గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17 15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -17

15-వక్రోక్తి విన్యాసి –రాజానక కుంతక కవి

కుంతకుడు అభినవ గుప్తుని తర్వాత వాడని చారిత్రకుల భావన .వింటర్ నిత్చ్ మాత్రం అభినవ గుప్తుని సమకాలికుడన్నాడు .క్రీ.శ 950-1050  వాడుగా అందరి అభిప్రాయం .ఆనంద  వర్ధనుడి ధ్వని సిద్ధాంతాన్ని ఖండించిన వారు ఉన్నారు కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారూ ఉన్నారు . అందులో కుంతకుడు వక్రోక్తి సిద్ధాంత ప్రతిపాదకుడు .ఆయన రాసిన గ్రంధమే ‘’వక్రోక్తి జీవితం ‘’.వక్రోక్తి ప్రాభవాన్ని బామహుడు అంగీకరించాడు .వక్రోక్తి కావ్య రచనకు అవసరమనీ చెప్పాడు .భామహుడి వక్రోక్తి దండి చెప్పిన గుణాలంకార సంప్రదాయమేకాకుండా వామనుడు చెప్పిన రీతి సంప్రదాయామూ కలిసి ఉంది .కానీ కుంతకుడు వక్రోక్తి సిద్ధాంతాన్ని శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు .ఈ ప్రాతిపాదనలో అతని ప్రతిభ అనితర సాధ్యం గా ఉంటుంది .వక్రోక్తిలో ధ్వని సంప్రదాయం కలిసిఉండక తప్పని పరిస్తితి ఉంది. కుంతకుడు ధ్వని సిదాన్తానికి విరోదికాడు .కాని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నూత్న మార్గాన్ని అవలంబించాడు .అందుకే ‘’ముసుగు వేసు కొన్న ధ్వని యే వక్రోక్తి ‘’అని దెప్పారుకూడా .

వక్రోక్తి సిద్ధాంతాలలో నాలుగు ఉన్మేషాలున్నాయి .కారికలు ,వ్రుత్తి అని రెండుభాగాలు చేశాడు .కారికలను వ్రుత్తి ని కుంతకుడే రాశాడు .మూల కారిక పేరు ‘’కావ్యాలంకారం ‘’వృత్తిని ‘’వక్రోక్తి జీవితం ‘’అన్నాడు మనకు లభించే గ్రంధం  సంపూర్న మైనది కాదని అభిప్రాయ పడుతున్నారు .వక్రోక్తి జీవితం లో రీతి గుణ ,రస ,అలంకారాల వివరాలుంటాయి స్వభావోక్తిని అలంకారం  అని ,వక్రోక్తి ఆలం కృతి అనీ అన్నాడు .కావ్యానికి శోభ చేకూర్చేది వక్రోక్తి అని ద్రుఢంగా నమ్మాడు కుంతకుడు .అందరూ అనే కావ్యాత్మ అనకుండా కుంతకుడు ‘’కావ్య జీవితం ‘’అన్నాడు ప్రత్యేకం గా .రసాన్ని అలంకారం గా ఒప్పుకోలేదు. రసయోగం చేత అలంకారం విశేషమైన ఆహ్లాదాన్ని కలిగించి చమత్కారం చూపిస్తే అది ‘’రసవదలంకారం  ‘’అన్నాడు .

వక్రోక్తి లో  ఆరు భాగాలు .వాక్య వక్రత ,ప్రకరణ వక్రతా ,ప్రబంధ వక్రత  భేదాలు చెప్పాడు కుంతాకుడు .వర్ణ విన్యాస వక్రత ,పద పూర్వార్ధ వక్రత ,పద పదార్ధ వక్రత ,.పూర్వా లంకారులు  చెప్పిన వైదర్భి గౌడి పాంచాలీ రీతులను పేరుమార్చి సుకుమార ,విచిత్ర ,మధ్యమ మార్గాలుగా పేర్కొన్నాడు .రీతికి మార్గం అని పెరుపెట్టడన్నమాట .కాళిదాసాదులు సుకుమార మార్గానికి ,బాణ భవ భూతులు విచిత్రమార్గానికి ,మయూరుడు మార్గ గుప్తాదులు మధ్యమ మార్గానికి చెందినవారని విశ్లేషించాడు కుంతకుడు .ప్రతి కవికి భిన్నమైన శైలి ఉంటుందన్నాడు .కవి వ్యక్తిత్వం శైలిలో ప్రతి బిమ్బిస్తుంది అన్నాడు .సోమేశ్వర ,మాణిక్యచంద్ర వంటివారు కుంతకుని వక్రోక్తిని పూర్తిగా సమర్ధించారు పాశ్చాత్య ఆలంకారిక భావాలకు కుంతకుని ఆలోచనలు దగ్గరలో ఉన్నట్లుకనిపిస్తాయి కావ్య నిర్వచనం అలంకార నిర్ణయం ,రీతి వివరణలలో కుంతకుడు ఆధునిక మార్గమే తొక్కాడు .

Inline image 1  Inline image 2

మరో కవితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-9-14-ఉయ్యూరు

 

 

 

.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.