బొమ్మ ఏడ్చింది


‘ఆంధ్రజ్యోతి’ చెన్నై ఎడిషన్‌లో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షికలో గతంలో బాపు వివరించిన బాల్యపు ముచ్చట్లు ఆయన మాటల్లోనే…
(ఆంధ్రజ్యోతి, చెన్నై) మా ఊరు కంతేరు. నాన్న వేణుగోపాలరావు. అమ్మ సూర్యకాంతమ్మ. ఆమె నిడమోలు వారి ఆడపడుచు. సత్తిరాజు వారి కోడలు. నేను నరసాపురంలో నిడమోలు వారి ఇంట్లో పుట్టాను-ట. నేను పుట్టక మునుపే మా నాన్న గారు మద్రాసులో లాయర్‌ ప్రాక్టీసు పెట్టారుట. మైలాపూర్‌లోని అప్పరసామికోవెల వీధిలోని నెంబర్‌ 101 మా ఇల్లు. ఈ ఇల్లు నరసాపురం కంతేరు ఏలూరు కుటుంబాలకు రాజధానిలా వుండేది.
చదువులూ పెద్ద చదువులూ ఉద్యోగాలూ పెళ్లి సమ్మంధాలూ కొత్త కాపురాలు తిరుపతి యాత్రలు, ఊటీ విహారాలు మెడ్రాస్‌ వైద్యాలూ – ఇలా ఎవరికే పని వచ్చినా – మా నాన్న సలహాలూ అమ్మగారి సేవలూ! అయిదురు పిల్లలూ ఏడుగురు అత్తగార్లూ వాళ్ల చుట్టాలూ కాకుండా కోర్టు పనుల మీద పల్లెటూళ్ళ నుంచి వచ్చే క్లయింట్లు మా ఇంటి వరండాలోనే బస! ఆ రోజుల్లో మెడ్రాసు తెలుగు లాయర్లందరికీ ఇదో ఆచారం. ఈ పల్లెటూరు అమాయకులు కోర్టులో కేసు గెలిస్తే మరి కనిపించేవారు కాదు. ఓడితే రైలు చార్జీలు అడిగి తీసుకుపోయేవారు. మా నాన్నగారు ఇచ్చేవారు. వాళ్లందరికీ మా అమ్మ కాఫీలూ, భోజనాలు చేసి పెట్టేది.
తెల్లారగానే కాఫీలు- సద్దన్నాలు – స్కూలు వంటలు- కోర్టువంటలు అత్తగార్లకి ఇష్టవంటలు, సాయంత్రం చేగోడీ వంటి చిరుతిళ్లూ – తిరుపతి భక్తులకు పులిహోర పొట్లాలూ – విలాస యాత్రికులకు చచ్చిన కాలేజి (మ్యూజియం), బతికిన కాలేజీ (జూ), మూర్‌ మార్కెట్‌, లైట్‌ హవుసు, బీచి, సెకండ్‌ షో చూసి వచ్చిన వాళ్లకి లేటువంటలూ – ఇలా అన్నిటికీ ఒక అమ్మ – రెండు కుంపట్లూనూ – అన్నాలకి పెద్దది, కాఫీ, టీ కూరా చారులకు చిన్న కుంపటీనూ.
ఈ సత్తిరాజుగారి సత్రంలో మా అమ్మకి పైన చెప్పిన సేవలు కాకుండా ప్రత్యేక బోనస్‌ రెండో కొడుకు బాపూ, వాడి అల్లరీనుట. (జాతియోద్యమం రోజులు కదా – అందుకని అటు మహాత్ముడి పేరూ – ఇటు మాతా మహుడి పేరు కలిసొచ్చేలా నన్ను బాపూ అని పిలిచేవారు). మా అన్నయ్యా తమ్ముడూ సాధువులు. మా అక్కయ్య సరే ఆడపిల్ల. మా చిన్న తమ్ముడు పసి బిడ్డ. అంచేత అల్లరీ, రౌడీ తనం నా బాధ్యతలైపోయాయి. మేడ వరండా కిటికీలోంచి వంగి కిందికి చూస్తూ ‘అమ్మ బెల్లమ్ముక్క ఇవ్వకపోతే దూకుతా’ అని అరిచేవాడినట. ఆ భయంతో మా అమ్మ కిటికీకి నిలువెత్తు కటకటాలు పెట్టించింది. నాకు కోపం వచ్చినపుడు ఆ కటకటాలకే కొట్టుకుని గోల చేస్తూంటే కిందికి తెచ్చి ఓ స్తంభానికి తాడుతో కట్టేసేది మా అమ్మ. ‘నల్ల కిష్టుడుతో రోలుకేసి కట్టు’ అనేది బామ్మ. తాడు తెగేదాకా లాగి బోర్లపడేవాణ్ణిట.
వంటింట్లో బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవాణ్ణిట. ఓ సారి మా నాన్నగారు బొమ్మలు చూసి ‘వెధవా – ఏమిటీ పిచ్చి గీతలు’ అని కోప్పడ్డారు. నేను చెరిపేయ బోతే – ‘సర్లే వుణ్ణీ వుణ్ణీ – మసి చూసుకో’ అన్నారు. రోజూ ఆయన వచ్చే ముందు ఆఫీసు కుర్చీలో కూర్చొని కేసు పేపర్ల చివర నేను బొమ్మలనుకునే గీతలు గీసేవాడిని. అవన్నీ దాచి, వచ్చే స్నేహితులకూ, పాపం క్లయింట్లకి కూడా ‘మా వాడు గీసిన బొమ్మలు’ అంటూ చూపించేవారు. రాత్రి పూట బిర్జిమీద రైలు, నాన్న కాల్చే చుట్టాను గీసే వాణ్ణి.
వేసవి సెలవులొచ్చాయీ అంటే మమ్మల్ని కంతేరు తీసుకెళ్లేవారు నాన్న. పొలాల్లోకి తీసుకెళ్లీ, గడ్డి మేటల దగ్గర కూర్చుని – మా చేత తెలుగు పద్యాలూ భారతమూ కథలూ చదివించేవారు పెదనానగారబ్బాయి హనుమంతరావు. అదో గ్రేట్‌ ఎక్స్‌పీరియన్సు.
వీధిలో ఏదో పని మీద వెడుతూ రాజేశ్వరరావు పాట వింటే చాలు – పరుగుపరుగున ఇంటికి వచ్చి రేడియో ఆన్‌ చేసేవాడిని. ఆ రోజుల్లో వాల్వ్‌ రేడియోలు కదా – ఈనాటి ట్రాన్సిస్టర్లలా కాకుండా వేడెక్కి సౌండ్‌ వచ్చేసరికి నిమిషం పట్టేది. ఈలోగా పాట అయిపోయేది. నేను ఏడ్చినంత పనయ్యేది. ‘అంత ఇష్టముంటే అతన్నోమారు కౌగిలించుకోరా’ అనే వారు మా నాన్న.
రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావుగారు అప్పుడు పిల్లల కోసం ‘బాల’ పత్రిక పెట్టేరు. నా మొదటి బొమ్మ అందులోనే అచ్చయిందీ. రేడియో అన్నయ్యా రేడియో అక్కయ్యా పిల్లలతో ఒక సంఘము స్టార్ట్‌ చేశారు – దాని పేరు ‘బాలానంద’. సంఘంలోని పిల్లలందరినీ వారు వ్యానులో ఎక్కించుకుని తీసుకెళ్లి రేడియోలో నాటకాలు వేయించీ, పాటలు పాడించేవారు. హిగ్గిన్‌ బాదమ్స్‌ బుక్‌షాపుకు తీసుకెళ్లీ ‘మీ కావలసినవి కొనుక్కోండీ’ అనేవారు రాఘవరావుగారు – మేము కొన్న పుస్తకాలకూ పెన్సిళ్లకూ పేనాలకూ బ్రష్షులకూ బిల్లు కట్టేవారు. ఆయన మా మీద చూపించిన అభిమానం మరిచిపోలేనిది. అన్నట్టు నేను రేడియోలో వత్‌ ఆర్గన్‌ వాయించేవాణ్ణి.
ఆ రోజుల్లో మెడ్రాసులో తెలుగువాళ్లకి సపరేటు స్కూలుండేది కాదుట. అందుకనీ నాన్నా ఇంకొంతమంది తెలుగు లాయర్లూ కలిసీ మా ఇంట్లోనే స్కూల్‌ స్టార్ట్‌చేశారు. తర్వాత ఈ స్కూల్‌ను తీసుకొని పెద్దది చేశారు – కెఎన్‌ కేసరిగారు.
పిఎస్‌ స్కూల్లో చదువుతూండగా మా రవణ పరిచయం అయ్యేడు. తర్వాత మేము ఫ్రెండ్సుమి అయ్యాము. రవణా నేనూ ఇంకొంతమంది ఫ్రెండ్సూ కలిసి ‘ఉదయభాను’ అనే రాత పత్రిక స్టార్ట్‌చేశాము. రవణ పుస్తకమంతా రాస్తే – వాటిని స్టెన్సిలు మీద రాసి బొమ్మలు వేసేవాడిని.
నేనూ రవణా సినిమాలు తెగ జూసేవాళ్లం. రెండు గంటల ముందు వెళ్లీ క్యూలో నుంచునీ – నాలుగణాల మూడు కాణులు పెట్టి టికెట్‌ కొనీ – సినిమా చూసేవాళ్లం. అలా చాలా ఇంగ్లీషు సినిమాలు చూసీ మాట్లాడుకునేవాళ్లం – తెలుగు, హిందీ సినిమాలలోని నాటకీయత గురించీ – మిగతా వాళ్లూ మాలాగే చేయొచ్చు కదానీ. సాయంత్రం ఫ్రెండ్సుతోపాటు శాంతోం బీచికి వెళ్లేవాళ్లం. అక్కడ కూడా పుస్తకం తీసుకెళ్లి బొమ్మలు గీసేవాడిని.
ఇంటర్‌ చదవగానే ఓసారి, బీకాం పూర్తి చేయగానే మరోసారి బొంబాయి జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో చేరతానని నాన్నగారిని అడిగాను. ఆయనంటే నాకు చచ్చేంత భయం – ఏదైనా అడగాలంటే ఆఫీసు రూంలో ఆయన కూర్చొన్న కుర్చీ వెనకాల గుమ్మానికి అర్థగంట సైలెంటుగా వేళ్లాడుతూ నించుంటే – అలికిడి పసిగట్టి ‘ఏమిటీ’ అని ఆయనంటే అప్పుడు బ్లర్ట్‌ అయ్యేవాడిని. కాని ఆయనెప్పుడూ ప్రేమతో మాట్లాడేవారు. ఆయన పాపం – ‘బొమ్మలు కూడూ గుడ్డా పెట్టవురా. ఈ చిత్రకళని నమ్ముకునే కంటే కమర్షియల్‌ టాక్స్‌ స్పెషలైజ్‌ చెయ్యి. అయినా కాస్త టైమియ్యి – ఈ లోగా అడ్మిషన్స్‌కి టైమయిపోతుంది కాబట్టి లా కాలేజీలో చేరిపో’ అన్నారు. మొదటి ఏడాది పూర్తి కాక ముందే ఆయన పోయారు. ఆయన మీదుండే గౌరవం కొద్దీ లా పూర్తి చేసి అడ్వకేటుగా ఎన్‌రోల్‌ అయ్యా. కొద్దిరోజులకు నల్లకోటు విప్పేసీ – ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టు వృత్తి మొదలెట్టాను.
లా కాలేజీలో చదువుతుండగా రవణ కథకు నాబొమ్మ వేసి ఆంధ్రపత్రికకు పంపేవాళ్లం. లజ్‌ కార్నర్‌కెళ్లీ ఆంధ్రపత్రికను తీసుకు చూసేవాళ్లం – నా బొమ్మా అతని కథా వచ్చిందేమోననీ… ఒక సారి చూసేసరికి నాబొమ్మ సెంటర్‌ స్ర్పెడ్‌లో వుంది. అంతే చెప్పలేని సంతోషం. ఆ రోజుల్లో ఆర్టిస్టులకి ప్రచురణ కర్తలిచ్చే సంభావన తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. ‘బాల’ పత్రికలో బొమ్మలేసేటప్పుడు నెలకు వచ్చే అయిదు రూపాయలూ – ఆ మేనేజరు అరగంట నించోబెట్టి రేపు రమ్మనేవాడు. అలా వారం తిప్పి అప్పుడు విసిరేసేవాడు.
1955 – 60 ప్రాంతంలో ఆర్టూర్‌ ఈసెన్‌ బర్గ్‌ అనే ఆయన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధిగా మెడ్రాసులో వుండేవారు. నేనన్నా, నా బొమ్మలన్నా వాత్సల్యం, ప్రేమా చూపించేవారు. ప్రతి వానికీ నా కారు చూపించి (సెకండ్‌ హ్యాండుది) ‘మా బాపూ బొమ్మలేసి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్నాడు తెలుసా’ అని గర్వంగా – మా నాయనమ్మగారు చెప్పినట్లు చెప్పేవారు. ఈసెన్‌ బర్గ్‌గారు ఫౌండేషన్‌ తరుపున దక్షిణ భారత భాషా బుక్‌ట్రస్టును ఏర్పాటు చేసి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో – అందరికీ అందుబాటులో వుండేలా పుస్తకాలను ప్రచురించేవారు. ఓ మారు ఉత్పల వారి పద్యాలకి నా బొమ్మలున్న పుస్తకానికి అవార్డు వస్తే గర్వంగా వెళ్లి చెప్పా. ఆయన ‘‘నేను అవార్డు కమిటీలో వున్నానోయ్‌. మిగతా కమిటీ సభ్యులు చూడకుండా అడుగు నుంచి పైకి తీసిపెట్టేవాడిని – నీ పుస్తకాన్ని’’ అని అన్నారు. రాత్రి వంట్‌ రోడ్డులో వున్న జింఖానా క్లబ్బుకి కార్లో తీసికెళ్లమనేవారు. నేను అసలే దూకుడు. అందులో – తిరిగి వచ్చేటప్పుడు పది దాటి రోడ్లు ఖాళీగా వుండేవేమో స్పీడు తొక్కేవాణ్ణి. ఆయన కామ్‌గా ‘‘యు ఆర్‌ ఫ్లయింగ్‌ టూ లో బాపూ’’ అనేవారు.
బుచ్చినాన్న నాకు తెలుగు సాహిత్యం పరిచయం చేస్తే, శివరాజు సుబ్బలక్ష్మి పిన్ని ఆంగ్ల సాహిత్యం (పి.జి వుడ్‌ హౌస్‌ రచనలు) పరిచయం చేశారు. పిన్నిగారి దయచేత నేనిప్పటికీ వుడ్‌హౌస్‌ రచనలతో కాలక్షేపం చేస్తుంటా. ప్రయాణంలోనూ తీరిక వేళలోనూ నాకు నేస్తాలు – వుడ్‌హౌస్‌ పుస్తకాలే. నేను గర్వంగా చెప్పుకునే బంధువులు మరొకరు – మా అమ్మ తమ్ముడు (మావయ్య) నిడమోలు జగన్నాథ్‌గారు, వారి శ్రీమతి కళ్యాణ సుందరీ జగన్నాథ్‌. జగన్నాథ్‌ మావయ్య ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకుని పెద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేశారు. ఆయన తను నమ్ముకున్న దానిముందు ఎవ్వరికీ – దేనికీ తలొంచే వారు కాదు.
కార్టూన్లంటే నాకు పిచ్చ. నిరంతర సాధన ద్వారానే నిత్యనూతనమైన కార్టూన్లని సష్టించొచ్చని నేను నమ్ముతాను. ఆయా సందర్భాలలో ఇతరులు గీసిన కార్టూన్లు కూడా కొత్త ఆలోచనలకు రూపం పోస్తాయి. భారతీయ శిల్పకళ నన్ను బాగా ఇన్‌స్పయిర్‌ చేసింది. నటరాజు శిల్పం ‘గ్రేటెస్ట్‌ పీస్‌ ఆఫ్‌ ఆర్ట్‌’ అని నా ఉద్దేశము. దివ్యత్వం ఉట్టిపడే నటరాజు బొమ్మను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.
కొందరు చెప్పలేనంత ప్రేమతో – ‘‘నువ్వే కనుక ఏ బెంగాల్‌లోనో, అమెరికాలోనో పుట్టివుంటే’’ అంటూ విచారించేవారు. కానీ తెలుగుదేశంలో పుట్టడమే నా అదృష్టం. నేను డావిన్సీ మైకేల్‌ ఏంజిలో దగ్గర నుంచీ నేటి నందలాల్‌ బోస్‌, పిలకావారు, వైకుంఠం గారి కళాఖండాలు చూశాను. ఆనాటి ఆర్తర్‌ రాకాం దగ్గర నుంచి నేటి ఆర్‌కె లక్క్షణ్‌, వాసు, గోపులు గారి బొమ్మలు చూశాను. అందువల్ల నా చోటూ, ప్లేసూ నాకు తెలుసు.
బుడుగు అన్నట్లు నా అంతటి వాడు నేనే!
ఓ రోజు నాన్నగారి ఆఫీసు రూంలో గోడకి తగిలించిన కోటులో చిల్లర దొరికితే కొట్టేద్దామని చెయ్యి పెట్టా. సరిగ్గా అప్పుడే ఆయన రూంలోకి వచ్చారు. గుండె ఆగిపోయి.. ‘కోటు కింద పడితేనూ తీసి మేక్కు తగిలిస్తున్నా’ అని నసిగాను. ‘‘ జేబులో చెయ్యిపెడుతూ కోటు కింద పడిందంటావేమిరా’’ అన్నారంతే. ఇంకేం చెయ్యలే. చావగొట్టినా అంత బాధా, సిగ్గు వేసేది కాదు.
(ఆంధ్రజ్యోతి, చెన్నై) బాపు… రెండక్షరాల ఈ పేరు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను వెండితెరపై కళ్లకుకట్టింది. మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటిచెప్పింది. రేఖల్లో దివ్యత్వాన్ని చూపింది, తెలుగు సినిమాకి భాగ్య‘రేఖ’గా మారింది. ఆంధ్రదేశమంతా అల్లరి చేసిన ‘బుడుగు’కి రూపాన్నిచ్చింది. చిన్నా పెద్దా అందర్నీ ఓలలాడించింది. ఎంతని చెబుతాం, ఏమని చెబుతాం- తెలుగు సినిమా దశ, దిశలను మార్చిన సత్తిరాజు లక్ష్మీనారాయణ ఉరఫ్‌ బాపూ గురించి!
బుడుగు పేరెత్తితే బాపు పులకించిపోతారు. బుడుగు ఊసుల్లో తేలిపోతారు. ‘నా బుడుగు రెండు బొందెలున్న నిక్కరేసుకునీ, పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా చలాకీగా వుంటాడు. రౌడీ రాస్కెల్‌, ఆరి పిడుగా, పోకిరి వెధవా, కుర్రకుంకా, జడ్డీ వెధవా అని ఇంటా బయటా అందరి చేతా ముద్దుగా తిట్టించుకుంటాడు’ అంటూ మురిసిపోతారు. నల్లకోటు ధరించి లాయరవ్వాల్సిన ఆయన కుంచెపై మక్కువ పెంచుకుని చిత్రకారుడయ్యారు. కాస్త సమయం చిక్కినా బాపు చిత్రకారుడైపోతారు. ముళ్లపూడి వెంకటరమణతో స్నేహం సినిమా వైపు నడిపించింది.
ఇద్దరూ ఒక్కటై ఒక్కటిగా సినిమాలు తీసి బాపు-రమణలుగా తెలుగు సినీ చరిత్రలో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. యాభైకి పైగా దృశ్యకావ్యాలను అందించిన బాపు జీవిత, సినీ ప్రస్థానం…
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని కంతేరు ఆయన స్వస్థలం. వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతుల సంతానం. 1933, డిసెంబర్‌ 15న నిడమోలులోని అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. బాపూకి ముగ్గురు సోదరులు, ఒక సోదరి వున్నారు. పెద్ద తమ్ముడు శంకర్‌ నారాయణ తన అన్న స్ఫూర్తితోనే పెన్సిల్‌ రేఖా చిత్రకారుడిగా పేరుగాంచారు.
తండ్రి వృత్తి రీత్యా మద్రాసుకి వచ్చిన బాపూ మద్రాసు విశ్వవిద్యాలయంలో 1955లో బీఎల్‌ పూర్తి చేశారు. విద్యార్థి దశలోనే చిత్రకారుడిగా ప్రావీణ్యం సాధించిన బాపు 1945లో ‘ఆంధ్రపత్రిక’లో కార్టూనిస్ట్‌గా కూడా పనిచేశారు. హిందూ దేవతారూపాలను ఎక్కువగా చిత్రీకరించేవారు. బాపూ సినిమాల్లో కూడా అధిక శాతం హిందూ ఇతిహాసాలకు సంబంధించినవే. రామాయణంను తన సినిమాల ద్వారా సామాన్య ప్రజలకి చేరువ చేసిన ఘనుల్లో బాపూ కూడా ఒకరు. 1967లో ‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన బాపు తెలుగు, హిందీ, తమిళ భాషలతో కలిపి మొత్తం 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘బాంగారుపిచ్చిక’ (1978), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), సంపూర్ణ రామాయణం (1971), అందాల రాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ‘ముత్యాలముగ్గు’ (1975), ‘సీతాకల్యాణం’ (1976), భక్తకన్నప్ప (1976) ‘సీతాస్వయవరం’ (1976), ‘మనవూరి పాండవులు’ (1978), ‘తూర్పు వెళ్లే రైలు’ (1979), రాధాకల్యాణం (1981), ‘సీతమ్మ పెళ్లి’ (1984), ‘రామబంటు’ (1996), ‘రాధా గోపాలం’ (2005), ‘సుందరాకాండ’ (2008), ‘శ్రీరామరాజ్యం’ (2011)… బాపూ తెరకెక్కించిన దృశ్యకావ్యాల్లో కొన్ని. హిందీలో ‘హమ్‌ పాంచ్‌’ (1980), వో సాత్‌ దిన్‌ (1983), ‘మొహబ్బత్‌’ (1984), ‘ప్యారీ బెహ్న’ (1985) చిత్రాలు తీశారు.
పేరులోనే తెలుగు ‘లిపి’…
బాపూ చేతివ్రాతనే ఒక లిపిగా గుర్తించడం చాలా గొప్ప విషయం. ఏ పుస్తకంలో చూసిన బాపు చేతవ్రాత ఫాంట్‌లో అక్షరాలు తప్పక కనిపిస్తాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి మన బాపూనే. సత్తిరాజు లక్ష్మీనారాయణ ‘బాపూ’గా పిలవడానికి ఒక కారణం ఉంది. జాతీయోద్యమ రోజుల్లో జన్మించిన సత్తిరాజుని మహాత్ముడి స్ఫూర్తితోను, తన తండ్రి పేరు కలిసొచ్చేలా ‘బాపు’ అని ఆయన తల్లి ముద్దుగా పిలుచుకునేవారు. తిరువాతి కాలంలో ఆ పేరే ఆయనకు చిరస్థాయిగా నిలిచిపోయింది.
పురస్కారాలు…
1986లో రమణతో కలిసి ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును, బాపు రెండు జాతీయ అవార్డులు, ఆరు నంది అవార్డులను అందుకున్నారు. 2013లో పద్మశ్రీ పురస్కారం బాపూని వరించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్టూనిస్ట్స్‌, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీలతోపాటు పలు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌లను కూడా ఆయన పొందారు.
1933 2014
ఆ ముద్ర ఇంకెవరికీ రాదు

‘‘తెలుగు జాతి గర్వించదగ్గ మహాదర్శకుడు, కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరు అయిన బాపుగారి మరణం నాకు, చిత్రపరిశ్రమకు తీరని లోటు. రమణగారి మరణంతోనే బాపుగారు మానసికంగా పోయారు. రమణగారి మరణం తర్వాత బాపుగారు జీవించి ఉన్నట్లు కనిపించారే తప్ప ఆయనలో జీవం లేదు. నా దృష్టిలో బాపుగారంటే వెండితెర జక్కన. నా ప్రతి సినిమానూ ఆయన చూసి అభినందించేవారు. వారి సినిమాలను మా కుటుంబంతో సహా వెళ్లి మేమూ చూసేవాళ్లం. మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. బాపు అంటే ఒక ముద్ర. ఆ ముద్ర ఇంకెవరికీ రాదు. ప్రచారం కోసం ఆయనెప్పుడూ పాకులాడలేదు. అలాంటి మిత్రుడిని, సమకాలీనుడిని కోల్పోవడం బాధాకరం.’’ – దాసరితెలుగుదనం మసకబారింది
‘‘తెలుగుదనానికి పర్యాయపదం. తెలుగు సినిమా దృశ్యకావ్యం బాపుగారు ఇకలేరన్న విషయం నమ్మశక్యం కావట్లేదు. దేశం గర్వించదగిన అంతర్జాతీయ స్థాయి చిత్రకారులు, దర్శకులు, రచయిత బాపు. ఆయన మృతితో తెలుగు నేల చిన్నబోయింది. తెలుగుదనం మసకబారింది. ఒక శకం ముగిసినట్లయింది. ‘మనవూరిపాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాల్లో బాపుగారి దర్శకత్వంలో నటించాను. నటుడిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడిన చిత్రాలవి. ఆయన తీసిన ప్రతి సినిమా ఓ కళాఖండం. ఆయన గీతలు అనితర సాధ్యం. రామాయణం ఇతివృత్తంగా ఆయన తీసిన పౌరాణిక చిత్రాలు, మరీ ముఖ్యంగా రాముడి పాత్రను ఆయన మలచే తీరు ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు.’’ – చిరంజీవిదర్శకులకు నిలువుటద్దం
‘‘బాపుగారిలాంటి దర్శకులను చూసి నేను చాలా గర్వంగా, ధైర్యంగా ‘నేనూ దర్శకుడిని’ అని చెప్పుకునేవాడిని. ‘శ్రీరామరాజ్యం’ సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఏర్పడింది. ‘గామా’ జీవిత సాఫల్య పురస్కారాన్ని బాపుగారు అందుకుంటున్నారని తెలిసి నేను ఆ సభకు హాజరయ్యాను. ఆ ప్రదానోత్సవం తర్వాత నేనే ఆయన్ని స్వయంగా కారులో ఎక్కించి పంపించాను. ఆ క్షణాలు ఇంకా నా కళ్లలోనే ఉన్నాయి. బాపుగారు మన మధ్య లేకపోవడం బాధాకరం.’’ – బోయపాటి శ్రీను
మర్చిపోలేను

‘‘మోహన్‌బాబు చాలా బాగా నటించాడు అని బాపుగారు నా గురించి రమణగారితో చెప్పిన మాటలను నా జీవితంలో మర్చిపోలేను. బాపుగారు మన మధ్య లేరు అనే వార్త నన్ను దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆ వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. అందమైన వాలు జడ, వికసించిన నేత్రాలు.. బాపుగారి మార్కుగా ఆయన చిత్రాల్లో కనిపిస్తాయి. శ్రీరాముడు, సీతమ్మ, కృష్ణుడు, ఆంజనేయుడు పాత్రల ఆహార్యం ఎలా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బాపుగారిది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అందుబాటులో లేని రోజుల్లోనే ‘సీతమ్మపెళ్లి’ చిత్రంలో సీతాదేవి భూమి నుంచి పైకి వచ్చే సన్నివేశాలను అద్భుతంగా తీశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.’’ – డా.యం.మోహన్‌బాబు
ప్రాణం పోశారు

‘‘బాపుగారి బొమ్మలు, సినిమాలు ప్రత్యేకమైనవి. గీసిన బొమ్మలకు ప్రాణం పోసి, వెండితెరకు అందాలను అద్ది, తన ముద్రను చాటిన దర్శకులు బాపుగారు. వారు లేని లోటు తీర్చలేనిది.’’ – ఎన్‌.శంకర్‌
స్ఫూర్తి పొందాను

‘‘బాపు గారి మరణానికి చాలా విచారంగా ఉంది. ఆయన పనిచేసే విధానం నుంచి ఎంతో స్ఫూర్తిపొందాను. ఆయన దర్శకత్వంలో చేసిన ‘రాధా కల్యాణం’లో నటనకు ఎన్నో అవార్డులు పొందాను.’’ – రాధిక
‘‘నా గురువు బాపు గారు ఇక లేరు. ఆయనను ఎప్పటికీ మిస్‌ చేసుకున్నామంటే చాలా బాధగా ఉంది. గుండె పగిలినట్లుగా ఉంది.’’ – అనిల్‌కపూర్‌

మొదటి చిత్రం.. సాక్షి
బాపు – ‘‘నేనెవరి దగ్గరా పనిచెయ్యలేదు కానీ, రమణగారితో షూటింగ్‌లకు వెళ్తుండేవాణ్ణి. చాలా సినిమాలు మేం కలిసే చూసేవాళ్లం. డిస్కస్‌ చేసుకునేవాళ్లం. ‘సాక్షి’కి మంచిపేరు వచ్చినా, పర్సనల్‌గా నా పని నాకు సంతృప్తిగా అనిపించలేదు. నేను మళ్లీ చూసినప్పుడు నా డైరెక్షన్‌ నాకు నచ్చలేదు. అయినా అది బాగా ఆడిందంటే ఆ క్రెడిట్‌ మొత్తం రమణగారి కథనం, మాటలు, కృష్ణ, విజయనిర్మల యాక్టింగ్‌దే.’’
ఆఖరి చిత్రం.. శ్రీరామరాజ్యం

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.