గీర్వాణ కవుల కవితా గీర్వాణం – 91 – 137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని –పేరి సూర్య నారాయణ శాస్త్రి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం –   91

137-స్వర్ణ కమల గ్రహీత ,, నడిచే పాణిని  –పేరి సూర్య నారాయణ శాస్త్రి

 

గురుముఖ విద్య

20-8-1910జన్మ దినం గా కల పేరి సూర్య నారాయణ శాస్త్రి గారు విజయ నగరం జిల్లా పెదనందిపల్లిలో సర్వేశం ,సోమమ్మ దంపతులకు జన్మించారు .పేరి అప్పల నరసయ్య శాస్త్రి గారివద్ద కావ్య నాటక ,అలంకారాలను అధ్యయనం చేశారు .పేరి వెంకటేశ్వర శాస్త్రిగారి నుండి భాష్యంత వ్యాకరణంఅభ్యసించారు .’’వైయాకరణ భూషణ సారం ‘’ ,’’లఘు మంజూష ‘’,శబ్ద కౌస్తుభ ‘’,,’’భాట్ట దీపిక ‘’,’’కావ్య ప్రకాశిక ‘’,’’రస గంగాధరం ‘’గ్రంధాలను తాతారాయుడు శాస్త్రిగారి శిష్యరికం లో నేర్చారు .’’ఖండన అద్వైత ప్రస్తానం .’’,చతుస్తంత్రి ‘’,’’న్యాయ కాణాది ‘’మున్నగు వానిని పేరి లక్ష్మీ నారాయణ శాస్త్రి ,కొల్లూరు  సోమ శేఖర శాస్త్రి ,కొల్లూరు లక్ష్మణ మూర్తి శాస్త్రి ల నుండి గురుముఖతా అధ్యయనం చేశారు .

వ్యాకరణ బోధనా సామర్ధ్యం –

విద్యార్ధిగా ఉంటూనే ఉద్యోగం చేశారు .సింహాచల సంస్కృత పాఠ శాల అధ్యాపకులయ్యారు ..1940విజయ నగర మహారాజా వారి సంస్కృత కళాశాలలో అధ్యాపకుగా నియమింప బడ్డారు .ముప్ఫై ఏళ్ళు విద్యా బోధన కొనసాగించారు  వేలాది మంది  ప్రతిభా వంతులైన శిష్యులను తయారు చేశారు .’’కౌముది ‘’అంటే ఇనప ముద్ద అని భయపడే వారు బోధకులు అలాంటి అయః పిండమైన కౌముదిని వెన్నెల అంత ఆహ్లాదం గా శాస్త్రి గారు బోధించి మనసుకు ఆహ్లాదం కలిగించేవారు .ఒక రకం గా ‘’కౌముది శాస్త్రి ‘’గారు అనిపించుకొన్నారు .

అమూల్య గ్రంధ రచనా పాటవం

విద్యా బోధనా కొన సాగిస్తూనే అమూల్య గ్రంధ రచనా చేశారు .సంస్కృత భాషలో ‘’నాగేష లఘు మంజూష ‘’కు ‘’నాగేశ భావ ప్రకాశ వ్యాఖ్య ‘’,’’వైయాకరణ భూషణ సారం ‘’కు ‘’తత్వ దర్శిని ‘’వ్యాఖ్య ,’’’’ఖండ దేవా భట్ట రహస్యం ‘’కు ‘’భావ ప్రకాశ వ్యాఖ్య ‘’’’వైయాకరణ భూష సారం ‘’కు’’తత్వ దర్శిని వ్యాఖ్య ‘’,’’ఖండదేవ భాట్ట రహస్యం ‘ ‘’రచించిన మహా పండితులు సూర్య నార్యయన శాస్త్రి గారు .తెలుగు భాషలో న్యాయ ,వైశేషిక ,సాంఖ్య,పూర్వ మీమాంస ,ఉత్తర మీమాంస లకు వ్యాకరణ శాస్త్రాన్నికూడా జోడించి ‘’  షడ్ దర్శనములు’’ పేరిట అనువదించారు ‘’వ్రుత్తి విచార’’అనే గ్రంధం  ‘’పంచ వృత్తి  విచారం ‘’కు ఆంధ్రానువాదం గా రచించారు .పతంజలి మహర్షి ‘’అద్వైత ప్రకరణం ‘’ను ‘’ఆంద్ర వివరణ సారం ‘’,’’పరమార్ధ సారం ‘’గా తెలిగీకరించారు .’’భర్త్రు హరి వాక్య నదీయం ‘’ను  శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో కలిసి అనువదించారు .’’కుమార సంభావ విమర్శ ‘’ను శాస్త్రిగారు రాశారు .పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. అందులో ముఖ్యమైనవి ‘’స్పాటి స్పోటనం ,’’బహువ్రీహి సమాసం’’ బాగా ప్రసిద్ధి చెందాయి .ఆంధ్రా యూనివర్సిటి సైన్స్ అధ్యాపకులు వసంత రావు వెంకట రావు గారితోకలిసి ఆంద్ర ప్రభ లో ‘’కాల తత్త్వం ‘’ధారా వాహిక గా రాశారు .’’కౌముదికి ‘’తెలుగులో సులభ విధానం ‘’లో ‘’వ్యాకరణ సిద్ధాంత మంజరి ‘’పేరిట అనువాదం చేశారు .రసగంగాధర వ్యాఖ్యలన్నీ క్రోడీకరించి ‘’జగన్నాధ గూడార్ధ దీపిక ‘’రాసి జగన్నాధ పండితుని శేముషీ వైభవాన్ని ఆవిష్కరించి తన ఆరాధనా భావాన్ని చాటుకొన్నారు .

జంగమ పాణిని- అలంకారాలైన  బిరుదులు  సత్కారాలు

ఈ ప్రతిభను గుర్తించి శృంగేరీ పీఠాదిపతులు శాస్త్రి గారిని ‘’జంగమ పాణినః ‘’అంటే ‘’నడిచే పాణిని ‘’. ,అని గౌరవించి ఘనం గా సత్కరించారు .మన రాష్ట్రం లోనే కాకుండా ఉజ్జయిని జయపూర్ , ,పూనా మున్నగు ప్రదేశాలలో జరిగిన విద్వత్ సభలకు ఆహ్వానింపబడి  సన్మానితులయ్యారు .శాస్త్రి గారికి గొప్ప నటనా కౌశలం దర్శ కత్వ ప్రతిభా ఉన్నాయి ఉజ్జయిని నగరం లో 14 రాష్ట్రాల మధ్య ‘’కాళిదాస అభిజ్ఞాన శాకుంతల ‘’నాటక పోటీ జరిగితే అందులో ‘’రాజ పురోహితుడు ‘’గా నటించి నాటకాన్ని నిర్వహించి ప్రధమ స్థానాన్ని ఉత్తమ ప్రదర్శనకు ఉత్తమ నటనకు ఎంపికై ‘’స్వర్ణ కమలం ‘’బహుమతిగాపొందిన విశేష ప్రజ్ఞా శీలి .

వ్యాకరణ రత్న ,వ్యాకరణాచార్య ,ఉపనిషద్ధర్మ వాచస్పతి ,దర్శనా చార్య ,పద వాక్య ప్రమాణజ్న వంటి సార్ధక బిరుదులెన్నో శాస్త్రిగారిని వరించి  సార్ధకమై ,గౌరవం పొందాయి .’’విశ్వ సంస్కృత భారతి ‘’సంస్థ శాస్త్రి గారిని సగౌరవం గా ఆహ్వానించి లక్ష రూపాయల నగదు ప్రశంసా పత్రం అందజేసి సత్కరించింది .కాశీ  విశ్వవిద్యాలయం ‘’మహా మహోపాధ్యాయ ‘’గౌరవ బిరుదునిచ్చి గౌరవించి సన్మానించింది .అరవై వ ఏడు మీద పడినా , పదవీ విరమణ చేసినా శాస్ట్రి గారు  శిష్యులకు బోధించటం మాన లేదు .సంస్కృత బోధనా చేస్తూనే ఉన్నారు .రాజమండ్రి గౌతమీ విద్యా పీఠం,మంత్రాలయం ,తిరుపతి కేంద్రీయ విద్యా పీఠాలలో సంస్కృతం బోధిస్తూనే ఉన్నారు .అదే వారికి మహదా నందమైన వ్యాపకం గా ఉండేది .

ఎనభై అయిదేళ్ళు చక్కని ఆరోగయం తో   జీవించి ,అధ్యయన ,అధ్యాపన, గ్రంధ రచనలను నిరంతరం కొనసాగించి సార్ధక జీవి అనిపించుకొన్న పేరి సూర్య నారాయణ శాస్త్రిగారు1995 సెప్టెంబర్ లో ‘’సవిత్రు మండల నారాయణ మూర్తి ‘’ని చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-12-14-ఉయ్యూరు

.

 

 

 

.

 

 

ణం

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.