బ్రాహ్మణాల కదా కమామీషు -11

బ్రాహ్మణాల కదా కమామీషు -11

శత పధబ్రాహ్మణ ఉపాఖ్యాన కధలు

శుక్ల యజుర్వేదానికి ఉన్న ఒకే ఒక్క బ్రాహ్మణం శత పద బ్రాహ్మణం నూరు  అధ్యాయాల గ్రంధం .అందుకే శత పధం అని పేరు .ఇక్కడ పధ అంటే అధ్యాయం అని అర్ధం .అమూల్య తత్వాలను ఆవిష్కరించిన గ్రంధం కనుక విశేష ప్రాచుర్యం పొందింది .అన్నిరకాల యజ్ఞయాగాదుల గురించి వివరణ ఉంది .ఇందులో రాజసూయ యాగం గురించి సంపూర్ణం గా ఉంది .

రాజ సూయ యాగం

రాజ్యాధికారానికి వచ్చిన రాజు రాజసూయ యాగం చేయాలి. దీని వల్లరాజు ప్రతిష్ట పెరగటమేకాక పవిత్రత కూడా పెరుగుతుంది .ఇందులో 6 సోమయాగాలు ,2పశు యాగాలు ,129ఇష్టులు ఉంటాయి ఏడు దర్వీ హోమాలతో పద్నాలుగు నెలల్లో పూర్తవుతుంది .ఫాల్గుణ శుక్ల పాడ్యమి నాడు రాజసూయాన్ని ప్రారంభిస్తారు .అభిషేక సంస్కారం చేసి ఆరు యాగాలు చేసి ,అభిషేచనీయ మనే సోమ యాగం తో మధ్యాహ్న సవనం  ,ప్రధాన ఆహుతి చేసిన తర్వాత బ్రహ్మ గారు రాజు చేయి పట్టుకొని సభ్యులకు ,ప్రజలకు ఇతడు రాజు అని పరిచయం చేస్తాడు .తరువాత అభిషేకం జరుగుతుంది .సముద్రం నది ,సరస్సు ,సెలయేరు మొదలైన పదహారు పుణ్య తీర్ధాలలో ని పవిత్ర జలాన్ని సేకరించి ఇరుగు నెయ్యి ,పాలు తేనే మొదలైన పంచాగవ్యాలను కలిపి రాజును అభి షెకిస్తారు .దీనికి మేడి పాత్రను ఉపయోగిస్తారు .

విల్లు బాణం పట్టుకొని రాజు పులి తోలు పరచిన మేడిసింహాసనం పై ఆహవనీయాగ్ని దగ్గర కూర్చుంటాడు .ఆరు పార్ధ హోమాలు చేస్తారు .మహేంద్ర స్తోత్రాన్ని ఉద్గాత పఠిస్తాడు .అధ్వర్యుడు బ్రహ్మా ,హోత ,ఉద్గాత రాజు చుట్టూ నిలుచుని  పవిత్ర జలాలతో అభిషేకిస్తారు .తర్వాత రాజు నూతన వస్త్రాలు ధరిస్తాడు ..మళ్ళీ ఆరు పార్ధ హోమాలు చేస్తారు అందులో ‘’రత్నినాం హవీ షింఛి ‘’అనే పన్నెండు ఇష్టులు చేస్తారు .ఈ కార్యక్రమం వలననే రాజ ఉద్యోగులకు రత్నిన్ అంటే రత్నాలు అనే పేరొచ్చింది . వీరే పురోహిత ,సూత ,సంగ్రహీత్రు ,అక్షావాప ,క్షత్రి ,గోణికర్తన ,పాలాగల ,తక్షన్ ,రధకార మొదలైన వారు .

రాజు మూడు గుర్రాలు ఇద్దరు అంగ రక్షకులు గల రధాన్ని ఎక్కి ఒక వీరుడితో ద్వంద్వ యుద్ధం చేసి జయిస్తాడు .పరిహాసానికి తన బంధువులకు చెందిన గో సమూహం మీదకు దండెత్తి ,జయించి ,కొంత దనం రాజ్య భాగం వారికి ప్రతి ఫలం గాఇస్తాడు .తర్వాత అధ్వర్యుని తో పాచిక లాడుతాడు .ఇందులో పందెం ఆవు .దాన్నీ జయిస్తాడు .సోమయాగం తర్వాత శునస్షేఫుని వృత్తాంతాన్ని రాజు పఠిస్తాడు..మర్నాటి నుంచి పది రోజులు ‘’సంసృపాం హవీం షి ‘’అనే పది ఇష్టులు చేస్తారు .పదకొండవ రోజు ‘’దశ పేయం ‘’చేస్తారు ఈ సోమయాగం లో పది చమనలు అంటే పాత్రలు ఉపయోగిస్తారు .పది మంది ఋత్విక్కులు పాల్గొంటారు అందుకే దశపేయం అయింది .  ‘’కేశవా నీయ ‘’అనే సోమయాగం ఒక ఏడాది తర్వాత చేస్తారు .తర్వాత వ్యుస్టిద్విరాత్ర ,క్షత్రస్య ధృతి అనే సోమయాగ నిర్వాహణ జరుగుతుంది .దీనితో రాజ సూయం సమాప్తమౌతుంది .ఈ యాగం లో ప్రధాన దేవత వరుణుడు ..’’వరునసవో వా యేష యద్ రాజ సూయం ‘’అని ఈ  బ్రాహ్మణం  చెప్పింది .రాజ సూయ ,అశ్వ మేధ ,పురుష మేధ ,సర్వమేద యాగాలు క్షత్రియ యాగాలు .రాజ సూయం లో రాజును ప్రజా పతికి ప్రత్యక్ష ప్రతి నిదిగా పేర్కొన్నారు .ఈ బ్రాహ్మణం లో పద్నాలుగు కాన్దలున్నాయి .

అగ్ని స్మార్తాగ్ని అని శ్రౌతాగ్ని అని రెండు రకాలు .వివాహం అయిన గృహస్తు స్మార్తాగ్ని ని సేవించాలి .స్మార్తాగ్ని తో చేసే యజ్ఞాలన్నిటికీ పాక యజ్ఞాలంటారు .వీటిని చేసిన వారు పాక యాజులు .ఇందులో ఔపోసన హోమం ,విశ్వ దేవం ,పార్వణ యజ్ఞాలు, ఇస్టకాలు మొదలైన ఏడు యజ్ఞాలుంటాయి..గార్హ పత్యం ఆహవనీయం ,దాక్షిణ్యం ,సభ్యం అని శ్రౌతాగ్ని నాలుగు రకాలు .దీని విదానం లో  గాంధార ,కేకయ ,సాల్వ  కురు పాంచాల కోసల దేశాది ప్రస్తావన వస్తుంది

ఒక సంవత్సరం పాటు చేసే ‘’సౌత్రామణి యజ్ఞం ‘’గురించి ఇందులో ఉన్నది .ఈ బ్రాహ్మణం లో అప్పుడే పుట్టిన బౌద్ధ ,సాంఖ్య మతాల ప్రస్తావన కని పిస్తుంది .జనమేజయుడు కురు రాజు గా పేర్కొన బడ్డాడు .  పాండవ  ప్రస్తావన ఉండదు .ఇందులో అర్జున శబ్దం కేవలం ఇంద్రుడికే పరిమితం .జనకుడు మిదిలాదిపతిగా, సీత కు జనకుడిగా చెప్ప బడ్డాడు .ఊర్వశీ పురూరవోపాఖ్యానం శకుంతల దుష్యన్తోపాఖ్యానమూ ఉన్నాయి .భరతుని ప్రస్తావన ఉంది .ప్రళయానికి సంబంధించిన మను –మత్స్యాల వృత్తాంతం రమణీయం గా వర్ణించ బడింది .శుక్ల యజుర్వేదం లో మాధ్యందిన ,కాన్వశాఖా భేదం వలన మాధ్యందిన శత పద బ్రాహ్మణం ,కాన్వ శత పద బ్రాహ్మణం అని రెండు ఉన్నాయి ఈ బ్రాహ్మణాన్ని యాజ్న్య వల్క్య మహర్షి ముసలితనం లో రాసి ఉంటాడని భావిస్తున్నారు .పాంచాల దేశానికి చెందినగొప్ప యాజ్ఞికుడు ఆరుణి శిష్యుడే యాజ్న్య వల్క్యుడు .జనక రాజు ఆస్థాన సభాపతి యాజ్ఞావల్క్యుడే .దీనికే వాజసనేయ బ్రాహ్మణం అని కూడా పేరుంది .,

ఈ బ్రాహ్మణం క్రీ పూ 800-500మధ్య కాలం నాటిదని చెపుతున్నారు .మాధ్యందిన శతపదానికి హరిస్వామి ‘’శ్రుత్యర్ధ వివ్రుతి ‘’అనే ప్రసిద్ధ భాష్యం రాశాడు ..అవంతీ రాజు విక్రమాదిత్యుని ఆస్థానం లో ధర్మాధ్యక్షుడు ,దానాధ్యక్షుడు గా హరిస్వామి ఉండేవాడు .తండ్రి నాగ స్వామి. హరిస్వామికి ‘’సర్వ విద్యా నిధాన కవీన్ద్రాచార్య సరస్వతి ‘’బిరుదు ఉంది .ఇతని భాష్యం సమగ్రం గా దొరక లేదు .దొరికిన దానిలో అతని గాంభీర్య విధానం కని  పిస్తుంది .దీనికి సాయణుడు సమగ్రమైన భాష్యం రాశాడు .అరి వీర భయంకరుడు ,వైదిక ధర్మ సంరక్షకుడు అయిన హరిహర రాయలు యజ్న విధిని పూర్తిగా తెలియ జేసే ఒక గ్రంధానికి ఒక దానికి  వ్యాఖ్యానం  రాయమని కోరితే సాయణుడు శత పద బ్రాహ్మనానికి వ్యాఖ్యానం రాశాడు .కనుక సంహితల తర్వాత అంతటి ఉన్నత స్థానాన్ని పొందింది శత పద బ్రాహ్మణం .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.