గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88 – 131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -88

131-గణితావదాన శేఖర –పులి వర్తి శరభా చార్యులు

విశ్వ బ్రాహ్మణ కుటుంబం లో పులివర్తి శరభాచార్యులు 1912లో జన్మించారు .సువర్ణ రుషి గోత్రీకులు .తండ్రి నాగ భూషణం ,తల్లి శేషమ్మ .తెనాలి తాలూకా కొల్లూరులో పుట్టారు .బి .ఏ .బి .ఇడి పాసై ప్రభుత్వ విద్యాశాఖలో ప్రవేశించారు .జిల్లా విద్యాశాఖాధికారిగా అంచే లంచేలుగా పదోన్నతి పొంది పదవీ విరమణ చేశారు .

శరభా చార్యులకు చిన్న నాటి నుండి ఆధ్యాత్మ గురువు లైన తత్వా నందుల  వారి శిష్యులుగా ఉన్నారు .దీనీతో ప్రభుత్వోద్యోగం చేస్తూనే ,ఆధ్యాత్మ భావ పరంపరాలలో ఉన్నత శ్రేణి సాధించారు .బాల్యం లోనే కవిత్వ ధార అబ్బింది . సంస్కృతం లో గొప్ప ప్రావీణ్యాన్ని సాధించి ‘’నివేదనం ‘’,’’మరుత్సందేశః ‘’ ‘’యశోధరా ‘’అనే కావ్యాలను ,’’కలాదర్శః ‘’అనే సంస్కృత నాటకాన్ని రాశారు .తెలుగులో ‘’కల్హార మాల ‘’,’’రత్న గర్భ ‘’,’’కర్మ భూమి ‘’రాశారు .ఆచార్య శ్రీ ఆంగ్ల భాషలోను నిష్ణాతులు .ఇంగ్లీష్ లో ‘’డాక్టర్స్ వార్ ‘’అనే కావ్యం రచించి ఆశ్చర్య పరచారు అంటే త్రిభాషా కవులన్న మాట .అందుకే ‘’త్రిభాషా కవి ‘’కవి బిరుదు నందుకొన్నారు .వీరు రాసిన సంస్కృత కావ్యాలను వంగవోలు ఆది శేష శాస్త్రి తెలుగులోకి సరస సరళ భాషలోకి అనువదించారు .

జిల్లా విద్యా శాఖాదికారిగా ఉంటూనే అస్టావదాన విద్యనూ నేర్చుకొని వందకు పైగా అవధానాలు చేసి రసజ్ఞుల మెప్పు పొందారు .గణితం లోనూ అవధానం చేయవచ్చు నని నిరూపించి ఆ విద్యను కనిపెట్టి ,ఆ విద్యలో ఆద్యులై   సాటి లేని మేటి అనిపించుకొని గణితావధానాలు  చేశారు .’’ఈ వింత అవధానం అందరిని ఆకర్షించింది చాలా ప్రదర్శనలిచ్చారు .’’గణితావదాన శేఖర ‘’గౌరవ పురస్కారాలనందుకొన్నారు .వీరు చేసిన అవధాన విశేషాలు, పద్యాలు అన్నిటిని సంకలితం చేసి ‘’అవధాన వాణి‘’ గ్రంధం గా విడుదల చేశారు .వినయం ,.విజ్ఞత మూర్తీభవించిన అవధాన శేఖరులు ఆచార్యుల వారు .జీవితమంతా ఆధ్యాత్మిక దారిలో  గడిపిన వీరు అతి నిరాడంబరం గా నే ఉండేవారు ఏనాడూ హళ్ళూ పెళ్ళూ, అధికారం ,ఆర్భాటం, హోదా, దర్జా, డాబు ,దర్పం లేకుండా నే  ఉన్నారు .ఎంత ఎదిగారో అంత ఒదిగి ఉన్నవివేక మూర్తి .ప్రజ్ఞా పాటవ ప్రదర్శనా చేయని హుందా తో కూడిన అరుదైన వ్యక్తిత్వం వారిది . అరవై ఎనిమిది సంవత్సరాలు ప్రజాసేవలో సాహితీ సుజనుల మధ్య గడిపిన పులి వర్తి శరభా చార్యుల వారు 1980లో శంభు లోకం చేరారు . .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -13-12-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.