పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10 జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -10

జగన్నాధ పండిత రాయల –భామినీ విలాసం -1

జగన్నాధ పండిత రాయలు అమలాపురం తాలూకా ముంగండ అగ్రహారం వాడు .ఇక్కడ సరి పడక కాశీ చేరి విద్యాభ్యాసం ముగించాడు .రాయవేలూరు, చంద్ర గిరిలకు తర్వాత వచ్చాడు .ఆ ఆస్తానాల్లో జిన్జిలో అప్పయ్య దీక్షితులకు గౌరవం ఎక్కువగా ఉండేది .దీక్షితులకు ఉత్తర మీమాంస కంటే పూర్వ మీమాంస పై మక్కువ ఎక్కువ .కర్మ నిస్టూడు కూడా .యజ్ఞాలు చేసి, చేయించాడు .జగన్నాధుడు స్వేచ్చా సంచారి . విశ్రుం ఖల విహారి .ఇవి అప్పయ్యకు నచ్చలేదు. షోకీల్లా లా కనిపించి ఉంటాడు .కనుక జగన్నాధుడికి ఆస్థాన ప్రవేశం లభించి ఉండక పోవచ్చు .దీనితో అప్పయ్య మీద కక్ష కట్టి ఉంటాడు .చులకన గా మాట్లాడాడు దీక్షితుల ‘’కువలయానందం ‘’చిత్ర మీమాంస’’అనే అలంకార గ్రంధాలు రాశాడు .వీటిని చూసిన పండిత రాయలు దీక్షితుల్ని ఉచ్చ నీచాలు లేకుండా ‘’ద్రావిడ శిశువ ‘’,’’స్థానంధయుడ’’అని కసితీరా తిట్టాడు . జగన్నాధుని ‘’రస గంగాధరం ‘’పై ఇనుప కుతిక శంకర శాస్త్రి గారు ‘’ధ్వని వాదం ‘’అనే సంస్కృత గ్రంధాన్ని రాశారు .అందులో జగన్నాదుడిని ఉతికి ఆరేశారు .అప్పయ్య దీక్షితుల్ని సమర్ధించారు ఇక్కడ ఇమడలేక జగన్నాధుడు సరాసరి ఆగ్రా కోటలో పాగా వేశాడు .

జగన్నాధుడు ఆగ్రా చేరే సమయం లో దీక్షితులు కాశీ లో ఉన్నాడు .గంగా నదిలో స్నానం చేస్తున్నప్పుడు జగన్నాధుడు తాను వలచిన యవన కాంత లవంగి తో కులుకుతూ ఉండటం చూశాడు ‘’’నాయనా !వయసు ముదిరింది నీకు .పరలోక ప్రాప్తికోసం ప్రయత్నించాల్సిన వయసులో ఉన్నావు .పరలోక ప్రాప్తి గురించి ఆలోచించకుండా ఇంకా కామ స్వేచ్చా వృత్తిలో జీవిస్తున్నావు. మృత్యు ఘడియలు మోగే వయసులో ఇది మాను .మార్గం మార్చుకో ‘’అని మనవాడే కదా అనే చనువుతో చెప్పాడు .జగన్నాధుడు శృంగారపు మత్తులో పూర్తిగా మునిగి ఉండి ‘’ఎవరు నువ్వు?’’అని గద్దించాడు .దీక్షితులకు వాడు జగన్నాదుడే అని రూఢికలిగి ‘’నువ్వా నాయనా !ఎవరో అనుకొన్నా .మంచిది హాయిగా గంగా తరంగ కమనీయ వీచికల లో సేద దీరు ‘’అని ముందుకు కదిలాడని అంటారు పుట్టపర్తివారు

జగన్నాధుడు వేగినాటి బ్రాహ్మణుడు  .ఇంటిపేరు ‘’’ఉపద్రష్ట’’.తండ్రి భట్టు .కవి.తండ్రినుంచే కొడుక్కి కవిత్వం దక్కింది .మంత్రోప దేశమూ తండ్రే చేశాడు అందుకే ‘’మహా గురుం ‘’అన్నాడు .రసగంగాధరం లో తనను గురించి చెప్పుకొన్నాడు పండితరాయలు –‘

‘’శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రదిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః –కాణాదీ రాక్షపా దీరతిగహన గిరో యో మహేన్ద్రాదవేదీత్

దేవా దేవాడ్య గీస్ట స్మరహర నగరే శాసనం జైమినీయం –శేశామ్క ప్రాప్త శేశామల ఫణితి రభూత్సర్వ విద్యాధరోయః ‘’

జగన్నాధుడు జ్ఞానేంద్ర భిక్షు,భట్తోజీ వ్రాసిన ‘’సిద్ధాంత కౌముది కి ‘’తత్వ బోధ ‘’అనే వ్యాఖ్యానం రాశాడు .అసలు కౌముదినే ఖండించాలనుకోన్నాడుకాని బుద్ధి మార్చుకోన్నాడంటారు ఆచార్య శ్రీ .ఆయన వేదాంతం లో అసాదారణుడు .ఆయన శిష్యరికం చేసి సకల బ్రహ్మ విద్యా రహస్యాన్ని గ్రహించాడు. వైషేశికీ న్యాయాన్ని మహేన్ద్రుడి దగ్గర అభ్య సించాడు .జైమినీయాన్నిప్రముఖ మీమాంసకుడు  ఖండ దేవుడి వద్ద నేర్చాడు .శేషం వీరేశ్వర శాస్త్రి వద్ద వ్యాకరణం సాధించాడు .

‘’పాషాణాదపి పీయూషం స్యన్దతే యస్య లీలయా –తం వందే భట్టాఖ్యం లక్ష్మీ కాంతం మహా గురుం ‘’అని కీర్తించాడు .హయ గ్రీవ మంత్రో పాసకుడని నార్యాణాచార్యులు భావించారు .భట్తోజీ రాసిన ‘’మనోరమ ‘’వ్యాకరణాన్ని పండితుడు ‘’మనోరమ కుఛ మర్దనం ‘’పేర ఖండించాడు .తన గురువును ద్వేషిం చిన భట్తోజికి తగిన శాస్తి చేశానని చెప్పుకొన్నాడు ‘’గురు ద్వేష దూషిత మతీనాం పురుశాయుషేణాపి న శక్యంతే గణయితుం ప్రమాదాః’’అని సమర్ధించుకొన్నాడు .భట్తోజీని ఖండించటం తనకు నచ్చని విషయం అన్నారు పుట్టపర్తి వారు .

జగన్నాధ పండిత రాయలు మహా ప్రతిభా శాలి .ఆ ప్రతిభాసూదంటు రాయికి అన్ని విద్యల ఇనుపముక్కలు యిట్టె అతుక్కోన్నాయి  .ధిల్లీ చేరి అజ్మీర్ లో  పారశీక భాష అంతం చూశాడు .అందులో కొన్ని రచనలూ చేశాడని అంటారు .సంగీతం లోను గొప్ప వాడట .కొన్ని ధ్రువ పదాలు ఆయన పేర ఉన్నాయట .ధిల్లీ పాదుషా షాజహాను కాశ్మీర్ నుంచి వచ్చి ‘’బంభర్ ‘’లో ఉన్నాడట .అంతకు ముందే జగన్నాదుడిని ద్రువపదాలు కొన్ని రాయమన్నడట. రాసి ఉంచాడు .బంభర్ లో వాటిని పాడాడట .షాజహాన్ ఆనందానికి అంతు లేకుండా పోయిందట .వెండి నాణాలతో కవిని తూచాడట .అవి నాలుగు వేల నాణాలట.అదంతా జగన్నాదుడికే చక్ర వర్తి ఇచ్చేశాడు .జగన్నాధ పండిత రాయలు రాసిన గ్రంధాన్ని, ఆయన్ను ఏనుగు అమ్బారీపై కూర్చోబెట్టి షాజహాన్ చక్ర వర్తి ఊరేగిం చాడట.ఆంద్ర లో పరాభవం పొందినా  దిల్లీ లో పరమ వైభోగం సాధించాడు .  .ఈ విషయాలన్నిటిని ‘’ముల్లా అబ్దుల్ హమీద్ ‘’చెప్పాడని సరస్వతీపుత్రులన్నారు .చక్ర వర్తికి సంస్కృతం పైనా అభిమానం ఉండేదట .అందుకే జగన్నాధుడు జీవితాంతం షాజహాన్ కొలువులోనే ఉండిపోయాడు .ఆసఫ్ ఖాన్ ద్వారా పండితుడు షాజహాన్ కొలువులో చేరాడు. రాయ ముకుందుడు ఆసఫ్ ఖాన్ ను పరిచయం చేశాడట .ఆసఫ్ కు హిందీ సంస్క్రుతాలపై విశేషమైన ఆసక్తి ఉండేది’ ఆసఫ్ ఖాన్ ను జగన్నాధుడు –

‘’సుదేవ వాణీ వాసుదేవ మూర్తిః-సుధాకరశ్రీ సదృశీ చ కేర్తిః-పయోధి కల్పా మతి రాస ఫేందో –మహీతలే న్యస్య నహీతి మన్యే ‘’అని కీర్తించాడు .అతని అనుగ్రహం పొందటానికి ‘’ఆసిఫ్ విలాసం ‘’రాశాడుకూడా .అసఫ్ వాణిసుధ లాగా ఉంది .మూర్తి వసుధ లాగా ఉంది .కీర్తి సుధాకర శ్రీ వలే ఉంది ఈసఫ్ అనే చంద్రుడి మతి పయోధి కల్పం అట .ఉపమానాలన్నీ స్త్రీలింగాలే .కీర్తికి  స్త్రీలింగాన్ని కృత్రిమం గా కల్పించాడంటారు ఆచార్యుల వారు .పయోదికల్పా కూడా కల్పిత స్త్రీలింగమే .పయోధి పురుష లింగం .వసుధ తో ఖాన్ ను పోల్చటం కూడా సరికాదంటారు .నవాబును ఆడదాన్ని చేశాడు మూర్తి శబ్దం తో అన్నారు .ఇంతకీ ఏమిటి అంటే జగన్నాధుడు శాబ్దిక కవి .అర్ధంగురించి ఆలోచన తక్కువ అని తేల్చారు .ఆ శాబ్దిక ప్రవాహం లో అర్ధం పట్టించుకోకుండా చేసే శక్తి అతనిది .శబ్దార్ధాలను రెండిటిని సమానం గా  నిర్వ హించే సామర్ధ్యం వాల్మీకి ,కాళిదాసు ,భారవి వంటి కొందరికే సాధ్యం అంటారు .Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-9-14-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.