పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కో వలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
సుమారు 80ల్లో ప్రారంభమైన అస్తిత్వవాద సిద్ధాంతాన్ని 80ల ముందు వచ్చిన కథలకు అన్వయించి చర్చించటం – అదీ కోస్తాంధ్ర ప్రాంత కథలకు అన్వయించటం సాహసమే అవుతుంది. అయితే ఇతర ప్రాంతాలకు ఉన్నట్లే కోస్తాంధ్ర ప్రాంతానికి ఉన్న ప్రత్యేక ముద్ర కలిగిన, స్థానీయ వాస్తవికతతో ముడిపడిన వస్తువుతో వచ్చిన కథలను పరిగణనలోకి తీసుకుని వాటిని చర్చించటం ఉపయుక్తంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా కథల్లో అక్కడక్కడా తొంగి చూసే అస్తిత్వవాద ఛాయల్ని పసికట్టి వాటి మూలాలను శోధించి చర్చించటం కొంతవరకు సబబు.
ఇలా చర్చించటం, విశ్లేషించటం ఈ ఒక్క వ్యాసంలో అయ్యే పనికాదు. ఆ చర్చకు ఈ వ్యాసం ఏ మాత్రం దోహదం చేసినా చాలు. తొలి నుంచీ తెలుగు సమాజంలో జరిగిన ఉద్యమాలు, స్థానీయ పరిణామాలు సాహిత్యానికి ప్రేరణగానో, మార్గదర్శకంగానో నిలిచినట్లే కథా సాహిత్యానికీ నిలిచాయి. కథా వికాసానికి దోహదం చేశాయి. స్థానీయ సమస్యల చిత్రణతో రాసిన రచనలు, అందులోని పాత్రలు విశ్వజనీనతను సంతరించుకోవటం ఈ పరిణామంలో గుర్తించదగిన అంశం. అందుకు ముఖ్యమైన ఉదాహరణ కన్యాశుల్కం నాటకం. విజయనగర సంస్థానంలో కొన్ని బ్రాహ్మణ అగ్రహారాలకి మాత్రమే పరిమితమైన కన్యాశుల్క దురాచారాన్ని నిరసిస్తూ గురజాడ అప్పారావు 1908 (మలిముద్రణ) లో రాసిన ఈ నాటకం ఆ సమస్యలేని ప్రాంతాల్లోనే కాక (వర విక్రయ ఆచారం ఉన్న ప్రాంతాల్లో కూడా) నూరు సంవత్సరాలు దాటినా నేటికీ సజీవంగా నిలబడింది. ఆయనే రాసిన ‘దేవుళ్లారా మీ పేరేమిటి’ కథ కూడా అంతే. అండప్రాయమైన చిన్న విషయంతో ప్రారంభమైన ఈ కథ మూఢాచారాలను నిరసించటంతో పాటు మరో 30 ఏళ్ళ తర్వాత మొదలైన స్ర్తీ స్వేచ్ఛ అనే విస్తృతాంశాన్ని ఆనాడే చర్చించి-వస్తువుకి విశ్వజనీనతను సంతరించి పెట్టింది. ఇలా స్థానీయత నుంచి విశ్వజనీనతకు విస్తరించటంలో తెలుగు సాహితీ ప్రక్రియల ఆరంభ దశ ఒక అద్భుతమైన చారిత్రక పరిణామంగా భావించవచ్చు.
ఉత్తరాంధ్రలో ప్రారంభమైన ఈ సాహితీ ప్రాభవం నెమ్మదిగా దక్షిణాంధ్రకూ విస్తరించింది. దీనికి కొంతకాలం గోదావరి మండలం, తర్వాత నెల్లూరు, గుంటూరు మండలాలు, అనంతరకాలంలో కృష్ణా తీర ప్రాంతాలు ఆలవాలమైనా యి. ఈ ఆధునిక సాంస్కృతిక భావజాలం ముందుగా గోదావరి మండలాలకు తాకటానికి ఉన్న చారిత్రక కారణలను ఒకసారి పరిశీలిద్దాం.
1832లో గోదావరి మండలాన్ని కుదిపేసిన నందన కరవు (నందన నామ సంవత్సరంలో వచ్చిన) వందలాది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ చొరవతో 1850లో పూర్తయిన గోదావరిపై ఆనకట్ట (ధవళేశ్వరం ఆనకట్ట) ఆ ప్రాంతపు రూపు రేఖలను సమూలంగా మార్చివేసింది. వ్యవసాయ పద్ధతులు మారాయి. చిత్తడినేలల వ్యవసాయం కాలవ నీళ్ళ వ్యవసాయంగా మారింది. ప్రజల జీవన స్థితిగతుల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఇదే కాలంలో ఈ ప్రాంతంలో కొత్తగా స్థాపించబడిన వందలాది పాఠశాలలు ఒక తరం ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసాయి. దీనికితోడు క్రైస్తవ మత ప్రచారం ఊపందుకుంది. దళిత, బహుజన కుటుంబాల్లో చైతన్య దీప్తి ఆరంభమయింది. వ్యాపార పంటలతో సంపద పోగుపడింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో సంపర్కం ఏర్పడింది. ముఖ్యంగా బెంగాలు ప్రాంతంతో, అక్కడి నుంచి వెల్లువలా వచ్చిపడుతున్న సాంసం్కృతిక పునరుజ్జీవనపు ఆధునిక పోకడలకు తోడు అభ్యుదయ భావజాలానికి గోదావరి మండలం నెలవయింది. ఈ మొత్తం పరిణామం సీ్త్ర విద్య, స్ర్తీ పునర్వివాహం, సీ్త్రస్వేచ్ఛ, దళిత బహుజన కులాల ఆత్మ స్థైర్యం మొదలైన సామాజికాంశాలకు ఊపిరులూందింది. ఈ క్రమంలో వచ్చిన కథా సాహి త్యం తెలుగు కథా సాహితీ వికాసానికి మార్గదర్శి అయింది. ఈ దశలో స్థానీయ సమస్యలను చిత్రంచిన కథలు విశ్వజనీన దృక్పథాన్ని సంతరించుకున్నాయి. తొలినాళ్ళలో శ్రీపాద ‘అలాంటి తవ్వాయి వస్తే’, ‘అరికాళ్ల క్రింది మంటలు’, ‘కొత్త చూపు’, ‘మార్గదర్శి’ కథలు ఆధునిక భావజాల పునాదిపై నిర్మించిన కథలుగా కలకాలం నిలబడిపోతాయి. అంటరానితనాన్ని నిరసించటం, సీ్త్ర పునర్వివాహం, వ్యాపార దృక్పథం వస్తువుగా వచ్చిన ఈ కథలతో పాటు చింతా దీక్షితులు, ముద్దు కృష్ణ రాసిన కథలు ఈ కాలానికి ప్రతీకలు. నేటికీ అవి కొత్త కథలుగానే అనిపిస్తాయి. వాటికున్న విశ్వజనీనత అది.
కోస్తాంధ్ర ప్రాంతానికి నదులు ఆభరణాలు, ఆ నదుల చుట్టూ ఎంతో సంస్కృతి, జీవన విధానం అల్లుకుని ఉన్నాయి. అటు నెల్లూరు మండలంలోని పెన్నానది, ఇటు గోదావరి, కృష్ణానదులు, ఈ ప్రాంతాలకు జీవధారలు. వీటిమీద ఆనకట్టలు కట్టాక చుట్టూ కాలువలు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత చేతివృత్తులు…వచ్చిన పంటలు ద్వారా పోగుపడిన సంపద, దాని ద్వారా అభివృద్ధి అయిన వ్యాపారం.. ఇలా మొత్తం కోస్తాంధ్ర సంస్కృతీ వికాసానికి నదులు పట్టుకొమ్మలుగా నిలిచాయి. నదీపరీవాహక ప్రాంతాల జీవన సంస్కృతి మీద ఎన్నో కథలు వచ్చాయి. ఇవన్నీ ఇక్కడి ప్రత్యేకతలు ఒడిసి పట్టుకున్నాయి. అలా వచ్చిన కథల్లో నదుల అందాలను వర్ణించినవీ, వరదకాలపు కష్టాలను చిత్రించినవీ, నదులను ఆరాధించినవీ, నదితో పంచుకున్న జీవితానుభవాలను పంచినవీ ఎన్నో కథలున్నాయి.
కవికొండల వెంకటరావు గోదావరి వరద కష్టాలను కళ్ళ ముందుంచితే, కళ్ళు చెదిరే గోదావరి అందాలను బి.వి.ఎస్. రామారావు గోదావరి కథలుగా తీర్చిదిద్దితే, ఈ అందాలకు మానవ ప్రవృత్తిలోని మౌలిక లక్షణాలను జోడించి పాలగుమ్మి పద్మరాజు తాత్వ్తిక కోణాన్ని చూపించారు. గోదావరి తీర ప్రాంతం మీద డజన్ల కొద్దీ కథలు రాసిన వంశీ (80ల తర్వాత) రాసిన కథలో పోలవరం ప్రాజెక్టు కట్టాక భవిష్యత్ గోదావరిని ఆవిష్కరించారు. తొలితరంలో గౌతమీ గాథలను ఆవిష్కరించిన ఇంద్రగంటి హనుమత్చ్ఛాసి్త్రనీ మర్చిపోలేం. స్వాతంత్ర్యానంతరం గోదావరి నదిపై డజన్ల కథలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు.
తెలుగు కథా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేవి సాహిత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు. ఇవి ప్రధానంగా కృష్ణా తీర కథలు. వీటిల్లో రచయిత ప్రతిపాదించిన మానవతా విలువలు, సంప్రదాయక ఆధునిక భావజాలాల మేలు కలయక పాఠకులను తామెక్కడివారైనా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తాయి. కృష్ణానది సముద్రంలో కలిసేప్రాంతంలో ఏర్పడిన లంకల్లోని ప్రజల జీవన స్థితిగతులను, విలువలను చిత్రించి పోలవరపు కోటేశ్వరరావు కృష్ణాతీరం కథలు తీర జీవనానికి మంచి వ్యాఖ్యానాలు. పెన్నాతీరం, గుండ్లకమ్మ తీరం కూడా కథావస్తువయింది. ఇవన్నీ ఈ ప్రాంత అస్తిత్వ సూచికలు. స్థానీయ వస్తువుతో రాసిన ఈ కథలన్నీ సార్వజనీనమైన మానవతా విలువలను, విలువల వైరుధ్యాలలోని సున్నితత్వాన్ని, వాటి సాంఘిక నేపథ్యాన్ని ప్రతిపాదించాయి. వీటన్నిటిలో అంతర్లీనంగా కనబడే పాత్ర నది. తెలుగు కథా సాహిత్యంలో కోస్తాంధ్ర ముద్ర స్పష్టంగా కనబడే కథలివి. నదుల కథలపై ప్రత్యేక అధ్యయనం అవసరం.
నీళ్ళు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి కారణమైన ఈ సందర్భంలో తప్పనిసరిగా ఉదహరించవలసిన కథ నీళ్ళు. రచయిత పెద్ధిభొట్ల సుబ్బరామయ్య. నీటి కొరత తెచ్చిపెట్టే ‘అనాగరిక’ జీవనానికి, నీరే సంస్కృతిగా భాసిల్లే ‘నాగరిక’ జీవనానికి మధ్య సాగిన అంతర్గత వైరుధ్యాల సమరం ఈ కథ. నీటికి నాగరికతకు ఉన్న సంబంధాన్ని నీటికొరత ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన యువకుడి కోణం నుంచి చెప్పిన కథ. అంతేకాదు, నీటిపై పెత్తనాన్ని నీటి నాగరికత ద్వారా ఏర్ప డిన దురహంకార భావజాలాన్ని ప్రశ్నించిన కథగా కూడా దీన్ని ఉదహరించవచ్చు. (ఆశ్చర్యమేమంటే ఈ కథలోని రెండు పాత్రలు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినవారే కావటం) ఈ ప్రశ్న నెమ్మదిగా ప్రాంతీయ అస్తిత్వవాద రూపును సంతరించుకున్న ఉద్యమాన్ని నడిపించింది.
కోస్తాంధ్ర ప్రాంతం మీద ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. మరీ ముఖ్యంగా, కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఈ రెండున్నర జిల్లాల భాషను ఆధిపత్యవాద దురహంకారంతో మొత్తం తెలుగు భాషగా ప్రామాణీకరించారని. అంటే ఇప్పుడు పత్రికల్లో, సినిమాల్లో, ఇతర మాధ్యమాల్లో వాడుతున్న భాష అంతా ఈ రెండున్నర జిల్లాలదని దీనర్థం. ఈ క్రమంలో ఇతర ప్రాంత మాండలికాలు దెబ్బతిన్నాయనేది ఈ ఆరోపణల్లో ప్రధానాంశం. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను కాసేపు పక్కనబెట్టి ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించాలి. ప్రసార మాధ్యమాల్లో ఇతర ప్రాంత మాండలికాలను అవహేళన చెయ్యటం, తక్కువ పాత్రలకు ఆపాదించటం వెనక దురంహంకారం, ఆధిపత్యం ధోరణి ప్రస్ఫుటంగానే కనబడుతుంది. ఈ ఆరోపణల్లో తప్పిపోయిన మరో ముఖ్య విషయం- రెండున్నర జిల్లాలు ఈ ప్రామాణీకరణ క్రమంలో తమ తమ మాండలికాలను దారుణంగా పోగొట్టుకున్నాయన్నది. అక్కడక్కడ, అప్పుడప్పుడు గుంటూరు మాండలికం కనబడుతుంది కానీ కృష్ణా, గోదావరి (పశ్చిమ) మాండలికాలు ఏమయ్యాయో అంతు చిక్కదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే..
వ్యాపారీకరణ సూత్రంగా ఎదిగిన, కోస్తా ప్రాంతాల పెట్టుబడిదారులు, ప్రసారమాధ్యమాల ద్వారా ప్రామాణీకరించిన భాష నిజానికి రెండున్నర జిల్లాల భాష కాదు. ఈ ప్రామాణీకరణ క్రమంలో ఈ రెండున్నర జిల్లాల సొంపైన మాండలికాలెన్నో కాలగర్భంలో కలిసిపోవటం వాస్తవమైన విషాదం. మాండలిక భాషపై ఎంతో ప్రేమాభిమానాలున్న సాహిత్యాభిమానులకు ఈ ప్రాంత మాండలికాలు కనుమరుగై పోయాయన్న ఆవేదనతో పాటు, రెండున్నర జిల్లాల ఆధిపత్య వాదులుగా (భాష విషయంలో) ముద్ర వేయించుకోవటం మరింత బాధాకరం.
ఇటీవల అక్కినేని కుటుంబరావు నవల కొల్లేటి జాడలు లోని మాండలిక పదాలను చదువుతోంటే ఒళ్ళు పులకరించి పోయింది. తెలంగాణ, రాయలసీమ, ఉత్త రాంధ్ర మాండలికాలను ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకున్న నా బోటివాడికి నా మాండలికం నాకు తెలియకపోవడం, రాయలేకపోవటం, ఆత్మహత్యా సదృశ్యమైన విషాదం. దీనికి కారణాలేమిటి?
కరుణకుమార నెల్లూరు మాండలికంలోను, మా గోఖలే గుంటూరు మాండలికంలోను కథలు రాసిన రోజుల్లోనే కృష్ణా, గోదావరి జిల్లాల రచయితలెవరూ ఆయా మాండలికాల్లో రాయలేకపోవటానికి ఏ పెట్టుబడి దానిని మింగేసిందో ఆలోచించాలి. (ఒకటి రెండు కథలు రాసిన కొసరాజు-అవును ఏరువాక సాగాలో.. పాట రాసిన కొసరాజే-దీనికి మినహాయింపే) ఇటీవల పోలవరపు కోటేశ్వరరావు, అక్కినేని కుటుంబ రావు రాసిన కథల్లో మాత్రమే ఒకటి రెండు మాండలికాలను వెతుక్కోవలసి రావటం ఈ ప్రాంత అస్తిత్వవేదన కాక మరేమిటి?
ఈ వేదనలోంచి భాష విషయంలోనైనా అస్తిత్వ చైతన్యం, ఉద్యమం ఈ ప్రాంతంలో మొదలవుతాయేమో చూద్దాం!
వాసిరెడ్డి నవీన్
(‘తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం’ సంచికలో ‘ప్రాంతీయ అస్తిత్వ మూలాల వెలుగులో కోస్తాంధ్ర కథ (1948-80)’ శీర్షికతో రాసిన సుదీర్ఘ వ్యాసంలోని కొన్ని భాగాలు)