బాపురే బాపు

చెన్నై, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): మూగవేదన.. కన్నీటి రోదన.. గద్గద స్వరాలు.. గడ్డకట్టిన విషాదం.. శోకతప్త హృదయాలతో నివాళి! మరలిరాని లోకాలకు తరలిపోయిన దిగ్దర్శకుడు, ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు.. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు నివాసంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి!! ఆయన వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా శిక్షణ పొందిన కళాకారులు, ఆయన కార్టూన్లకు ఏకలవ్య శిష్యులుగా మారిన కార్టూనిస్టులు, ఆయన మలచిన పాత్రల్లో ఒదిగిన సినీ ప్రముఖులు, చిత్రసీమలో ఆయన ఆప్తులు, సన్నిహితులు.. బాపు ఇంటికి తరలి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఆయనతో అనుబంధాన్ని గద్గద స్వరాలతో గుర్తుచేసుకున్నారు. జపాన్‌లో ఉన్న బాపు పెద్ద కుమారుడు సోమవారం రాత్రికి చెన్నై చేరుకుంటారని, బాపు పార్థివ దేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 : తన రాత, గీతతో తెలుగుదనానికి పట్టంగట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఆయనకు ఘననివాళి అర్పించింది. బాపు మృతికి సంతాప సూచకంగా సభలో సభ్యులు కాసేపు మౌనం పాటించారు. బాపుతోపాటు ఆయన ప్రాణస్నేహితుడు రమణ విగ్రహాన్ని గోదావరి తీరంలో ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగు అక్షరాన్ని బాపు తేజోవంతం చేశారని ఆయన కొనియాడారు. హిందూ పురాణ పాత్రలను చిత్రలేఖనం ద్వారా బాపు అందంగా తీర్చిదిద్దారని.. తాను తీసిన ఒక్కో చిత్రాన్నీ ఒక్కో క్లాసిక్‌గా తయారు చేశారని పేర్కొన్నారు. బాపు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘ముత్యాలముగ్గు’ కళాఖండం గా నిలిచిపోతుందన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో బాపు-రమణ సహకారంతో పాఠ్యపుస్తకాలు రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. విజయవాడలోని కోస్టల్‌ మ్యూజియానికి బాపు పేరు పెడతామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచన మేరకు.. బాపు-రమణ విగ్రహాలను పుష్కరాల సందర్భంగా గోదావరి తీరాన ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సభలో ప్రకటించారు. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్తరాజధానిలో ప్రపంచస్థాయి ఆడిటోరియం నిర్మించి దానికి బాపు, రమణల పేర్లు పెడతామన్నారు.
ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక.. బాపు మృతి తెలుగు ప్రజలకు, సినీరంగానికి, సాహితీ లోకానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. బాపు మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాపు కుటుంబసభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుంటూరుజిల్లా కోటప్ప కొండ స్థలపురాణాన్ని.. అక్కడికి వచ్చిన భక్తులకు అర్థమయ్యేలా బాపు 12 చిత్రాల్లో గీసి ఇచ్చారని, వాటిని కొండపై ఆలయంలో ఏర్పాటు చేశామని గుర్తు చేసుకున్నారు. బాపు మృతి బాధాకరమని ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి శాసనసభలో సంతాపం ప్రకటించారు.
‘బాపు బొమ్మ’ల కంటతడి
సంగీత.. బాపు తీసిన ఆణిముత్యం ‘ముత్యాల ముగ్గు’ కథానాయిక! దివ్యవాణి.. బాపు తీర్చిదిద్దిన మరో ఆణిముత్యం లాంటి చిత్రం పెళ్లి పుస్తకం కథానాయిక. ఈశ్వరీరావు.. రాంబంటు చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ సరసన ‘చందమామ కంచమెట్టి.. సన్నజాజి బువ్వపెట్టి..’ అంటూ ఆడిపాడిన బాపు బొమ్మ! వీరి కెరీర్‌లోనే అత్యున్నతం అనదగ్గ చిత్రాలు.. బాపు దర్శకత్వంలో వచ్చినవే! ఆ అనుబంధంతోనే సోమవారం వీరు బాపు ఇంటికి వచ్చారు. ఆయన పార్థివదేహాన్ని చూసి చలించిపోయారు. బాపు బొమ్మలుగా తమ జీవితం ధన్యమైందంటూ కంటతడి పెట్టారు. 
-చెన్నై, ఆంధ్రజ్యోతి

బాపు కు నివాళి –
imggallery

మన బాపు!
మానవజాతిలో కళాకారులు సర్వోత్కృష్టులు. రససిద్ధులు. డబ్బూ, అధికారమూ అంటిపెట్టుకున్న వ్యక్తులు ఆ కొద్దిసేపే ప్రముఖులు. తర్వాత వారిని ప్రజలు మరచిపోతారు. కానీ రససిద్ధులయిన కళాకారులకీర్తి పదికాలాలపాటు నిలిచి ఉంటుంది. కీర్తికాయం ద్వారా వారు జరామరణ భయంలేని చిరంజీవిత్వాన్ని పొందుతారు. ఇది ప్రముఖ చిత్రకారుడు బాపు విషయంలో అక్షరసత్యం.
చిన్నికృష్ణుణ్ణి తాడుతో రోటికి కట్టిన యశోదలా, మూడు నాలుగేళ్ళ వయసులో అల్లరి చేస్తున్న బాపును ఆయన తల్లి స్తంభానికి కట్టిపడేస్తే, బొగ్గు ముక్కలతో గోడలమీద గీసిన బొమ్మలు తెలుగువారికి గీతోపదేశం చేశాయి. తొలి బొమ్మ బాల పత్రికలో అచ్చయి, అనంతరం ‘కవ్వపు పాట’కి జత కలవడంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆంధ్రపత్రికలో రాజకీయ కార్టూనిస్ట్‌గా చేరిన తరువాత ఆ కుంచె నుంచి జాలువ్రాలిన కార్టూన్లూ, బొమ్మలూ వేలు. జడగంటలు, జరీ అంచు తెల్లచీర, మామిడాకులు, ముత్యాలముగ్గులు, పసుపు కుంకుమలు, పారాణి తెలుగుతనానికి పర్యాయపదంగా బాపుతనం వెలసింది. తెలుగుబొమ్మలే కాదు, తెలుగు అక్షరాలు కూడా బాపుతనాన్ని పుణికి పుచ్చుకున్నాయి. గుండ్రంగా రాయడం రాక, ఓపిక లేక వంకరటింకర అక్షరాలను బాపు ఫ్యాషన్‌ చేశాడన్నాయి కాకులు. అవి అక్షరాలు కాదు ముత్యాల ముగ్గులన్నారు లోకులు. బాపు లిపి కంప్యూటరుకెక్కి తెలుగువారి రాతమార్చేసింది. బాపు రాత, గీత వంకరకాదు, చక్కదనానికి నిలువుటద్దం. సాక్షినామ సంవత్సరంలో (1967) దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సాక్షి’తో ‘బాపు ఫ్రేం’ దిశానిర్దేశం చేసింది. ప్రతి ఫ్రేమ్‌ ఒక పెయింటింగ్‌. కథానాయికకు కట్టూబొట్టూ మాత్రమే కాదు, కనుబొమలు అల్లార్చడాన్ని కూడా నేర్పిన అద్భుత దర్శకత్వం. ఎవ్వరి దగ్గరా శిష్యరికం చేయకుండా బొమ్మలు వేసినట్టే, దర్శకత్వంలోకి కూడా నేరుగా దిగి, యాభైకి పైగా తెలుగు, హిందీ, తమిళభాషల్లో తీసిన సినిమాలతో ప్రేక్షకహృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ సినిమాలు విజయం సాధించినా, పరాజయం పాలైనా పొంగిపోయిందీ లేదు, కుంగిపోయిందీ లేదు. మనిషన్నాక కాస్తంత హస్యప్రియత్వం ఉండాలనీ, అనడం అనిపించుకోవడం లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందన్న ఫిలాసఫీని తూచ తప్పకుండా కడదాకా పాటించిన మనీషి. కనుకనే, సినిమాలు విజయం సాధించినప్పుడు ఎంత వినూత్నంగా ప్రకటనలు రూపొందించారో, ఖరీదైన సినిమాలు చావు దెబ్బతిన్నప్పుడు మళ్ళీ ఖర్చుపెట్టి ‘అంచనాలు తారుమారు చేసిన చిత్రం’ అని సృజనాత్మకంగా ప్రకటనలు ఇవ్వగలిగారు. ‘బంగారు పిచ్చుక’ సినిమా ఘోరపరాజయం పాలైనప్పుడు ఓ పిచ్చుక తలకిందులుగా నేలను తాకి కళ్ళు తేలవేసినట్టుగా కార్టూన్‌ వేయగలిగే ధైర్యం, హాస్యప్రియత్వం ఆయన సొంతం. కార్టూనిస్టు, చిత్రకారుడు, దర్శకుడే కాదు, కథకుడుగా ఆయన మబ్బూ వానా-మల్లెవాసనా, అమ్మబొమ్మ వంటి కథలు రాశారు.
ప్రపంచతెలుగు మహాసభల సత్కారం దగ్గరనుంచీ మొన్నటి పద్మశ్రీ వరకు ఆయనకు ఏవో కొన్ని పురస్కారాలొచ్చాయి. రానివి చాలా చాలా ఉన్నాయి. ‘నువ్వే కనుక ఏ బెంగాల్‌లోనో, అమెరికాలోనో పుట్టివుంటే…’ అంటూ ఆప్తులు తరచూ వాపోవడం ఆయనలో అహాన్ని పెంచలేదు. అనేక దశాబ్దాల పాటు పాతికాముప్పయిలకు కథల బొమ్మలూ, వంద రూపాయలకు కవర్‌ పేజీ బొమ్మా వేసుకుంటూ బతుక్కొచ్చినా, అందమైన ముఖచిత్రాలను గీయించుకొని అనంతరం ప్రచురణ కర్తలు మొఖం చాటేసినా, ఈ తెలుగునేలమీద ఆయన అలిగింది లేదు. పైగా ఇక్కడ పుట్టడం తన అదృష్టమనీ, ‘పూర్వ జన్మ సుకృతశుభం వలన మూడు దశాబ్దాలుగా మరో ఆర్టిస్టు లేనందువల్ల గంజాయివనం బాపతుగా పేరొచ్చేసింద’నీ చెప్పుకున్న వినయ సంపన్నుడు. ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకే చెల్లింది. ఎంత ఒదిగినా కాలం కనికరించలేదు. ముందు మిత్రుడు ముళ్ళపూడిని, తర్వాత భార్య భాగ్యవతిని తీసుకుపోయి ఆయన్ని ఒంటరిని చేసింది.
బాపు రామభక్తుడు. రామాయణాన్ని పదిసార్లు పలువిధాలుగా చిత్రీకరించడమే కాదు, రాముని తలంపులు ఆయన్ని నిత్యం వెంటాడుతూండేవి. ‘ఎంతవాడైనా తన మంచీ గొప్పా తాను చెప్పుకోవాల్సిందే కానీ, ఇంకోడికి ఆ పని అప్పగిస్తే మనసు పెట్టి చేయడు. అందుచేత రాముడే త్యాగరాజస్వామిగా పుట్టి తనివితీరా కీర్తనలు కట్టాడు’ అంటూ అంతర్మథనంలోంచి పుట్టిన ఓ ఆలోచన మిత్రుడికి చెప్పి నవ్వేశారట బాపు. మరి ఈయన సంగతేమిటి? ఇంటర్వ్యూలంటే విముఖత. సన్మానాలంటే ససేమిరా. వేదికలెక్కడానికి వెనుకంజ. లాక్కొచ్చి కూర్చోపెట్టినా, మొహమాటంతో మెలితిరిగిపోతూ, కుర్చీలో ఓ మూలకు ఒదిగిపోతూ, తలెటో తిప్పుకొని కూర్చొనే సిగ్గరి. నువ్వు సామాన్యుడివి కాదంటూ ఎవరెంతగా ఆకాశానికెత్తేసినా చెవులకు సోకదు. మనసుకు పట్టదు. పొగడ్తలకు విమర్శలకు అతీతంగా ఉంటుంది ఆ మోము. మైకు ముందు మాట్లాడటం మరీ తప్పనిసరి అయితే ముక్తసరిగా మూడుముక్కలతో సరిపెట్టి దణ్ణం పెట్టి దిగిపోవడమే. మరి, త్యాగరాజస్వామిలాగా ఎప్పుడు పుడతారు మహానుభావా?
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ముళ్ళపూడి & బాపు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.