‘గుండమ్మకథ’, ‘మాయాబజార్’, ‘రోజులు మారాయి’, ‘కులగోత్రాలు’… తెలుగు సినీజగత్తుల్లో ఆణిముత్యాల్లాంటి ఆ సినిమాలను తలుచుకుంటే చాలు. ఠపీమని గుర్తుకొచ్చే పేరు రమణారెడ్డి. హీరోహీరోయిన్లు ఎవరైనా, పాత్ర ఏదైనా ఆయన నటనాశైలి తీరే వేరు. విలనిజంలో హాస్యం చొప్పించినా- హాస్యానికి విలనీ జోడించినా.. ‘అయయో జేబులొ డబ్బులు పోయెనే’ అంటూ ఓ సోమరిపోతు పేకాటరాయుడి జీవనశైలి వివరించినా ఆయనకే చెల్లింది. హాస్య నటనకు సరికొత్త భాష్యం చెప్పిన తిక్కవరపు రమణారెడ్డి 1950వ దశకం నుంచి తెలుగు సినిమాల్లో వినూత్న కామెడీ విలనిజాన్ని ఆవిష్కరించారు. నేడు రమణారెడ్డి40వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్రెడ్డి తండ్రి స్మృతులను గుర్తు చేసుకున్నారు.
మాది నెల్లూరు జిల్లా జగదేవిపేట. నాన్నగారు అక్కడే 1921లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసమంతా నెల్లూరులోనే జరిగింది. వీఆర్ కళాశాలలో ఇంటర్మీడియేట్ చదివేందుకు చేరారు. ముగ్గురు సంతానంలో నాన్న రెండో అబ్బాయి. మా పెదనాన్న గారబ్బాయే కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త టి.సుబ్బిరామరెడ్డి. మాది మొదటి నుంచీ ఉన్నతమైన కుటుంబమే. అయితే నాన్నకు చదువు పెద్దగా అబ్బలేదు. కానీ ఆయన ఆంగ్లం బాగా మాట్లాడేవారు. నాడు సినీ పరిశ్రమలో అతికొద్దిమందికే ఆంగ్లం వచ్చు. స్కూలు నుంచే నాన్నగారికి నాటకాల పిచ్చి వుండేది. ఆయన నాటకాల్లో మొట్టమొదట వేసిన వేషం గిరీశం పాత్ర అని ఓ చోట ఆయనే స్వయంగా రాసుకున్నారు. ఆ పాత్రలో బాగా ఇమిడిపోవడంతో చాలా అవకాశాలు వచ్చేవి. దాంతో చదువు పక్కనపెట్టేసి నాటకాల కోసం తిరగడం మొదలుపెట్టారు. నెల్లూరులోని అమెచ్యూర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నాటకాలు వేసేవారు.
గిరీశం ధూమపానం సేవిస్తూ కనిపించే పాత్ర. ఓరోజు నాటకంలో గిరీశం వేషం వేసిన సమయంలో వేదిక ముందు చాలామంది గ్రామపెద్దలు, కలెక్టర్ వంటివారు కూర్చొని వున్నారట. మా ముందే రమణారెడ్డి సిగరెట్ తాగుతాడా అంటూ వారంతా మండిపడ్డారట. ఈ విషయాన్ని మా బంధువొకరు నిత్యం చెబుతుండేవారు. అప్పట్లో మద్రాస్లో ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ జరిగేది. అందులో పోటీలో కాకుండా వేరేగా ఓ నాటకం వేశారు. నేపథ్య గాయని ఎస్.జానకి మామగారైన మోనో యాక్టర్ చంద్రశేఖరంతో కలిసి ‘దొంగాటకం’ నాటిక వేశారు. చంద్రశేఖరంగారు రకరకాల పాత్రలకు స్వయంగా మేకప్ వేసుకునేవారు. నాటకాలపై వున్న పిచ్చితో నాన్నకు సరిగ్గా చదువు అబ్బలేదు. దాంతో ఆయన ఇంటర్మీడియేట్ పాస్ కాలేకపోయారు. ఆ తర్వాత పెద్దల బలవంతం మీద శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సు చేశారు.
ఎదిరించి ఉద్యోగం పోగొట్టుకున్నాడు..
గుంటూరు మున్సిపాలిటీలో టీకాలు వేసే ఇన్స్పెక్ట్టర్గా ఉద్యోగంలో చేరారు. అప్పట్లో టీకాలంటే చాలామందికి భయం వుండేది. ఓ రోజు గుంటూరు మున్సిపల్ కమిషనర్కు, ఆయన కుటుంబీకులకు టీకాలు వేయడానికి వెళితే వాళ్లు వద్దన్నారు. కానీ వేయించుకోవాల్సిందేనని ఈయన పట్టుబట్టారు. దాంతో కమిషనర్నే ఎదిరిస్తావా? అంటూ అధికారులు నాన్నని ఉద్యోగం నుంచి తొలగించేశారు. తరువాత మద్రాస్లో ఓ తమిళ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా చేరారు. కొన్నాళ్లకు ఆ కంపెనీ మూతబడడంతో నెల్లూరు వెళ్లి ఓ పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేశారు. వెంకటగిరి అమెచ్యూర్ నాటక కళా పరిషత్ ప్రోత్సాహంతో నెలజీతం మీద ఆంధ్రప్రదేశ్ పర్యటనకు బయలుదేరారు. ఆ పర్యటన ఆర్థికంగా జయప్రదం కాకపోవడంతో ఆ తరువాత అది కూడా మానుకుని కొంతకాలం ఇన్స్యూరెన్స్ కంపెనీలో పని చేశారు.
అలా సినిమాల్లోకి..
ఇన్స్యూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నా నాటక ప్రదర్శనలు మాత్రం మానలేదు. ఓ రోజు ఏదో నాటకంలో ‘లవకుశ’ సినిమా నిర్మాత ఎ.శంకర్రెడ్డి నాన్నగారి నటన చూసి మెచ్చుకున్నారు. నాన్నగారంటే ఆయనకు మంచి అభిమానం. ఆయన మద్రాస్లో సినిమా కంపెనీ పెట్టినప్పుడు తొలి సినిమాలోనే నాన్నగారికి మంచి పాత్ర ఇచ్చారు. అదే ‘మానవతి’ చిత్రం. అందులో ఆయనది విలన్ పాత్ర. ఆ సినిమాకు దర్శకుడు ఇప్పటి సీనియర్ నటి లక్ష్మి తండ్రిగారైన వైవీ రావ్. ఆ తరువాత ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి ‘దీక్ష’ సినిమా చేశారు. కానీ ఇందులో హాస్యపాత్ర. తొలిగా నటించింది ‘మానవతి’ అయినా, విడుదలైన సినిమా మాత్రం ‘దీక్ష’. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం 200 సినిమాలకు పైగానే సాగింది.
అదే ఇల్లు కొన్నారు..
ఇప్పుడు మేం వుంటున్న ఇంట్లో ఒకప్పుడు చిత్తూరు వి.నాగయ్యగారు అద్దెకు వుండేవారు. నాన్న ఓసారి నెల్లూరు నుంచి మద్రాస్ వచ్చి చిత్తూరు నాగయ్యగారిని ఇదే ఇంట్లో కలిశారట తనకు ఓ అవకాశం ఇవ్వాలని. అయితే అప్పట్లో అవకాశం లేకపోవడంతో ఓ సినిమాలో తన శిష్యుల్లో ఒకరిగా నటించాలని, అందుకు బోడిగుండు కొట్టించుకోవాలని సూచించారట. అందుకు ‘మీరిచ్చే బోడి వేషానికి నేను గుండు గీయించుకోవాలా?’ అని నాన్న ఆ అవకాశాన్ని తిరస్కరించి వెళ్లిపోయారట. అయితే నాన్న సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న తరువాత 1959లో అదే ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటికీ నాగయ్యగారు ఈ ఇంట్లో అద్దెకుంటున్నారు. నిజానికి ఈ ఇల్లు కొనుగోలు చేయాలని నాగయ్యగారే నాన్నకు సూచించారు. వాసి బాగా వున్న ఇల్లు కాబట్టి దీనిని కొనుగోలు చేయాలని ఆయన సూచించడంతో నాన్న అంగీకరించారు. తను అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన ఇల్లే స్వంతం కావడమంటే మాటలు కాదు.
దానధర్మాలు అధికం
నాన్నకు దానధర్మాలు అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా గుప్త దానాలు. ఆ రోజుల్లో సినిమావాళ్లు గృహప్రవేశాన్ని అందరినీ పిలిచి బ్రహ్మాండంగా చేసుకునేవారు. కానీ 1960లో మేం ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు నాన్న ఎవ్వరికీ చెప్పలేదు. ఓ వెయ్యిమంది పేదలను రప్పించి అన్నదానం చేశారు. ఆయన ఆలోచనా తీరు అలానే వుండేది. ఇంకా చాలా మంచి పనులు చేశారు. కానీ అవేవీ ఆయన చెప్పుకునేవారు కాదు.
మెజీషియన్గా..
నాన్నా చాలా బాగా మ్యాజిక్ చేసేవారు. ఆయన ‘అక్కాచెల్లెళ్లు’ అనే సినిమాలో మెజీషియన్ పాత్ర పోషించారు. ఆ పాత్రలోని విశేషం బాగా నచ్చడం వల్లనేమో నాన్న మ్యాజిక్ నేర్చుకున్నారు. ఎం.శేషాద్రి (మెస్ర్డీ) అనే మెజీషియన్ వద్ద రెండుమూడు నెలలు మ్యాజిక్ నేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా 1957లో నెల్లూరులో ‘మ్యూజిక్-మ్యాజిక్’ పేరుతో ఘంటసాల గారితో కలిసి ప్రదర్శన ఇచ్చారు. ఆయన పాటలు పాడితే, ఈయన మ్యాజిక్ చేశారు. అప్పటి నుంచి మెజీషియన్గా నాన్నకు ఎన్నో అవకాశాలు వచ్చేవి. ఎక్కువగా సహాయాల కార్యక్రమాలకే ఉచితంగా ప్రదర్శనలిచ్చేవారు. ఈ ప్రదర్శనల వల్ల వచ్చినదానికన్నా పోయిందే ఎక్కువ. ఈ విషయం నాకు బాగా తెలుసు. సినిమాల్లో కూడా నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారు. ఇప్పటిలా ధనార్జనే లక్ష్యంగా వుండేది కాదు.
ఇంట్లో చాలా సీరియస్..
సినిమాల్లో ఆయన చేసిన విలనీ, కామెడీ పాత్రలకూ, ఆయన నిజజీవితానికీ పొంతనే లేదు. నిజ జీవితంలో ఆయన చాలా సీరియస్గా వుండేవారు. సమాజ సేవా తత్పరత ఎక్కువ. షూటింగ్ లేకపోతే ఆంధ్రా క్లబ్ (ఆస్కా), టి.నగర్ క్లబ్, మద్రాస్ రేస్ క్లబ్లలో ఉత్సాహవంతమైన సభ్యుడిగా వుండేవారు. పద్మనాభం నిర్మించిన సినిమా ‘దేవత’లో పద్మనాభం పాత్ర మద్రాస్ వచ్చి సినిమావాళ్లను పలుకరించి వెళ్తుంది. ఇందుకోసం ఓ రోజు పద్మనాభం గారు ఫోన్ చేసి కెమెరాతో మీయింటికి వస్తున్నాం అన్నారు. నాన్న చాలాసేపు చూసి బయటకు బయలుదేరారు. అంతలోకి పద్మనాభం రావడం, నాన్న పలుకరించడం జరిగిపోతుంది. ఇదంతా ఆ సినిమాలో కనిపిస్తుంది. అదంతా నిజ సన్నివేశమే. ‘ఏంటి మీరు సినిమాలో బాగా హాస్యం పండిస్తారు. నిజజీవితంలో ఇంత సీరియస్గా వున్నారు?’ అని పద్మనాభం పాత్ర అడుగుతుంది. ‘సినిమాల్లో కమేడియన్గా చేస్తే, బయట కూడా నవ్వించాలా?’ అని నాన్న అడుగుతారు. అదంతా షూటింగ్లో భాగమని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజమైన సన్నివేశమే. నాన్న సినిమాల్లో వున్నా పబ్లిసిటీకి దూరంగా వుండేవారు. ఆయన అజాత శత్రువు. పరిశ్రమలో ఆయనకు ఎవ్వరూ శత్రువులు లేరు, ఆయనకు ఎవ్వరిపైనా శత్రుత్వ భావం లేదు.
మాకు పూర్తి స్వేచ్ఛ
మేం ఐదుగురం సంతానం. నేనే పెద్దవాణ్ని. ముగ్గురు చెల్లెళ్ల తరువాత తమ్ముడు పుట్టాడు. నేను, తమ్ముడు ఇంజనీరింగ్ పూర్తి చేశాం. నేను ఎల్ అండ్టీలో పదేళ్లు, ఆ తరువాత కోరస్ ఇండియాలో కొంతకాలం పని చేసి స్వచ్ఛంద పదవీవిరమణ చేశాను. నా వయసు 67. మా పెద్ద చెల్లెలు వసుమతి ఇంగ్లాండ్లో, 2వ చెల్లెలు స్వర్ణలత నెల్లూరులో, 3వ చెల్లెలు పద్మావతి పుదుచ్చేరిలో, తమ్ముడు శ్రీనివాస్ అమెరికాలో వుంటున్నారు. నాన్న ఏనాడూ మాకు ఫలానా చదవండి అనో, ఫలానా అవ్వండి అనో చెప్పలేదు. మాకేం కావాలో, మేమేం చదవాలో మేమే నిర్ణయించుకునేలా పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నిజానికి మేమేం చేస్తున్నామన్నది ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఓ రోజు ఎస్వీ రంగారావు మాయింటికి వచ్చారు. ‘మీ పెద్దవాడు ఏం చేస్తున్నాడు’ అనడిగితే… నాన్న నన్ను పిలిచి ‘ఇంజనీరింగ్ ఏ సంవత్సరం చదువుతున్నావురా?’ అని అడిగారు. అంటే ఆయన పెద్దగా పట్టించుకునేవారు కాదన్నమాట. అంతా అమ్మే చూసుకునేది. ఇప్పుడు అమ్మ సుదర్శనమ్మ వయసు 90. నా వద్దే వుంటోంది. భగవంతుడు మాకు నాన్న వారసత్వంగా నటన ఇవ్వలేదు గానీ, మంచి చదువు మాత్రం ఇచ్చాడు. బహుశా అదే మాకు మైనస్ కూడా అయిందేమో అనిపిస్తుంటుంది. 1974 నవంబర్ 11న మరణించారు నాన్న. అంటే 53 ఏళ్లకే ఆయన కన్ను మూశారు. చాలామంది ఆయన శరీరాకృతి చూసి మంచి వృద్ధాప్యంలో చనిపోయారనుకుంటారు. కానీ పిన్నవయసులోనే మరణించారు. ఆయనకు అల్సర్. ఇప్పటిలా ఆ కాలంలో అల్సర్కు మందులు లేవు. 1968లో ఆయనకు ఆపరేషన్ కూడా జరిగింది. అప్పటి నుంచే ఆయన యాక్టివ్గా లేరు. ఆ తరువాత సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి.
చొక్కా ధరించిన నారదుడు
తెలుగు సినిమాలో నారదుడికి చొక్కా వేసింది నాన్నగారే. ‘పార్వతీ కల్యాణం’ అనే చిత్రంలో నాన్న నారదుడి వేషం వేశారు. అయితే బాగా బక్కపల్చగా వుండడంతో దర్శకుడు ఆయనకు జుబ్బా తొడిగించారు. ఇది చాలా పెద్ద వివాదమైంది. ఓ పెద్దాయన వచ్చి ‘ఏమయ్యా నారదుడి వేషం వేస్తూ జుబ్బా తొడిగావే? ఏం చేస్తాం కలికాలం’ అన్నారట. అందుకు నాన్నగారు ‘కలికాలం కాదు… అది చలికాలం’ అన్నారు. అంతటి సమయస్ఫూర్తి నాన్నది.
మాటలతో ఏడిపిస్తారు
మాటలతో ప్రేక్షకులను ఏడిపిస్తారు. ఆయన ప్రతిభకు తగిన సీరియస్ పాత్రలు రాలేదన్న భావన ఆయనకు కూడా వున్నట్లుంది. నాన్నగారు కమెడియన్ కన్నా విలనీ పాత్రలే ఎక్కువగా చేశారు. ఆయన శరీరానికి అనుగుణంగా విలనిజానికి కామెడీ జోడించడంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగారు. అందుకే ఇన్నేళ్లయినా నాన్న తెలుగు ప్రేక్షకుల మదిలో వుండగలిగారు.
ఎన్నో అపోహలు
నాన్న 1973లో ‘కీమత్’ సినిమాకు అసిస్టెంట్ స్టంట్ మాస్టర్గా పని చేశారని ఓ టీవీ షోలో చెప్పారట. ఆయన పర్సనాలిటీకి స్టంట్మాస్టర్గా చేయగలరా? అదే విధంగా ఆయన జన్మదినం కూడా కరెక్టు కాదు. ఆయన పుట్టిన సంవత్సరం మాత్రమే కరెక్టు. ఆయన తొలి సినిమా ‘మాయపిల్ల’ అని చాలాచోట్ల వుంది. అదీ కరెక్టు కాదు. ఆ సినిమాలో ఆయన అసలు నటించనేలేదు.
డాక్టర్ ఎస్కేఎండీ గౌస్బాషా, చెన్నై