సర్వేశ్వర శతకం
శ్రీ చెముడుపాటి వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన చేసుకొన్నాడు .ఆ మహిమతొ యీశతక౦ రాసి ,స్వానుభావాన్ని లోకానికి చాటాడు .బాల్యం నుంచి హూణ విద్య మాత్రమె నేర్చి ,రాజకీయోద్యోగంలోనే జీవితం గడుపుచూ ,సద్గురు కటాక్షం ,సాధనా బలం వలన సత్కవిగా పరిణమించటం దైవ బలాన్ని సూచిస్తోంది ‘’అని వెన్ను తట్టారు .శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ఈ శతక మకుటం –‘’సర్వేశ్వరా ‘’.
మొదటి మత్తేభం-‘’చదువా లేదు ,పురాణమన్న నెరుగన్ ,శాస్త్రం బదెట్లుండునో-పదమా తోచదు శయ్య వృత్తియెరుగన్బద్యంబు లల్లంగా గో
విదుడన్ గానిక ,దప్పులన్ విడిచి తృప్తిన్ నాదుపద్యాళిలో –దుదిపాదంబున నొప్పు నామ సుధనెంతో గ్రోలి నాదండముల్ –పది వేల్ గైకొని భక్తులార తరియి౦పన్ మిము వేడెదన్ ‘’అని ఆపద మొక్కులు మొక్కి దండం అంటే నమస్కారం దశ గుణం భజేత్ అన్నట్లు తనలో ఏమీ లేకున్నా ఓపికగా చదివి తరియించమని గడుసుగా చెప్పి ,బోనస్ గా అయిదవ పంక్తి కూడా చేర్చాడు .తర్వాత శ్రీరామస్తుతి చేసి శివ శివాలకు మొక్కి –‘’ఆధారంబు పయిన్ షడక్షరయుత ,ప్రాంచద్దళో పేతమై -బోధ బ్రాహ్మి సకామ బీజములచే బొల్పోంది తానిత్యమున్
సాధిష్టాన విదాతయై రుధిర రమ్యంబౌ నుపస్థాశ్రిత –స్వాధిష్టాన నివాస మొందుజననిన్ బ్రార్ధింతు సర్వేశ్వరా ‘’అని గహన వేదాంతాన్ని అమ్మవారి నివాసాన్నీతన వేదాంత పరిజ్ఞానం జోడించి రాశాడు .’’శ్రీ కాంతా వల్లభ పాదుకాంచిత శిరున్ గా౦భీర్యయుక్తున్ గపిన్ ,ఉపనిషత్సంపూర్ణ పా౦డినత్యు దీమంతున్మారుతి మత్కృతిన్ సతతంబు మన్నింపగా ‘’స్వాంతంలో భజిస్తానన్నారు ..కపి అంటూనే ఆయనలో సర్వదిషణకు నీరాజనం పట్టారుకవి తర్వాత కవులందరికీ దండాలుపెట్టారు .
అందరు కవుల్లాగానే తన పాపాల చిట్టా విప్పారు .అందరూపొందే లోభమోహ మదమాత్సర్యాలు తననూ పీడించాయన్నారు .సద్గురరు దర్శనం తో తనజీవితం గాడినపడి శస్త్రాలు తత్వాలు చదివి జ్ఞానం పొందానన్నారు .తల్లీ తండ్రీ కొడుకు బంధువులు అన్నీ నేవే అనే ఎరుక నిలిచి ఉంచమని సర్వేశ్వరుని వేడారు .’’నామనము నందు దుఃఖము లంటనీక సన్మార్గంబు నందుంచు ‘’అని వేడికోలు చేశారు .’’కామాంధులు కా౦తావాస మతిన్ ‘’త్రికూట’’ ముపయిన్ గన్గొందు సదా ‘’అని ఈసడించారు .
బిందు నాదాల సౌభాగ్యోన్నత ప్రభావమైన కళ.దీన్ని చూస్తూ ప్రజ్ఞానియై నిర్వృతి తో ఉంటేనే సన్యాసం లభించి ముక్తిమార్గం కనిపిస్తుంది .తర్వాత ఉదయ ప్రార్ధనం,జ్ఞాన ప్రభాతం ,రాత్రిధ్యానం ,మానసిక ధ్యానం ,ఉదయ సాయం సమయాలలో చేసే మానసికపూజ షోడశోప చారాలతో పద్యాలలో చెప్పారు .చివరగా –‘’వరదా! నే శత వందనంబులిడి నా వైరాగ్య పాత్రంబునన్ –భరమౌ కర్మ చయంబనా బరగు కప్ర౦బున్ వెలిగింతు భా-స్వర నీవారజ శూక సూక్ష్మమగు ప్రజ్ఞాన దీప్తిన్ విభూ –స్థిరమై మంగళ హారతి౦గొనుచు దృప్తిం బొందు సర్వేశ్వరా ‘’అని మంగళం పాడారు .
విద్వన్నుత మండపాక కలశామ్భో రాశి చంద్రుడు ,సత్కవి వర్యుడైన పార్వతీశ్వరుడు విద్వాంసుడు నా మిత్రుడు ,నా కవిత్వంలో తప్పులు సవరించి ,నన్ను వివేకిగా లోకం ముందు నిలబెట్టాడు ఆమహనీయుని ఔదార్యం తో ‘’బ్రోవగా భవదీయాన్ఘ్రి సరోజముల్ గొలుతు నీ భక్తుండ సర్వేశ్వరా’’అన్నారు . .వెంకటార్య అనే ఆయన కొడవంటి అప్పలశర్మ గారి ద్వితీయ పుత్రులు ,రాజమండ్రి వీరభద్రపుర వాస్తవ్యులు .ప్రస్తుతం అంటే ఈ శతకం రాసే సమయం లో మహానంది పర్వతం పై తపస్సు చేస్తున్నారని మనకు తెలియని మరో విషయాన్ని తెలియజేశారు కవి .
తనకేమీ తెలీదు అంటూనే తత్వాన్ని కవిత్వంలో అందంగా బహుకమ్మగా బంధించి మనకు అందించారు ,కవి .వారినీ వారి శతకాన్ని పరిచయం చేసే భాగ్యం ఆ ‘’సర్వేశ్వరుడు’’ నాకు ప్రసాదించాడు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-10-22-ఉయ్యూరు
