ఇస్రాయిల్ శాంతి కాముక రచయిత్రి –ఆదా ఆహరోని
Posted on 01/09/2014 by గబ్బిట దుర్గాప్రసాద్
Ada Aharoni
ఈజిప్ట్ లో పుట్టి ఇస్రాయిల్ లో జీవితం గడిపిన యూదు రచయిత్రి,శాంతి స్థాపనకోసం శ్రమించిన కవయిత్రి ఆదా ఆహరోని.ఈజిప్ట్ లోని కైరో లో ఆహరోని 1933లో ఫ్రెంచ్ జాతీయత కల యూదు కుటుంబం లో జన్మించింది .జమలేక్ దగ్గర బాలికల కాన్వెంట్ స్కూల్ లో చదివింది .ఇంగ్లీష్ ను బాగా అభ్యసించి పదవ ఏట నే కవిత్వం రాయటం ప్రారంభించి తానొక గొప్ప కవిని అవుతానని అప్పుడే చెప్పింది .1949తండ్రి చేస్తున్న ఎగుమతి దిగుమతి వ్యాపార లైసెన్స్ ను ప్రభుత్వం లాగేసుకొని ఆయన ఆస్తులన్నిటిని స్విస్ బాంక్ లో దాచిన డబ్బు తో సహా స్వాధీనం చేసుకోంది. కట్టు బట్టలతో కుటుంబం ఫ్రాన్స్ చేరింది .ఆహరోని ఇస్రాయిల్ కు వచ్చింది .
యూని వర్సిటి ఆఫ్ హైఫా , జెరూసలెం లోని హిబ్రూ యూని వర్సిటిలలో చదివి హిస్టరీ ,సోషియాలజీలో ఇంగ్లిష్ లిటరేచర్ బి ఏ డిగ్రీని పొందింది .ఇంగ్లిష్ లిటరేచర్ లో ఏం ఏ చేసి 1964లో లండన్ యూని వర్సిటి లో రచయిత ‘’హెన్రి ఫీల్డింగ్ రచనలు ‘’పై లిటరేచర్ లో ఏం ఫిల్ పూర్తీ చేసింది .’రచయిత ’సాల్ బెల్లో ‘’ ఫిక్షన్ పై పరిశోధన చేసి ఇస్రాయిల్ యూని వర్సిటి నుండి పి.హెచ్.డి.పొందింది .
హైఫా యూని వర్సిటి లో లిటరేచర్ ను ,ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో సోషియాలజీ ని బోధించింది .అమెరికా ,యూరప్ లకు చెందిన అనేక యూని వర్సిటీలకు గెస్ట్ లెక్చరర్ గా, విజిటింగ్ ప్రొఫెసర్ గా విద్యా సేవలందించింది ఆహరోని.’’ఇంటర్ నేషనల్ ఫోరం ఫర్ ది లిటరేచర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్’’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలైనది ..2006లో ఈజిప్ట్ నుండి వలస వచ్చిన ప్రపంచ యూదుల రెండవ సమావేశానికి అధ్యక్షురాలైనది .2012లో అరబ్బుల , ,యూదుల మధ్య సామరస్యం, శాంతి స్థాపనకు చేసిన కృషికి ఉత్తమ వాలంటీర్ గా ఎన్నుకో బడి ప్రెసిడెంట్ ఆవార్డ్ ను పొందింది .హైఫా లోని కబాబిర్ లో ఉన్న మహమ్మద్ మసీదులో మాట్లాడటానికి ఎంపికైన మొదటి మహిళ గా గుర్తింపు పొందింది .హైం ఆహరోని ని వివాహం చేసు కొని యాభై అయిదేళ్ళు కాపురం చేసింది .ఆయన ఫాకల్టి ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ లో ప్రొఫెసర్ గా పని చేసి 2006లో చనిపోయాడు .వారికి ఇద్దరుపిల్లలు అమ్మాయి కేన్సర్ తో చనిపోయింది . ఆహరోని ఇస్రాయిల్ లోని హైఫాలోనే ఉంటోంది .
1948 లో ఇస్రాయిల్ దేశం ఏర్పడిన తర్వాత యూరప్ లో ఉన్న యూదులందర్నీ బల వంతం గా తరిమేశారు .దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల మంది యూదులు ఇస్రాయిల్ వచ్చి తల దాచుకొన్నారు .దీనినే ‘’సెకండ్ ఎక్సోడస్ ‘’అన్నారు .అప్పటిదాకా అక్కడ ఉన్న ఆరు లక్షల యాభై వేల మంది పాలస్తీనియన్లు భయపడి పారిపోవటమో, పంపించి వేయటమో జరిగింది .దీనితో ఇస్రాయిల్ వారికి పాలస్తీనియన్లకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది .యూదులను ఎవరూ పట్టించుకో లేదు .ఆహరోని ‘’ది ఫోర్సేడ్ మైగ్రేషన్ ఆఫ్ జ్యూస్ ఫ్రం ఆరబ్ కంట్రీస్ అండ్ పీస్ ‘’అనే అంశం పై పరిశోధన చేసి పరిశోధనా వ్యాసం రాసింది ‘’.వై నెట్ న్యూస్ ఆర్టికల్’’ లో ‘’వాట్ అబౌట్ జూయిష్ నాక్బా “”అనే వ్యాసం రాసి యూదులు అనుభవించిన ,అనుభ వీస్తున్న కష్టాలను కళ్ళకు కట్టించింది .ఈ రెండు విషాద సంఘటనలు జరగ టానికి ఇరు పక్షాలు బాధ్యత వహించాల్సిందేనని ,అప్పుడు మాత్రమే వారి మధ్య సామనస్య పూర్వక శాంతి లభిస్తుందని ఆహరోని అభిప్రాయ పడింది .ఆహరోని ,ఆమె భర్త ఇద్దరూ పాలస్తీనా శరణార్ధుల రక్షణ గురించే కలవరపడేవారు .శాంతి కోసమే రచనలు చేసేవారు .’’దిగోల్డెన్ ఏజ్ ఆఫ్ ది జ్యూస్ ఫ్రం ఈజిప్ట్ –అప్ రూటింగ్ అండ్ రివైవల్ ఇన్ ఇస్రాయెల్ ‘’పేర అనేక కధనాలను సేకరించి పుస్తకం గా తెచ్చింది .’
ఆహరోని రాసిన ‘’సెకండ్ ఎక్సోడస్’’చారిత్రాత్మక నవల .అందులో ఈజిప్ట్ నుంచి బలవంతం గా బయటికి గెంటి వేయబడిన యూదుల చరిత్ర కు అద్దంపట్టింది . ’’నైలు నుంచి జోర్డాన్ దాకా ‘’ను ఆత్మకధ గా రచించింది .1907-2000కాలానికి చెందిన’’తియా ఉల్ఫ్ ‘’అనే అలలెక్సాండ్రియా లోని జ్యూయిష్ హాస్పిటల్ లోపని చేసేన హెడ్ నర్స్ రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ఈజిప్ట్ అధికారులతో తన వైద్య సిబ్బంది తోకలిసి యూరప్ నుండి శరణార్ధులుగా వచ్చిన యూదులను ఆదుకొన్న విధానాన్ని ‘’నాట్ ఇన్ వైన్ –యాన్ ఎక్స్ట్రా ర్డినరి లైఫ్ ‘’పేరుతొ ఆమె జీవిత చరిత్ర రాసి ప్రచురించింది .పిల్లలకోసం రాసిన నవలలో ఇద్దరు చిన్నారులు ‘’శాంతి పుష్పం ‘’ కోసం భవిష్యత్తులోకి ‘’స్పేస్ అడ్వెంచర్ ‘’చేస్తూ ,ఆ పుష్పాన్ని కనుక్కొని దాన్ని భూమి మీదకు తెచ్చేవిషయాన్ని ‘’పీస్ ఫ్లవర్ –ఏ స్పేస్ అడ్వెంచర్ ‘’పేరిట రాసింది .
ఆహరోని కవిత్వాన్ని చూడాలి .శాంతి ,ప్రేమ ,మహిళ అనే మూడు విభాగాలుగా చూడాలి ..అన్నిటిలో అంతస్సూత్రం గా శాంతి ఉంటుంది .యుద్ధం వద్దంటుంది .మహిళల స్వేచ్చ ,వారి శక్తి సామర్ధ్యాల ప్రభావం గురించే రాసిన కవితలవి .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక ఆరబ్ విద్యార్ధితో కలిసి ఒక స్కూల్ మేగజైన్ తెచ్చింది .అందులో యుద్ధం వద్దని, శాంతి కావాలని పిల్లలు రాసిన కవితల్ని ప్రపంచం దృష్టికి తెచ్చింది .దీనికి ఆమెకు ప్రేరణ కల్పించిన వాడు బ్రిటిష్ శాంతి కవి ‘’విల్ఫ్రెడ్ ఓవెన్ ‘’. ఆరబ్ –ఇస్రాయిల్ యుద్ధ సమయం లోను శాంతి కవితలే రాసింది .ఇస్రాయిల్ అస్తిత్వ పోరాటాన్ని ,నిలబడి సాధించుకొన్న తీరును కవిత్వీకరించింది .సంస్కృతీ ,సామరస్య ,ఐకమత్యాలకు కవిత్వమే వారధి అని నమ్మి రాసింది .’’ఇనుప సీతాకోక చిలుకలు ‘’కవితలో తననూ అలాంటి దానినే నని చెప్పుకొంది.ఆరబ్ మహిళలకు స్నేహ హస్తాన్ని చాచింది .వాళ్ళ ఆలివ్ ప్రపంచానికి తమ ఆరంజ్ ప్రపంచానికి మధ్య శాంతి వారధులం అవుదామని హృదయ పూర్వకం గా ఆహ్వానించింది .ఈ మధ్యనే ఆమె ‘’రేర్ ఫ్లవర్ ‘’అనే కవితా సంపుటి వెలువరించి అందులో తన భర్త గురించి, కుటుంబాన్ని గురించి కవితాత్మకం గా రాసింది .
‘’కవిత్వంలోని మాటల వెనక ఆమె దాక్కోదు .రాసిన ప్రతి దాంట్లో నిజాయితీ ప్రస్పుటం గా దర్శన మిస్తుంది .ఏదీ దాయదు .అంతా నగ్నావిష్కరణం గానే ఉంటుంది కవిత్వం .ఆమె కవిత్వం లో సన్నిహితత్వం ,లోతు ఉంటాయి ‘’అని విమర్శకులు మెచ్చుకొన్నారు .పది కవితా సంపుటాలను ,అయిదు చారిత్రాత్మక నవలలను ,రెండు జీవిత చరిత్రలను ,బాల సాహిత్యాన్ని,రెండు సాహిత్య విమర్శ గ్రంధాలను ,పది మేగజైన్ లను ఎడిట్ చేసి గొప్ప సాహిత్యాన్ని శాంతి మంత్రాలతో ప్రపంచానికి అందించింది ఆదా ఆహరోని .అయిదు అతి ముఖ్యమైన రిసెర్చ్ పేపర్లు తయారు చేసి ప్రపంచ ప్రాముఖ్యతను పొందింది .ఈ నవలామణి ని ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి .
బ్రిటిష్ కౌన్సిల్ అవార్డ్ ,కేరెన్ ఆమోస్ ప్రెసిడెంట్ అవార్డ్ ,హైఫా అండ్ బ్రీమేన్ ప్రైజ్ ,వరల్ద్ ఎకాడమి ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అవార్డ్ ,లు అందుకొన్న విదుషీమణి ఆహరోని .’’కొరియన్ గోల్డ్ క్రౌన్ ఆఫ్ వరల్డ్ పోయెట్స్ ‘’పురస్కారం పొంది నిజం గానే స్వర్ణ కవితా కిరీట దారిణి అయింది .న్యూ యార్క్ లోని రోచెస్టర్ లో ‘’ప్రపంచ నాయికలు ‘’(వరల్ద్ హీరోయిన్స్)లో ఎన్నిక కాబడిన వందమంది వనితలలో ఒకరు గా ఎన్నికైన అరుదైన మహిళ అని పించుకోన్నది .వీటన్నిటికి మించి 2013నోబెల్ ప్రైజ్ కు నామినేట్ చేయబడిన మహిళా మాణిక్యం అదా ఆహరోని .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
– See more at: http://vihanga.com/?p=12671#sthash.rUd0XysO.dpuf
