అన్నమయ్య ప్రస్థానం లో సోపానాలు -2
అమ్మవారికి వేవేల మొక్కులర్పించాడు .’’లోకపావనీ !ధర్మార్ధ కామ మోక్షాలు నీకు సోపానాలు .నాలుగు వేదాలు నీకు దరులు .నీజలం సప్తసాగరాలు .కూర్మమే నీ లోతు.గంగాది తీర్దాలు నీ కడళ్లు.దేవతలు నీ జల జంతువులు .నీదగ్గరి మేడలు పుణ్యలోకాలు .గట్టుమీది చెట్లు పరమ మహర్షులు . నీ ఆకారం వైకుంఠ నగరం వాకిలి .వేంకటేశుడే నీ ఉనికి ‘’అంటూ పరవశించి పాడి పడిపోయాడు .లేచి పెద్ద గోపురాన్ని ,చింత చెట్టును చూసి ప్రదక్షిణాలు చేశాడు .ఆ వృక్షాన్ని శేషాంకం అన్నాడు .గరుడ ధ్వజానికి మొక్కాడు .విమాన శ్రీనివాసుడిని చూసి ,ఆనంద నిలయం వగైరా తనివి తీరా దర్శించి లోపల శ్రీనివాసుని మనసారా తనువారా సందర్శించిపులకిన్చిపోయాడు .అక్కడి చిలుకలు స్వామిని కీర్తిస్తున్నాయట .ముందే పెద్ద హనుమంతుని దర్శనం అయింది .ఆయన చేతిలో బలు ముష్టి ,పైకెత్తిన వల చేయి ,శిరస్సుమీద వాలుగా ఉన్న తోక ,మిన్నులను మోసే మహా కాయం .బంగారు పట్టు గోచి .తొడల దాకా వ్రేలాడే పెద్ద పతకం ,బలమైన కండలు .విఠలానికి కావలి కాస్తూ కనిపించాడు .ఇక్కడ విఠలం అంటే అన్నమయ్య భావనలో వెంకటా ద్రియే .అంటే కొంత ద్రుష్టి భేదాన్ని తగ్గించుకోన్నడన్న మాట .’’స్వామీ !నీవు ఇందిరా పతికి నిజ సేవకుడవు .నీ కింద పసిడి బడ్డల వాళ్ళు పదికోట్లు .మూడు లోకాలు నీశిశువులు .జగాన్ని అంతటిని ఒకే రాజ్యం గా ఏలావు .సూత్ర వతీ దేవికి ప్రభుడవు .నువ్వే వెంకట విభుని సిరుల పెన్నిదివి ‘’అంటూ పులకిన్చిపోయాడు .కట్టెదుట స్వామి దివ్య మంగళ స్వరూపం కనిపిస్తోంది .
స్వామి పాదాలు ‘’బ్రహ్మ కడిగినవే .బ్రహ్మమే ఈ పాదం .బలి తలను తన్నింది ,గగనాన్ని తన్నింది ,భూమిపై మోపిందీ ఈపాదమే .బలికి మొక్షాన్నిచ్చిందీ ఈపాదమే ’’అని కీర్తించాడు .ప్రాచీనులు స్వామిని త్రివిక్రమావతారం గానే భావింఛి ‘’అడియోన్’’అన్నారు .స్వామి చేయిని పొగడుతూ ‘’అందరికి అభయమిచ్చినదని, వేదాలని వెతికి తెచ్చిందని ,భూదేవిని కౌగిలించిందని ,నాగేలును ధరించినదని ,మొక్షాన్నిచ్చే చేయి అని కీర్తించాడు .అక్కడ జరిగే సేవలన్నీ తనివి తీరా వీక్షించాడు .శుక్రువారప్పూజ కు పరవశుడయ్యాడు .’’సొమ్ములన్నీ కడ బెట్టి ,సొంపుతో గోణము గట్టి –కమ్మని కదంబము ,కప్పు పన్నీరు –చెమ్మతోన’’వేష్టువలు ‘’రొమ్ముతల మొల చుట్టి ‘’అని పదం పాడాడు .ఇక్కడ ‘’వేష్టువం ‘’అనే మాట అన్నమయ్య వాడాడు .అంటే అప్పటికే కొంత వైష్ణవం ,సంప్రదాయం అన్నమయ్యకు అర్ధమైందని పుట్టపర్తి వారు తేల్చారు .నైవేద్యాల వైభోహాన్ని కన్నులార గాంచాడు .’’మేరు మందారాలలాగా మెరిసే ఇద్దేనలు ,సూర్య చంద్రుల్లాంటి గుండ్రనిపళ్ళాలు ,చుక్కలు రాసి పోసినట్లు ఆరని రాజనాల అన్నం ,అనేక సముద్రాల్లాంటి వెండి గిన్నెలు ,మంచుకొందల్లాంటి వెన్న ముద్దలు ,వెన్నెల రసమా అన్నట్లు పంచదార కుప్పెలు ,తేనెల గిన్నెలు ,టెంకాయ పాలు ,ఆనవాలు ,వెన్నట్లు ,అరిసెలు ,గారెలు కరిజి కాయలు (కజ్జికాయలు ),కండ మండేలు,పూర్ణపు కుడుములు (ప్పూర్నబ్బూరెలు )ఇలా ఎన్నెన్నో నైవేద్యాలు .స్వామి తిన్నాడో లేదోకాని మనకు మాత్రం నోరూరించాడుఅన్నమయ్య.
‘’పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా !కోరిక లేడ సేయకయ్యా కోనేటి రాయడా –‘అని పదం పాడుతూ ‘’మమ్మల్ని ఏలే కులదైవం .మా పెద్ద లిచ్చిన నిదానం .చేతికందిన పారిజాతం , చింతా మణివి,కోరిక లిచ్చే కామ దేనువువి .చెడిపోకుండా కాపేడే సిద్ధమంత్రానివి ,రోగాలను పోగొట్టే దివ్య ఔషదానివి,బడి వాయక తిరిగే ప్రాణ బంధువువి నీ అభయ హస్తం తో చేదుకో ‘’ అని ఆర్తిగా వేడుకొన్నాడు .ఇన్ని చేసిన శ్రీనివాసుని అభయ హస్తం మాత్రం అన్నమయ్యకు ఇంకా దక్కలేదు .ఇదంతా అక్కడి ఆచార విధానం వర్ణన మాత్రమె .దర్శనం తో ఆనందం పొంది మళ్ళీ స్వంత ఊరికి చేరాడు .
ఇంటికి వచ్చాడే కాని శరీరం మాత్రం ఊళ్లోనూ మనసుమాత్రం తిరుమల కొండమీడా ఉంటున్నాయి .మళ్ళీ ఎప్పుడు దివ్య దర్శనం చేద్దామా అనే తహ తహ తో రగిలి పోతున్నాడు . భావనా నేత్రం తోనే స్వామిని దర్శిస్తున్నాడు.ఇంట్లో చెప్పకుండా నే తిరుమల వెళ్లి దర్శనం చేసుకోస్తున్నాడు .ఊళ్ళో స్వామి కదలు వింటున్నాడు భాగవతం లో బల రాముడు శ్రీనివాసుని సేవించినట్లు ఉంది .అంటే స్వామి అంతటి ప్రాచీనుడు .బ్రహ్మాండ పురాణం ,వామన పురాణాలలో లో స్వామి గాధ ఉంది .సప్తర్షులు సందర్శించి తరించారట.నారదాదులకే కాక బ్రహ్మాదులకూ ఈ స్వామి యే ఏడుగడ .ఇలాంటివి వింటున్నాడు ‘’తిరుమల నంబి ‘’ని స్వామి ‘’మా తాత ‘’అన్నాడట.కురువ నంబి సమర్పించిన బంక మట్టి పువ్వులు గ్రహించిన ఉదారుడు స్వామి .అనంతాల్వార్ చెరువు తవ్విస్తుంటే స్వామి మట్టి మోశాడు తట్టలతో ..తొండమాన్ చక్ర వర్తికి సంపదలు కురిశాడు .ఎరుకల వారి కొర్ర చేను వెన్నులు తిన్నాడు .గొల్లల కావడుల్లోని పాలు తాగాడు .సంపంగి చెట్లను నడిపించాడు .వరుసైన వారు వస్తే ఎదురు వెళ్లి గౌరవం గా తీసుకోస్తాడట .’’ఇలాంటి భావాలన్నీ వింటున్నాడు అన్నమయ్య .ఏమైనా ఆ స్వామిని పట్టుకోవాలి అనే భావం మనసును తొలిచేస్తోంది .
‘’వేంకటేశుని పుష్కరిణి జలమే గంగాది తీర్ధ జలం .తిరుమల విహారమే పుణ్య క్షేత్ర సందర్శనం .శౌరి సంకీర్తనమే వేదాధ్యయన శాస్త్ర పాఠం.స్వామి కంకర్యమే సకల కర్మానుస్టానం .ప్రసాద భక్షణమే ఉపవాసం, జపం ,తపం .స్వామి పాదాలే శరణం ‘’అని మనసులో గాఢం గా నిశ్చయించుకొన్నాడు. మనసు కుదుట బడింది ,తేట బడింది .వైష్ణవ సహవాసమే ,కడగంటి చూపే తన తపః ఫలం అనుకొన్నాడు .సంకీర్తనల్తోనే శ్రీనివాసుడు చిక్కుతాడు అనుకొన్నాడు .అయితే భావం ఇంకా రక్త మాంసాదులకు పట్టలేదు .కాని బౌద్ధికం గా నిర్ణయమై పోయాడు అన్నమయ్య అని నారాయణా చార్యుల వారు అన్నమయ్య ప్రస్తాన సోపానం లో ఒక మెట్టు పైకి ఎక్కాడు అన్నట్లుగా తెలియ జేశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-9-14-ఉయ్యూరు
‘
