పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం-1
ప్రముఖ చిత్రకారులు ,కవి, నవలా, కదా రచయిత సమాచార శాఖోద్యోగి,ఆంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజుగారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచి సరసభారతిద్వారా మూడు నెలల క్రితం 21-9-14 బందరులో అందజేసిన’’ బాపు –రమణ ల స్మారక పురస్కారం ‘’ప్రదానంచేసిన రోజున రెండో సారి సన్నిహితం గా చూసి మాట్లాడే అవకాశం లభించింది .ఆనాడు ఆ దంపతులు ఇచ్చిన ‘’పడుగు పేకల మధ్య జీవితం ‘’అనే పుస్తకం నాలుగు రోజుల క్రితమే చదివే వీలు కలిగి చదివి ముగ్దుడినయ్యా . అది బాల్యం నుండి వివాహం దాకా వీర్రాజుగారి జీవిత చరిత్ర .దీర్ఘ కవిత .ఇందులో ఆయన కన్నీళ్లు కస్టాలు సుఖాలు దుఖాలు స్నేహాలు మానాలు అవమానాలు పురస్కారాలు ప్రోత్సాహాలు ,ఎక్కిన శిఖరాలు పడదోసిన అంశాలు అన్నీ పడుగూ పేకల్లా అల్లి రాసిన మనోహర కవిత .అన్నీ యదార్ధ సంఘటనలే .ప్రతి పదం శిల్పమే .ప్రతి వాక్యం చిత్రమే .ప్రతి పేజీ అనుభవానికి అద్దమే.నాకు ఏంతో నచ్చి మీలో ఎక్కువమంది చదివి ఉండరనే ఉద్దేశ్యం తో మీకు అందులోని స్వారస్యాన్ని అందజేయాలని రాస్తున్న నా చాపల్యం ఇది .ఎక్కువగా వీర్రాజుగారి మాటలనే ఉటంకిస్తూ ఆసొగసును అనుభవైక వేద్యం చేస్తున్నా .
తన పుట్టిన నేపధ్యాన్ని ముందుగా చెబుతూ రెండో ప్రపంచ యుద్ధం మరో అయిదు రోజుల్లో భూమిని ఆకాశాన్నీ ఏకం చేసే భయం తో విరుచుకు పడే ముందు రాజమండ్రి లో ‘’ఆసుకండేల పరుగులకీ –రాట్నం చక్రాల తిరుగుళ్ళకీ మధ్య నేత మగ్గాల రాత్రిం బవళ్ళ కదలికలకీ నిలయమైన ఓ చిరుగుల చేనేత పేటలో –హరికేన్ లాంతరు వెలుగులో’’ పుట్టానన్నారు .అప్పుడు ఆ వెలుతురూ ఇన్ని రంగుల్ని దాచిందని ,ఇంత అందం భూమ్మీద పరచుకుని ఉందని తెలీదట .ప్రతి శబ్దం లో సంగీతం ఒదిగిఉన్దని తెలీదు .అటక దూలానికి కట్టిన ఉయ్యాలలో ఊగానని ,అప్పుడే తొలిసారి సంగీతం విన్నాననీ ,నాన్న బుజం పై పడుకొని మొదటిసారి రంగుల ప్రపంచాన్ని చూశారు .మేనత్త చంకనేసుకొని తిప్పినప్పుడు ప్రపంచ అందాలు చూశారు .అన్నప్రాసనప్పుడు ఇష్టమైన పుస్తకాన్నే పట్టుకొన్నారు ‘’.ఊహ వచ్చాక బాల్యం రెక్కల గుర్రమైంది . వేళ్ళ సందుల్లోంచి జారిపోయి కాలం వెంట పరుగిడింది ‘’.
‘’ఉత్తరాంధ్రలో విజీనగరం’’నగరం అవతల నిత్యం నిద్రపోయే ‘’జామి ‘’కుగ్రామం నుండి వీరి పెద్దలు పందొమ్మిదో శతాబ్దం లో పాతిక చేనేత కుటుంబాలతో వలస వచ్చి రాజమండ్రి చేరి ‘’జాన్ దొర ‘’దయతో ఊరవతల ఊసర క్షేత్రం లో ఇల్లుకట్టుకొని కృతజ్ఞతగా ‘’జామ్ పేట ‘’అని ఎరుపెట్టుకొన్నారు ఆ ప్రాంతాన్ని .కులవృత్తి అయిన నేతను పక్కకు పెట్టి తాతలు వ్యవసాయం చేసి కూడబెట్టిన దాన్ని తండ్రులు హారతి కర్పూరం చేశారు .’’నేను అడుగు పెట్టేసరికి పూర్నానుస్వారమైంది ‘’అని గోడు వెళ్ళ బోశారు .కాకిపిల్ల కాకి కి ముద్దు అయినట్లు ఎవరిబాల్యం వారికి ముద్దే కదా .ముచ్చటేకదా ‘’బాల్యం అంటే జ్ఞాపకాల పొరల మధ్య దాచుకొన్న నెమలి కన్ను ‘’అన్నారు .అది చైతన్యం తో మెరుపు జలతారై తనను అలరిస్తూనే ఉందనిసంబరపడ్డారు .గోదారి తనకు పరుగు నేర్పిందట .ఏపని చెప్పినా పరిగెత్తుకు వెళ్లి చేసేయ్యటం ,రివర్స్ గేర్ లో వెనక్కి పరుగు పరుగున రావటం అలవాటై స్కూలు పరుగుపందాల్లో బహుమతులకు తోడ్పడింది .మన బాల్యమూ ఇలానే గడిచింది .రాళ్ళు తగిలి తూలిపడి మోకాలి చిప్పలు డొక్కు పోయాయి ఎన్నో సార్లు .ఆ మచ్చలు లు నేటికీ సాక్ష్యాలు .అక్షరాభ్యాసం నాడు ఆర్భాటం గా రిక్షాలో ఊరేగి స్కూల్ కు వెళ్ళారు. అది తమకు తలకు మించిన ఖర్చే అయినా ‘’చదువుకొని ఆఫీసరై కడుపులో చల్ల కదల కుండా తమని కూచో బెట్టి ఉద్ధరించి ఊళ్లేలుతాడని ‘’ తండ్రి అంతటిఖర్చు చేశారట .కాని ఆనాడు ‘’చదువూ అర్హతా ఉన్నా ,ప్రమోషన్ లకు సవా లక్ష అడ్డంకులు ఉంటాయని –ఇతరేతర అర్హతలతో ఈజీగా నిచ్చేన్లేక్కి పోవచ్చని ‘’ఆ నాడు తన తండ్రికి తెలీదన్నారు .’’తమ ‘’బంగారు కొండ ‘’ఎంజీవోగా చేరి ఎంజీవోగానే పదవీ విరమణ చెయ్యాల్సి వస్తుందని సత్తెకాలపు మనిషి పాపం !నాన్నకి తెలీదు ‘’అన్నారు .
‘’యుద్ధాన్ని రెక్కల మీద మోసుకు పోతున్న విమానాల్ని చూసి –కళ్ళల్లో కాంతి మలగి –‘’భయం తో మాటిమాటికీ ఆకాశాన్ని చూసే పెద్దల ను చూసిన తనలాంటి పిల్లలకు ఆశ్చర్యమే .వారి ఆందోళనలు వీరికి తెలీని విషయాలు .ఎప్పుడూ చూడని ‘’లోహ పక్షులు ‘’ఈ అక్కు పక్షుల అక్షులకు వినోదం .’’కోడి గుడ్డు బుడ్డి కిరసనాయిలు దీపం వెలుగులోనే కునికిపాట్లు పడుతూ సాగింది ‘’ఆయన చదువు .ఆనాటి మనకూ అంతేగా .ఇంట్లో హరికేను లాంతర్ ఉన్నా ‘’అది కిరసనాయిలు తాగు బోతు’’అని దాన్ని వెలిగించేవారు కాదు .పెద్దాబాల శిక్షతో వేసిన చదువు పునాది బలంగానే పడిందట .
‘’జన్మన్ సిల్వర్ పాత్రల పోతలతో ,శ్రమ జీవుల చెమట పూతలతో ఎప్పుడూ హడావిడిగా ఉండే బస్తీలో ‘’నిదానం గా చదువుల ప్రస్తానం సాగింది .రామమూర్తి మేస్టారికి అర్ధో రూపాయో నెలసరి జీతం తో అక్షరాభ్యాసం ఆరంభమై నాలుగులో ప్రైవేటు చదువు మొదలై టైం మిగిలితే బొమ్మలేయించేవారు మేష్టారు. అప్పుడే ‘’ఎదుట ఉన్న మునిసిపాలిటీ వీధి లాంతర్ని చూసి అప్పుడే ఆకాశం లో ఎగిరిన విమానాన్ని గుర్తించి ఆ రెంటి మధ్యా ఒక ఇల్లు సృష్టించి ‘’పంతులుగారికి చూపి మెప్పుపొంది అరచేతిలో ‘’శ్రీ మార్కు ‘’పడటం అంబరాన్ని అంటే సంబరాన్ని కల్గించి అ పలకను పదిలంగా ఇంటికట్టుకెళ్ళిఅమ్మానాన్న మేనత్త ల అభినందన చూపుకు పులకించారు .పెదనాన్న చేతిలో పెట్టిన ‘’ప్రైజ్ మనీ అణాకాసు ‘’కు మురిసిపోయారు.ఆయన రంగు పెన్సిళ్ళు రెండు కొనిచ్చిన ప్రోత్సాహం తో బొమ్మలపై విజ్రుమ్భించారు .అప్పుడే తెలిసిందట ‘’నాచేతిలో బొమ్మల గీత ఉన్దని ,ఓపిగ్గా కూచుని వేస్తె పొందిగ్గా రేఖలు కుదురుతాయని ,చక్కగా బొమ్మలు వేయ గలను ‘’అని .చిన్న ప్రోత్సాహం ఎంతటి బలీయమైన ఆలోచనకు పునాది అయిందో తెలుస్తున్దిమనకి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-2-15- ఉయ్యూరు
