కొందరు ప్రముఖ ఆధునిక రెడ్డి కవులు -5
సాహిత్య సాంస్కృతిక వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి -2
సురవరం వారు గోల్కొండ పత్రిక లో రాసిన సంపాదకీయాలను చదివి ఎందరో ప్రభావితులయ్యారు .విషయ అవగాహనకు అవి బాగా తోడ్పడేవి .తెలంగాణా లో కవులే లేరని ఎవరో ఎద్దేవా చేస్తే తెలంగాణా కవుల రచనల నన్నిటిని సేకరించి గోల్కొండ పత్రిక లో ప్రచురించి దీటైన సమాధానమిచ్చారు .ఆ కవులను ఆంద్ర దేశానికి పరిచయం చేసి తన భాషాభిమానాన్ని చాటుకొన్నారు .ఆధునిక కదా రచయిత గా ప్రతాప రెడ్డి గారు ప్రసిద్ధి చెందారు .’’ప్రతాప రెడ్డి కధలు ‘’పేరిట ప్రచురితమయాయి .తెలంగాణా జీవితాన్ని ,భాషను కధల్లో ప్రతి ఫలింప జేశారు .ఆయనరాసిన ‘’నిరీక్షణ ‘’కద ఉత్తమమైనదని విమర్శకాభి ప్రాయం .అధిక్షేపం అంటే ‘’సటైర్ ‘’తో కొన్ని కధలు రాశారు .దేశభక్తుల ,ధర్మవీరుల ,వీర శిఖామణుల జీవిత చరిత్రలు రాసి చరిత్ర లో వారికి గొప్ప స్తానం కల్పించారు .రాజ బహదూర్ వెంకట రామి రెడ్డి గారి జీవిత చరిత్రను శ్లాఘనీయం గా రచించారు
చారిత్రిక పరిశోధక పరబ్రహ్మ
ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి పరిశోధన మరో ఎత్తు .ఇవీ బహుళ ప్రచారం పొందాయి .’’హిందువుల పండుగలు‘’ను మంచి శైలిలో ,ప్రామాణికం గా రాశారు .పండుగల ప్రాధాన్యాన్ని ,అందులో చారిత్రిక ,శాస్త్ర రహస్యాలను తెలియ జేసి మహోపకారం చేశారు .దీనికి మహాతత్వ వేత్త ,భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు పీఠిక రాయటం బంగారానికి తావి అబ్బి నట్లయింది .రామాయణం లోని అనేక విషయాలను విశ్లేషించి వెలుగు లోకి తెచ్చారు .’’ఆంధ్రుల సాంఘిక చరిత్ర ‘’సురవరం వారి అపూర్వ సృష్టి .అప్పటికీ ఇప్పటికీ ఉత్తమ గ్రంధం గా అగ్రభాగాన నిలిచింది .ఒక రకం గా ఇది తెలుగు వారి జీవన సర్వస్వం అన వచ్చు .క్రీ.ష.1050 – నుంచి 1950 వరకు అంటే 900సంవత్సరాల మధ్య ఉన్న కాలానికి సంబంధించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇది .కళలు మతం ,రాజకీయాలు ,వ్యాపారం ప్రజా జీవన సరళి వినోదం విజ్ఞానం ,ఆచారాలు ,అలంకరణలు ఆటలు ,పాటలు ఒకటేమిటి సర్వస్వాన్ని మన ముందుంచిన అపూర్వ పరిశోధన గ్రంధం .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు పొందిన మొట్ట మొదటి తెలుగు పుస్తకం .మన చరిత్రను ఆవిష్కరించిన మహనీయ గ్రంధం .ఉత్రేక్షలు ,ఉపమానాలు లేకుండా నిసర్గ రమణీయం గా ,సూటిగా ,హృదయాలకు హత్తుకొనేలా కదా కదన పద్ధతిలో సాగిన అద్భుత రచన .ఆంధ్రుల బహుముఖీన వికసనానికి నిలు వెత్తు దర్పణం .ఇదొక్క పుస్తకం చాలు రెడ్డి గారిని చిరస్మరనీయుడిని చేయటానికి అందుకే పరిశోధక పరమేష్టి అని పించుకొన్నారు .సువారవరం పేరు చెబితే ముందు గుర్తొచ్చేది ఆంధ్రుల సాంఘిక చరిత్ర .ఆ పుస్తకం పేరు చెబితే గుర్తొచ్చేది ప్రతాప రెడ్డి గారు .
ఇది కాక ,’’సంఘోద్ధరణ ‘’’’,గ్రామ జన దర్పణం ‘’,’’నిజాం రాష్ట్ర పాలన ‘’,మొదలైన పరిశోధనా గ్రంధాలూ రెడ్డి గారు రాశారు .’’యువజన విజ్ఞానం ‘’వీరి మరో రచన .ప్రజల ప్రాధమిక హక్కుల గురించి ‘’ప్రజాదికారాలు ‘’అనే ఉప యుక్త గ్రంధం రాశారు .ఎన్నో గ్రంధాలకు పీఠికలు రాసి ‘’పీఠికాదిపతి ‘’అని పించుకొన్నారు .’’తెలుగు లిపి–సంస్కరణ ‘’పై పుస్తకం రాశారు .సురవరం స్పృశించని ప్రక్రియ లేదు .స్పృశించి స్వర్ణం గా మార్చని ది లేదు .ఆయన రాసింది అంతా పరమ ప్రామాణిక మైనదని నిర్ధారించారు .ఇంతటి తో ఆగిపోలేదు ‘’వ్యక్తి చిత్త్రణ ‘’లో సిద్ధ హస్తులైనారు .మాడపాటి హనుమంత రావు గారిని గురించి సురవరం ఉ రాసిన వ్యక్తి చిత్రణ అంటే ‘’ప్రొఫైల్ ‘’ఒక కళా ఖండం అంటారు దేవుల పల్లి రామానుజం గారు .
అనేక మంది యువకులను ప్రోత్సహించి రాయించి పత్రికలో ప్రచురించేవారు .వెర్రి వెంగళప్ప ,గద్వాల సిద్ధాంతి ,చిత్రగుప్త ,భావకవి రామ మూర్తి ,శ్రీశకుమార్ ,యుగపతి అనే మారు పేర్ల తో చాలా రాశారని రామానుజ రావు గుర్తు చేసుకొన్నారు .’’ప్రజా వానణి ‘’అనే దిన పత్రికనూ కొంతకాలం రెడ్డి గారు నడిపారు .పత్రికా ముఖం గా వాదోప వాదాలను ఆహ్వానించే వారు ‘’శ్రీ కృష్ణునికి మీసము లుండేడివా ?”’’’జంగాలు బ్రాహ్మనులా ?’’,’’స్త్రీకి స్వాతంత్రం అవసరమా ?’’మొదలైన విషయాల పై పత్రికలో చర్చలు జరిపించేవారు .
సురవరం వారు వెయ్యికి పైగా వ్యాసాలూ రాశారని అంటారు .వారిది విలక్షణ మైన వ్యక్తిత్వం .తెలంగాణా నుడికారానికి వారి రచనలు ఆయువు పట్టు .ఆయన ఉదార చరితుని గా లబ్ధ ప్రతిష్టితుడు .కాలా తీత వ్యక్తీ అని పించుకొన్నారు .ఆయనది ప్రతిఫలం ఆశించని త్యాగం .’’త్యాగం ,దేశభక్తి ,భాషాభిమానం ,స్వతంత్ర కాంక్ష ,ప్రజా శ్రేయస్సు ,దేశాభ్యుదయం కోసం సర్వస్వం సమర్పించిన నిత్య సంగ్రామ శీలి ప్రతాప రెడ్డి గారు .నాయకుడు ,వక్త ,దేశ భక్తుడు గ్రంధాలయోద్యమ సారధి ,సంస్కారి ,పత్రికాధి పతి వైతాళికుడు ప్రతాప రెడ్డి ‘’అని కీర్తించిన రామానుజ రావు గారి మాటలు ప్రత్యక్షర సత్యాలు ఇదీ ప్రతాప రెడ్డీయం ,ప్రతాప రెడ్డి యశో భూషణం 1953 లో యాభై ఏడేళ్ళ వయసు లో ప్రతాప రెడ్డి గారు పరలోకం చేరారు .
రెడ్డిత్రయం లో రామ లింగా రెడ్డి మేధో జీవి.రామిరెడ్డి హృదయ వాది .ప్రతాప రెడ్డి కార్య శీలి ,ప్రజాభ్యుదయ పదగామి నిత్య చైతన్య శీలి .ముగ్గురూ ముగ్గురే .మార్గాలు భిన్నాలు .లక్ష్యం ఒక్కటే .సత్య శివ సుందరాలే ఈ ముగ్గురు అని విశ్లేషకాభి ప్రాయం .ఇదే తెలుగు సాహితీ త్రివేణీ సంగమం .అయితే అంతర్వాహిని గా సరస్వతి ముగ్గురిలోనూ ఉంది .శిఖర ప్రాయమైన వారు .ఆధునిక వాజ్మయ శిఖరాలు అవి .కట్టమంచి కొన్ని రచనలే చేసి మంచి కట్ట వేస్తె ,దున్నేవాడిని రైతును కదా నాయకుడిని చేసి కోమల ,లలిత రచనలు చేసి అనువాదానికి మార్గ దర్శి అయారు రామి రెడ్డి .ఇక సురలోక వరం భూలోక పరమైంది ప్రతాప రెడ్డి తో .విస్తృత రచనలు సర్వ ప్రక్రియలతో సరస్వతికి విశేష ఆభరణాల నలంకరించారు .భాషాభిమానం ,దేశాభిమానం ,ఒడ్డుల నొరసి రెడ్డి గారిలో ప్రవహించింది .ఆంధ్రుల చరిత్రకు ఒక అర్ధాన్ని ,పరమార్ధాన్ని సంతరించింది కళా ప్రపూర్నులే ప్రాతస్మరనీయులే వైతాళికులే .వేమన్న తర్వాతా రెడ్లరచనలు ఈ ముగ్గురి ద్వారానే ప్రజల్లోకి ప్రవహించాయి .నిత్య నూతనం గా భాసించాయి .చరితార్ధతను పొందాయి .’’హాట్స్ ఆఫ్ టు ట్ర యంవీరో ‘’
మరో కవి గురించి మళ్ళీ మాట్లాడుకొందాం
సశేషం –మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -4-4-13-ఉయ్యూరు
