నా దారి తీరు- 75 బ్రాహ్మణ వ్యవసాయం

నా దారి తీరు- 75

బ్రాహ్మణ వ్యవసాయం

మా చిన్నప్పుడు అందరూ ఒక సామెత చెప్పేవారు .ఒకతన్ని ఎవరో ఒకాయన ‘’పల్లకీ ఎక్కుతావా ?బ్రాహ్మాణ వ్యవసాయం చేస్తావా?అని అడిగితే ‘’పల్లకిలో కుదుపులు తట్టుకోలేను బ్రాహ్మణ వ్యవసాయమే చేస్తాను హాయిగా ‘’‘’అన్నాడట .అంటే బ్రాహ్మణుల వ్యవసాయం అంతే ‘’వీజీ ‘’అన్న మాట .అడిగే వాడుండడు ,పట్టించుకొనే వాడుండడు అని భావం. కస్ట పడకుండా ఫలితం వస్తుంది .వాళ్ళని కౌలు పేరుతో మోసం చేయచ్చు అని వ్యంగ్యార్ధం .కారణం వీళ్ళు పొలం వెళ్లరు .ఏ పంట వేస్తున్నారో తెలుసుకోరు .యెంత ఆదాయం వస్తుందో యెంత రేటుకు అమ్మాడో  అక్కర్లేదు .సంవత్సరం అవగానే వాళ్ళ చేతిలో ఏదో కొంత పెడితే చాలు అని అందరూ అనుకోవటమే బ్రాహ్మణ వ్యవసాయం .

కాని మా ఉయ్యూరులో పక్కనున్న సాయిపురం ,కనక వల్లి ,పెనమకూరు పేద వోగిరాలలో  లలో బ్రాహ్మణులు గొప్పగా వ్యవసాయం చేసేవారున్నారు .వీరందర్నీ స్వయం గా నేను చూశానుకూడా .ఉయ్యూరు లో మా మేన మామ గంగయ్య గారు ఆయన తండ్రి శింగిరి శాస్త్రిగారు ,పిన తండ్రి నరసింహం గారు నిత్యం పొలం వెడుతూ పాలేళ్ళతో పని చేయిస్తూ అజమాయిషీ చేస్తూ ,అవసరమైతే దుక్కి దున్నటం , నాట్లు వేయటం, కలుపు తీయటం కొత్త కోయటం   ,కట్టి వెత నూర్పిడి పనుల్లో ఆరి తేరిన వారే .వీరు పొలంలో  కని  పిస్తే చాలు కూలీలకు తమ కంటే ఆసాములకే పనులు బాగా తెలుసునని మరింత కస్టపడి పని చేసేవారు .మా అమామయ్య ధాన్యం బస్తాలు మినుము బస్తాలు కూడా మోసెంత సామర్ధ్యం ఉన్నవాడు .పాలేళ్ళతో కలిసి కట్టెలు కొట్టేవాడు .ఈయన దెబ్బకి వాళ్ళు ఝాడిసే వాళ్ళు .అంత పనిమంతుడు .ఎడ్ల బండీ కట్టటం తోలటం ఆయనకు బాగా అలవాటే . కనుక మా మామయ్య కుటుంబం బ్రాహ్మణ వ్యవసాయం అనేదానికి తగరు అన్నమాట .అలాగే శాయి పురం లో బ్రాహ్మణులంత గొప్ప వ్యవసాయ దారులే .అన్ని పనులూ స్వయం గా చేసుకొనే వారే మంచి పంటలు పండించే వారు కనుక వీరికీ ఈ మాట కుదరదు .

కనకవల్లి ,పెనమకూరు లో ఎక్కువ మంది బ్రాహ్మణులు స్వంత వ్యవసాయం చేసి బాగు పడ్డ వాళ్ళే .కనక వల్లిలో వారిని శ్రీ మంతులు  అంటారు .వారు కూడా గొప్ప వ్యవసాయ దారులు .దగ్గరుండి వ్యవసాయం చేయించేవారు .చెరుకూ బాగా సాగు చేసేవారు . మంచి స్థితిపరులు .దాన గుణ సంపన్నులు .అక్కడి పేద ప్రజలకు తమ భూమి లో కొంత పంచి పెట్టిన వదాన్యులు .కనక వల్లి అగ్రహారం అంతా వారి అధీనం లోనే ఉండేది .వారి అబ్బాయి సోమయాజులు గారు సర్పంచ్ గా చాలా కాలం పని చేశారు .ఇప్పటికీ వారికి అక్కడ భూములున్నాయి .కాని చదువులకోసం కుటుంబం ఉయ్యూరు కు చేరింది .అయిన అజమాయిషీ చేస్తూ పంటలను పండిస్తున్నారు .మిగిలిన వారిలో విష్ణుభొట్ల సోమయాజులు  హైస్కూల్ లో నా క్లాస్ మేట్ .అతనికీ మంచి భూవసతి ఉంది .స్వంత వ్యవసాయం చేసేవాడు .వయసు దృష్ట్యా ఉయ్యూరు లో కాపురం ఉండి యాజమాన్యం చేస్తున్నాడు .అలాగే వెంపటి వారికీ పొలాలున్నాయి వారూ కస్టపడి వ్యవసాయం చేసేవారే .ఇప్పుడు ఆ కుటుంబమూ పట్నాలకు చేరారు .ఇప్పుడు బ్రాహ్మణీకం అక్కడ నామ మాత్రమె .పెనమకూరు లో బ్రాహ్మణులలో మంచి వ్యవసాయ దారులున్నారు .ఇప్పటికీ స్వంత వ్యవసాయం చేస్తూ అనేక రకాల పంటలు పండిస్తున్నారు .అందులో ‘’అనుముల ‘’వారి కుటుంబం వ్యవసాయానికి పెద్ద పేరు .

ఉయ్యూరులో చోడవరపు వారు మంచి  స్థితి పరులు .వ్యవసాయానికి పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉండేవి .ఇది చంద్ర శేఖర రావు గారి కాలం వరకు సాగింది .ఆయన మా నాన్నగారికి సహాధ్యాయి .వారి కుమారుల అజమాయిషీ వచ్చేసరికి వ్యవసాయాన్ని కౌలుకు ఇచ్చి పంట తీసుకొనే వారు .మంత్రాల రాధాకృష్ణ మూర్తి ,ఆయన మామ గారు ఉయ్యూరులో మొదటి ఎరువుల డిపో పెట్టిన యడవల్లి శ్రీరామ మూర్తిగారు శ్రీమంతులే. గొప్ప వ్యవసాయదారులే .వారూ తర్వాత వ్యవసాయాన్ని వదిలేశారు .ఉయ్యూరులో గోవిందరాజు శ్రీరామ మూర్తిగారు ఆయన తమ్ముడు  , నా సహాధ్యాయి అబ్బి అనే పరబ్రహ్మానంద శర్మ లకు గరుగు దగ్గర మెత్త భూమి ఉంది. చెరుకు ,పసుపు కంద మొదలైనవి బాగా పండించేవారు గొప్ప ఫలసాయాన్ని తీసేవారు .మెట్ట వ్యవసాయం లో బాగా లాభ పడ్డారు .వీరందరికీ మించి వ్యవసాయం ఇప్పటికీ చేస్తున్నవారు గరుగు మీద సోమయాజుల కృష్ణ మూర్తి గారి కుటుంబం .కృష్ణ మూర్తిగారు చెరుకు ,మొదలైన  మెట్ట పంటలు బాగా పండించేవారు .పాలేళ్ళు ,బండీ ఎడ్లు ఉన్నాయి  దున్నటం దగ్గరనుండి అన్ని పనులు చేయగల వారు .ఫాక్టరీ కి చేరుకును వారే స్వయం గా తోలే వారు .ఆయన తర్వాత అబ్బాయిలు కూడా ఇప్పటికి శ్రద్ధగా వ్యవసాయం చేస్తూనే ఉన్నారు .అలాగే మా అమామయ్య గారి అబ్బాయి చేస్తూనే ఉన్నాడు .

మా నాన్న గారి కాలం లోను నా టైం లోను మేము గట్టు మీద కూర్చునే వ్యవసాయం చేయించాం .కనుక మాది ‘’బ్రాహ్మణ వ్యవసాయం ‘’అనచ్చు .కాని వ్యవసాయం కోసం ఎప్పుడూ అప్పులు చేయకుండా గడుపుకోచ్చాం .మంచి నిఖామానులైన సీతారామయ్య కాటూరు పొలానికి ,చిన్నబ్బాయి ఉయ్యూరు పొలానికి ఉండి మాకు ఏ ఇబ్బందీ లేకుండా చేశారు ..నేను తప్పకుండా పొలం లో జరిగే అన్ని ముఖ్యమైన పనులు దగ్గరుండే చేయిన్చేవాడిని .కనుక వ్యవ సాయం లో ఎప్పుడూ నష్టం రాలేదు .జాయింటు కౌలుకూ కొంతకాలం చేశాము .పూర్తిగా వాళ్ళ మీద వదిలీ చేశాను .ఎందులోనూ ఇబ్బంది రాలేదు వ్యవసాయం కోసం ఎకరాలు అమ్మక పోవటమే నేను చేసిన మంచిపని అనుకుంటాను .అంతకు మించి ఏమీ లేదు .ఈ వ్యవసాయమే మా కుటుంబానికి ఏడు గడ గా నిల బడింది .దాని వల్లనే అందరం హాయిగా ఉన్నాం .మా తమ్ముడి భాగం అతనికిచ్చి ,ఫలసాయం కూడా అతను అమ్ముకొనే దాకా ప్రతి ఏడాది అప్పగించేవాడిని .మా అన్నయ్య గారి అబ్బాయి రామనాధ బాబు కు కాటూ రులో నాతో పాటు పొలం ఇప్పటికీ ఉంది .పంటలు రాగానే ఫలసాయం అందిస్తాను  .కనుక బ్రాహ్మణ వ్యవసాయమే అని పించినా నేను చేసింది నష్ట వ్యవసాయం కాదు లాభం తోనే చేశాను .దానికి కారణం నమ్మకస్తులైన నిఘా మానులే అని నిక్కచ్చిగా చెప్పగలను .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.12-7-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.