప్రజాదరణను పొందాయి. తెలుగు సాహిత్యంలో మార్గదేశీ పద్ధతులతో పాటు వౌఖిక ప్రచారంలో కూడా విస్తృతంగా రామాయణ గాధలు కనిపిస్తాయి. భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రామాయణ కల్పవృక్షం వంటి కావ్యాలు మార్గ పద్ధతిలో వస్తే రంగనాథ రామాయణం వంటి ద్విపద రచనలు దేశీ పద్ధతిలో వచ్చాయి. జనప్రియ రామాయణం, ఉషశ్రీ రామాయణం విశేష ప్రజాదరణ పొందిన విషయం అందిరకీ తెలిసిన సత్యమే. ఇవేకాక ఇంకా అక్షరబద్ధం కాని రామాయణ సంబంధ కథలు గిరిజనులలో వౌఖిక ప్రచారంలో విరివిగా కనిపిస్తాయి. జానపద బాణీలో విదువౌళి శాస్ర్తీ వెలువరించిన తందనాన రామాయణం తెలంగాణ ప్రాంతంలో విశేష ప్రజాదరణ పొందింది. సుమారు ముప్ఫయి ఏళ్ళ క్రితం రేడియోలో ప్రసారమైన ఎమ్మెస్ రామారావు సుందరకాండ ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతోంది. అందుకే ఈనాటికీ రామాయణం ఎంత పరిశోధించినా తరగని గనిగా నిలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ లాంటి రాజకీయవేత్త కన్నడ సాహిత్యాన్ని అధ్యయనం చేసి రామాయణ మహానే్వషణం వంటి పరిశోధనాత్మక గ్రంథాలు వెలువరించడం పరిశోధనా రంగంలో ఈ ఇతిహాసానికున్న ప్రాధాన్యతను తెలుపుతోంది.
తెలుగు సాహిత్యంలో మొదటి జ్ఞానపీఠ పురస్కారం కవిసామ్రాట్ విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షానికి లభిస్తే, కన్నడ సాహిత్యంలో కూడా సుప్రసిద్ధ పండితులు కె.వి.పుట్టప్ప రచించిన రామాయణ దర్శానానికే లభించడం రామగాధకు ఉన్న సార్వాకాలీనతకు ఉదాహరణగా చెప్పవచ్చు.
రామాయణం సార్వకాలికమైన, సార్వజనీనమైన మానవీయ విలువలు ప్రబోధించిన విశ్వమానవ మహేతిహాసం. ఈనాటికీ భారతీయులలో అత్యధుకులు రాముడిలాంటి కొడుకు, సీతాలాంటి భార్య కావాలని కోరుకుంటారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం కలలుగన్నది రామరాజ్యం కోసమే గదా! రామాయణం మనిషి మనీషిగా ఎదిగే మార్గాన్ని చూపించింది. ఆదర్శవంతమైన జీవన విధానాన్ని నిర్దేశించింది. వ్యక్తి శ్రేయస్సు కన్నా సమాజ హితమే మిన్న అని బోధించింది. స్వర్గం కన్నా జన్మభూమినే మిన్నగా చూపించింది. బంగారు లంకను కోరుకోవడం కన్నా కన్న నేల ఋణం తీర్చుకోవడమే గొప్ప అన్న సందేశాన్ని జాతికి అందించింది. ఏక పత్నీవ్రతమే శ్రేష్టమని ఎలుగెత్తి చాటింది. మహిళలను అవమానించినా, చెర పట్టాలని చూసినా ఎంతటి వారికైనా పతనం తప్పదని హెచ్చరించింది. జాతి హితం కోసం, దేశ క్షేమం కోసం అల్పజీవులు సైతం ఎలా సహకరించి వచ్చో ఉడుత, జటాయువు, సంపాతి వంటి సజీవ పాత్రల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించింది.
విచ్చలవిడి శృంగారం అనర్థ హేతువని వేలకోట్లు ఖర్చుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. సమాజంలో నానాటికీ నైతిక విలువలు లోపిస్తున్నాయన్న భావన సర్వత్రా కనిపిస్తోంది. పాశ్చాత్య విష సంస్కృతీ ప్రభావం, మీడియా, అంతర్జాలాల ప్రభావం పిల్లలను చెడు దారి పట్టిస్తున్నాయన్న వార్తలు విరివిగా వస్తున్నాయి.
మహిళలకు రక్షణ కొరవడిందన్న అంశాన్ని పత్రికలలో వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. ఇటీవల మన ముఖ్యమంత్రి మహిళా రక్షణ కోసం హైపవర్ కమిటీ వేసి అధ్యయనం కూడా చేయించారు. ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నట్టు ప్రకటించారు. వీటితోపాటు ఏక పత్నీవ్రతం ప్రబోదించిన రామాయణ గాధను ఉత్తర కౌమార దశలో ఉన్న విద్యార్థులకు బోధించడం ఎంతో ప్రయోజనకారి కాగలదు. పర స్ర్తిని తల్లితో సమానంగా చూడాలని సందేశమిచ్చిన రామాయణం, చెడు తలపెడితే సోదరున్ని అయినా సరే వదిలిపెట్టి ధర్మం పక్షాన నిలబడి పోరాడాలని చెప్పిన గాధను వివిధ స్థాయి విద్యార్థులకు పద్య, గేయ, వచన రూపాలలో అందించవలసిందే. తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్, పేదల పక్షాన నిలిచి పోరాడిన కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, శ్రీకాంతాచారి వంటి మేధావులు, యోధులు, త్యాగధనుల చరిత్రలు ఎంత ముఖ్యమో, విశ్వమానవాళి మహేతిహాసంగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడిన రామకథ కూడా అంతే ముఖ్యం. అంతేకాకుండా తెలంగాణ ప్రజానీకానికి భద్రాచల రాముడితో, రామదాసు కథతో ఎంతో భావాత్మక సంబంధం ఉంది. నవాబుల కాలం నుండి భద్రాచలంలో జరిగే రామకల్యాణానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపే సంప్రదాయం ఈ ప్రాంత మతసామరస్యానికి ప్రతీకగా చెప్తారు. తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర విభజన సమయంలోనూ ఇక్కడి ప్రజలు భద్రాచల రాముడిని దక్కించుకోవడానికి ఏ రకమైన భావావేశంతో పోరాడారో అందరికీ తెలుసు.
రామాయణం ఒక నీతి, రామాయణం జన జీవన రీతి. ప్రపంచీకరణ క్రమంలో వెర్రితలలు వేస్తున్న వింత పోకడల నుండి భావితరాన్ని రక్షించే రక్షణ కవచం. అందుకే రామాయణాన్ని పదవ తరగతి ఉపవాచకంగా కొనసాగించాలని ఎస్.సి.ఆర్.టి.కి ఒక విజ్ఞప్తి చేయడంతోపాటు ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.

