చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదు

యాభై ఏళ్ల కృషి ఫలితంగానే తాము నేడున్న స్థాయికి చేరుకున్నామనీ, కష్టం, ప్రతిభతోటే ఎవరైనా ఎదుగుతారనీ, తాను న్యాయంగానే థియేటర్లను నడుపుతున్నానే కానీ, చట్ట విరుద్ధంగా ఏమీ చేయట్లేదనీ సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేశ్బాబు చెప్పారు. వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీప్రియ డైరెక్ట్ చేసిన ‘దృశ్యం’ చిత్రాన్ని రాజ్కుమార్ సేతుపతితో కలిసి ఆయన నిర్మించారు. శుక్రవారం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని మంగళవారం తమ స్టూడియోలో పత్రికలవారితో మాట్లాడిన ఆయన చిత్ర రంగానికి చెందిన పలు అంశాలతో పాటు, తనపై వస్తున్న విమర్శలకూ సమాధానం చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
ఇది సురేశ్ ప్రొడక్షన్కు 50వ సంవత్సరం. నేను 32 ఏళ్ల క్రితం 1982లో నా కెరీర్ను ప్రారంభించా. ‘దేవత’ నుంచి ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తూ వస్తున్నా. అయితే నా పేరు ‘బొబ్బిలి రాజా’ నుంచి ఉంటుంది. మనకంటూ కొన్ని డ్రీమ్ సినిమాలుంటాయి. లైఫ్లో అలాంటి సినిమాలను కొన్నే తీస్తాం. నాకు ‘బొబ్బిలి రాజా’, ‘ప్రేమించుకుందాం రా’ డ్రీమ్ ఫిలిమ్స్. మనం ఎదిగేకొద్దీ ఫ్యామిలీ విలువలున్న సినిమాల వేపు మొగ్గు చూపుతాం. కానీ ముప్పై ఏళ్ల తర్వాత కథలు వింటుంటే అప్పటి కథల్లానే ఉంటున్నాయి. అదే విజన్ కనిపిస్తోంది. అందుకే మంచి కథల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటున్నాం. వెంకటేశ్ ఎప్పుడూ కొత్త కథల కోసం చూస్తుంటాడు. నేను ఫ్యామిలీ ఓరియంటెడ్ డిటెక్టివ్ ఫిల్మ్ చెయ్యాలని ఎప్పట్నించో చూస్తున్నా. చాలామందిని అడిగా – షెర్లాక్ హోమ్స్ లాంటి సినిమాని ఫ్యామిలీ డ్రామాలో సెటప్ చేసి చెప్పమని. ‘దృశ్యం’ చూసినప్పుడు, మంచి అనుభూతిని పొందాను. సింపుల్ స్టోరీని చాలా బ్రిలియంట్గా చెప్పారు. ఔట్స్టాండింగ్ స్ర్కీన్ప్లే. వెంకటేశ్ ‘ఐ యామ్ రెడీ టు డూ ద ఫిల్మ్. ఆర్ యు రెడీ టు మేక్ ది ఫిల్మ్?’ అన్నాడు. ఆ సినిమా హక్కులు రాజ్కుమార్ సేతుపతి వద్ద ఉండటంతో ఆయనతో కలిసి ఈ సినిమా చేశాం. మలయాళంలో డిసెంబర్లో రిలీజైతే, జనవరిలో ఓకే చేశాం. మార్చి 6 నుంచి రెండు నెలల పాటు నాన్స్టాప్గా షూటింగ్ చేసి, సినిమాని పూర్తి చేశాం.
నేటి కాలపు కథ
‘దృశ్యం’ ఏ ఇంట్లో అయినా జరగ్గలిగిన ఓ కథ. నేటి కథ. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా సినిమా కాదు. నేటి టెక్నాలజీతో వచ్చే సమస్యలతో కూడిన ఫ్యామిలీ డ్రామా. సమస్య, దానికి పరిష్కారం, ఇన్వెస్టిగేషన్ అన్నీ టెక్నాలజీ ఆధారంగా కనిపిస్తాయి. విజయనగరం, అరకు మధ్య ఉండే ఒక కాల్పనిక గ్రామంలో హీరో కేబుల్ ఆపరేటర్ . అతనికి సినిమాలంటే పిచ్చి. నాలుగో తరగతి పాసైన అనాథ. తన లైఫ్లో వచ్చే సమస్యలకి పరిష్కారాలను సినిమాల నుంచే తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి కుటుంబంలో ఓ సీరియస్ ప్రాబ్లెమ్ వస్తే తన సినిమా జ్ఞానాన్ని ఉపయోగించి, దాన్నెలా పరిష్కరించాడనేది ఆసక్తికరం. సమస్యను హీరో గెలిచే తీరును చూస్తే ఇలా గెలవాలని ప్రేక్షకులు ఫీలవుతారు. ఇందులో వచ్చే సమస్యని చూస్తే అందరి వళ్లూ జలదరిస్తాయి. కొత్త కథలు రాయడానికి ఇది హెల్పవుతుంది.
పేరు కోసమే స్టూడియోలు
మా నాన్న జెమిని, ఏవీఎం స్టూడియోస్ లాగా ఓ స్టూడియోస్ కట్టాలని రామానాయుడు స్టూడియోస్ కట్టారు. కానీ అప్పటి స్టూడియోల్లో చాలా మూతపడిపోయాయి. వాహిని, జెమిని, భరణి స్టూడియోలు ఇప్పుడు లేవు. ఇటీవల ఏవీఎం స్టూడియోకు వెళ్తే అందులో నాలుగు గోడలు కట్టేశారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. రేపు నాకూ అలాంటిదే జరగొచ్చు. ఇవాళ హైదరాబాద్లో సారథీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిల్మ్సిటీ, రామానాయుడు స్టూడియోస్, నానక్రామ్గూడ స్టూడియోస్ రన్నింగ్లో ఉన్నాయి. పద్మాలయా స్టూడియోస్ రన్ కావట్లేదు. సారథీ స్టూడియోస్ను నైజీరియా ఉంటున్న వ్యక్తి కొన్నారు. ఎప్పుడైనా దాన్ని ఆయన రియల్ ఎస్టేట్ కింద మార్చవచ్చు. మా స్టూడియోను ఎంత కాలం వీలైతే అంత కాలం నడపాలనేది మా ఆశయం. నానక్రామ్గూడ స్టూడియో ప్రభుత్వ స్థలంతో కట్టింది కాదు. మా అమ్మాయి పెళ్లయ్యాక అక్కడ షాదీఖానా కడదామనుకున్నా. కానీ నాకు సినిమా తీయడానికి లొకేషన్లు లేకపోతే నేను దాన్ని కన్వెర్ట్ చేయను. నా సినిమాలకు కావాల్సిన సెట్లు వేసుకుని సినిమాలు తీస్తుంటాను. నాకు తెలిసి ఫిల్మ్ స్టూడియోలు డబ్బులు సంపాదించవు. నాగేశ్వరరావు గారు సినిమాల్లో సంపాదించి స్టూడియో కట్టారు. ఆయన గనక బ్యాంకులో అప్పులు తెచ్చి కట్టుంటే దివాలా అయ్యుండేవారు. మాకు సూపర్ డూపర్ హిట్ సినిమాలు గనక వచ్చి ఉండకపోతే మేం స్టూడియో కట్టేవాళ్లం కాదు. వెంకటేశ్ యాక్టర్ కాకపోతే స్టూడియోలో ల్యాబులు పెట్టేవాళ్లం కాదు. కృష్ణగారు సక్సెస్లో ఉండటం వల్లే స్టూడియో కట్టగలిగారు. తమ పేరు నిలవాలనుకునే వాళ్లు కట్టుకుంటారు తప్ప వ్యాపారం చేద్దామని ఎవరూ కట్టరు. ఇవాళ 95 శాతం సినిమాల షూటింగులు ఔట్డోర్లో జరుగుతున్నాయి. పెద్ద సినిమాలకు సెట్స్ కావాలి కాబట్టి స్టూడియోలు అవసరం. రూ. రెండు కోట్లలోపు బడ్జెట్ సినిమాలు స్టూడియోల్లో సినిమాలు తీయలేవు. ఏడాదికి 150 సినిమాల్లో స్టూడియోల్లోని ఫ్లోర్స్లో షూటింగ్ జరిపే సినిమాలు 20 నుంచి 25 మాత్రమే ఉంటాయి.
పెద్ద కలలు కనాలి
సినిమాని మరో లెవల్కు తీసుకెళ్లే డైరెక్టర్స్ కావాలి. తమిళనాడులో శంకర్ ఉంటే మనకు రాజమౌళి వచ్చాడు. హైదరాబాద్ నుంచి ‘అవతార్’, ‘టైటానిక్’ ఎప్పుడు తీస్తారు? మనం అసలు ఢిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్కే వెళ్లం. నేషనల్ అవార్డ్స్కు వెళ్లం. ఇలాగైతే తెలుగు సినిమా ఎప్పుడు ఎదుగుతుంది? హాలీవుడ్ సినిమా తీయాలనేది నా కల. దానికి కావాల్సిన టీమ్ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నా. పెద్ద కలలు కనాలి. ఇవాళ 95 శాతం మంది నిర్మాతలు, దర్శకులు అప్పుడు చేస్తున్న సినిమా బాగా ఆడితే చాలన్నట్లు అనుకుంటుంటారు. మనకి ఎలాంటి గోల్స్ ఉండవు. రాజమౌళి లక్ష్యం ఉంది. హాలీవుడ్లో మహాభారతం తియ్యాలనేది ఆయన గోల్. దానివైపే ఆయన జర్నీ ఉంటుంది. శంకర్ అసిస్టెంట్గా ఉన్నప్పుడే తాను వంద కోట్ల సినిమా తియ్యాలని కలలు కనేవాడు. అలాంటి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మనకు ఎక్కువమంది కావాలి. మా నాన్న స్టూడియో కట్టాలని కలలు కని కట్టారు. నేను సర్వైవల్ ప్రొడ్యూసర్ని. నా కంపెనీని ఇబ్బందులు లేకుండా రన్ చేయాలనుకుంటాను. మళ్లీ నా కొడుకు రానా డ్రీమర్. ఇంటర్నేషనల్ స్టార్ని అవుతాననేది అతని కల. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చెయ్యాలనేది అతని కల.
మనం ఎదగాలి
ఇవాళ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ క్వాలిటీతో సినిమాలు తియ్యడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కానీ మనకు మైండ్ లేదు. స్ర్కిప్ట్ లేదు. స్కిల్ లేదు. మనకు తెలుగు సినిమాలు తియ్యడం వచ్చు, హిందీ సినిమాలు మేనేజ్ చెయ్యడం వచ్చు కానీ, ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ ప్రొడక్షన్ను హ్యాండిల్ చెయ్యడానికి మొత్తం యాభై మంది కూడా లేరు. అలా కాకుండా మన ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి. బాలీవుడ్లో వాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటారు. మనం అవాస్తవిక లక్ష్యాలు పెట్టుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ మన సినిమా వీకెండ్ బిజినెస్ అయిపోయింది. 365 రోజుల్లో 175 రోజుల్లోనే బిజినెస్ వస్తుంది. మిగతా రోజుల్లో బిజినెస్ కాదు. దాంతో ఆ 175 రోజులను తెలివైన నిర్మాతలు లాగేసుకుంటున్నారు. కొంతమంది ఆ రోజులు తమక్కావాలని అడుగుతుంటారు కానీ, వాళ్లకు దొరకవు.
నాలుగు స్ర్కిప్టులు రెడీ
రానా కోసం ఇంతదాకా నేను ఏం చేయలేదు. ఒళ్లు తగ్గించుకుంటే సినిమా చేస్తానని చెప్పాను. వాడు తగ్గించుకున్నాడు. ఈలోగా శేఖర్ కమ్ముల వచ్చి తాను చేస్తానని ‘లీడర్’ చేశాడు. తర్వాత వాడు చేసిన రెండు కథలు – ‘నేను నా రాక్షసి’, ‘నా ఇష్టం’ నాకు నచ్చలేదు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ ఐడియా నాకు నచ్చింది. నేను తీద్దామనుకుంటే తానే తీసుకుంటానని క్రిష్ అన్నాడు. ఇప్పుడు ‘బాహుబలి’తో బిజీ అయ్యాడు. నాకు వాడితో చేయడానికి టైమ్ దొరకట్లేదు. త్వరలోనే వాడితో ఖచ్చితంగా ఓ సినిమా చేస్తా. డైరెక్టర్ హను ‘కవచం’ అనే స్ర్కిప్ట్ రెడీ చేశాడు. అలాగే పరశురామ్ ‘చుట్టాలబ్బాయ్’ అనే కథను రెడీ చేస్తున్నాడు. పూరి జగన్నాథ్, శ్రీధర్ రాఘవన్ (బాలీవుడ్ డైరెక్టర్) కలిసి ఓ కథ రెడీ చేస్తున్నారు. సెల్వ రాఘవన్ ఓ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడు. మా రెండో అబ్బాయి అభిరామ్ను ప్రొడక్షన్ వ్యవహారాల్లో పెట్టాను. వాడిని హీరోగా పరిచయం చేస్తామని చాలామంది వస్తున్నారు. వాణ్ణి అప్పుడే చెడగొట్టకండని చెబుతున్నా.
కష్టంతోటే
ఫలితం
ఏ బిజినెస్లోనూ రాత్రికి రాత్రే అంతా వచ్చేయదు. ఇవాళ మేం ఈ స్థితిలో ఉన్నామంటే యాభై ఏళ్ల కృషి ఫలితం. మాకు ఉన్నదంతా న్యాయంగా వచ్చిందే, న్యాయంగా చేసిందే. ‘చిరంజీవి ఇంట్లో ఐదుగురు హీరోలున్నారు, మా ఇంట్లో ఒక్కరే హీరో ఉన్నారు’ అని ఎవరైనా ఏడుస్తారా? చిరంజీవి గారు కష్టపడ్డారు. పవన్కల్యాణ్, బన్నీ, రామ్చరణ్ కష్టపడ్డారు. వాళ్లు ఊరికే హీరోలు కాలేదు. ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు కాబట్టే హీరోలయ్యారు. కృష్ణ గారికి ఇద్దరు కొడుకులున్నారు. మహేశ్ ఒక్కడే సూపర్స్టార్ అయ్యాడు. ఇంకొకతను కాలేదు. ఎందుకని? మహేశ్లో టాలెంట్ ఉంది కాబట్టే అయ్యాడు. ఎవరికీ ఊరికే ఏదీ రాదు. డిసి్ట్రబ్యూటర్గా ఉన్న దిల్ రాజు టాలెంట్తో నిర్మాత అయ్యారు. ఎం.ఎస్. రెడ్డి విజయవంతమైన నిర్మాత కాలేకపోయారు. కానీ వారబ్బాయి శ్యాంప్రసాద్రెడ్డి తన ప్రతిభతో సూపర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. వాళ్లకు ఎవరికో ఉందని నేనేడుస్తుంటే ఎలా? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే మొత్తం థియేటర్లను నలుగురైదుగురే కంట్రోల్ చేయబోతున్నారు. ఒక కంపెనీ వాళ్లు ఈ ఏడాది 300 థియేటర్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకొని కొనేయబోతున్నారు. ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు వాటిని రన్ చేస్తుంటారు. రేపు నాకు ఆసక్తి లేకపోతే నా థియేటర్లను వేరే వాళ్లకు అమ్మేస్తాను. నేను వాస్తవానికి ‘దృశ్యం’ను ఆగస్ట్ 14కు తీసుకు రావాలని అనుకున్నా. కానీ అదే టైమ్కు ఎన్టీఆర్ ‘రభస’, సూర్య ‘అంజాన్’ వస్తున్నాయి కాబట్టి, నా సినిమా ముందుగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడే తెస్తున్నా. అదే నేను ఆగస్ట్ 14కి తేవాలనుకుంటే నా సినిమా రెండు లేదా మూడో ఆప్షన్ అవుతుంది. ఎగ్జిబిటర్లు మొదట ఎన్టీఆర్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చి, తర్వాత ‘దృశ్యం’కు ఇస్తారు. అది నేను అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను మొండిగా అప్పుడే తేవాలనుకుంటే ఎగ్జిబిటరే చెబుతాడు, అప్పుడు వద్దని. జూలై 11కి ఏ సినిమాలూ లేవు కాబట్టి తెస్తున్నా. ఎగ్జిబిటర్కు అవసరాన్ని సృష్టించాకే సినిమా తేవాలి. మన సినిమాకు డిమాండ్ని సృష్టించాలి. సినిమా పూర్తవడంతోటే థియేటర్ దొరకాలంటే ఎలా దొరుకుతుంది? ‘ఆ నలుగురి దగ్గర అవున్నాయి, ఈ ముగ్గురి దగ్గర ఇవున్నాయి’ అంటే ఏం చేస్తాం? దానికి సమాధానం ఉండదు. నేనేదైనా చట్టవిరుద్ధంగా చేస్తుంటే అప్పుడడగవచ్చు. కాంపిటిషన్ కమీషన్లో ఇలా చేయకూడదనుంటే చేయను. చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదే.
ఇండసీ్ట్ర తరలిపోవచ్చు
ఇండసీ్ట్ర ఎక్కడికైనా, ఎప్పుడైనా తరలిపోవచ్చు. మంచి వాతావరణం ఉన్నచోటకీ, మంచి రాయితీలు ఉన్నచోటకీ వెళ్తుంది. తడ, వైజాగ్, విజయవాడ వంటి చోట్లకి తరలిపోవచ్చు. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్ టెక్నీషియన్స్ వచ్చేస్తారు. కేరళ తరహాలో తమ చుట్టూనే సినిమా తీసేసుకుంటారు. నెక్ట్స్ జనరేషన్ టెక్నీషియన్లు ఆఫీసుల్లో కూర్చోరు. తమ ఇళ్లదగ్గరే తమదైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. ఎడిటింగ్ రూమ్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. డబ్బింగ్ థియేటర్ను కూడా తమ దగ్గరే పెట్టుకుంటారు. ఒన్ డే ఆర్టిస్టుల గురించే ఇండసీ్ట్ర ఒకచోట ఉండాలి. నేను వేరే ఊరికి వెళితే వాళ్లకు ఖర్చులు పెట్టుకోవాలి. దాని కోసమే ఇండసీ్ట్ర ఇక్కడ ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు రెండు రాషా్ట్రలయ్యాయి. ఇండసీ్ట్రకి ఒక బేస్ హైదరాబాద్లో ఉంటుంది. మరో బేస్ వైజాగ్ లేదా తడలో ఉండొచ్చు. షూటింగ్లు చేసుకోవడానికి ప్రాబ్లెమ్స్ లేకుండా ఉండాలి. ఇక్కడ స్టూడియో మినహా ఎక్కడ షూటింగ్ చేసినా పోలీస్ పర్మిషన్ కావాలి. విదేశాల్లో అలాంటివి అవసరం లేదు కాబట్టే వెళ్లి చేసుకుంటున్నారు. కేరళలో ‘దృశ్యం’ షూటింగ్ హాయిగా చేసుకున్నాం. ఇక్కడ అలాంటి వాతావరణం లేదు.
