డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర పట్టభద్రులు. విద్యారంగంలోను అసోసియేషన్ ప్రొఫెసర్గా చాలా సంవత్సరాలు పనిచేసి ఉత్తమ విద్యార్థులను తయారుచేసిన ఘనత డాక్టర్ ప్రమీలాదేవిది. విద్యారంగానికి,విద్యార్థులకు చేసిన సేవకు ఉత్తమ ఉపన్యాసకులు (బెస్ట్ లెక్చరర్)గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి స్వర్ణపతక గౌరవాన్ని పొందారు.
వీరు రచించిన’’ తెలుగులో పద్యగేయ నాటికలు’’ అనే విమర్శనాత్మక గ్రంథం పద్యగేయ నాటికా విమర్శనారంగంలో మొట్టమొదటిది. ఈ గ్రంథం 1971వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ఉత్తమ గ్రంథ పురస్కారాన్ని పొందింది.
ఈ సంవత్సరం 2018 నాటి సరస్వతీ వరం ప్రఖ్యాత రచయిత్రి, పద సాహిత్య పరిషత్తు వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవికి లభించింది. భోపాల్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ‘అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం’ వారు జూలై 29వ తేదీన డా మంగళగిరి ప్రమీలాదేవికి ‘సరస్వతీ సమ్మాన్’ పురస్కారాన్ని అందజేశారు.. డా మంగళగిరి ప్రమీలాదేవి తెలుగులో అనేక పరిశోధనాత్మక రచనలు చేశారు. ‘’డా జి.వి.కృష్ణారావు నాటికా సాహిత్య సమాలోచనం’’ అనే విషయం మీద పరిశోధన చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి ఎంఫిల్ పట్టా పొందారు. ప్రథమాంధ్ర వాగ్గేయకారులైన’’ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలలోని జానపద సంగీత రీతులు, ఫణుతుల’’పై విశేషంగా పరిశోధన చేసి, ఈ విషయంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి పిహెచ్డి డిగ్రీ పొందారు. అంతటితో ఆగక నిత్య నిరంతరం సంకీర్తనా, వివిధ రీతులు, సంకీర్తనాకారులు అనే విషయాలపై పరిశోధన చేస్తూనే ఉన్నారు. చరిత్ర ఎరుగని పదకర్తలను 50 మందిని వెలికితీసి వారి సంగీత సాహిత్యాలకు ఈ తరం గాయనీ గాయకులకు పరిచయం చేశారు. టాంక్బండ్మీద క్షేత్రయ్య విగ్రహం నెలకొల్పినపుడు పదకర్త క్షేత్రయ్య జీవిత చరిత్రను తెలుగు విశ్వవిద్యాలయం వారి కోరిక మేరకు రచించారు. నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణల సందర్భంగా వీరు వ్రాసిన’’ గేయ అధ్యాత్మ రామాయణాన్ని’’ గూర్చిన గ్రంథాన్ని తెలుగు అకాడమీవారు ప్రచురించారు. 2016వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. పద సాహిత్య పరిషత్తుకు అనుబంధంగా ప్రచురణ విభాగాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 35 పుస్తకాలను ప్రచురించారు.
డాక్టర్ ప్రమీలాదేవిని బాగా తెలిసిన పెద్దలు ‘’వాగ్గేయకారుల ప్రమీలాదేవి’’గా పిలుస్తారు. దీనిని గూర్చి మంగళగిరి ప్రమీలాదేవిని ప్రశ్నించగా ఆ పిలుపును తాను గొప్ప గౌరవంగా భావిస్తానన్నారు.
తాను రచించిన షిరిడీ సాయినాథ నామ వైభవం’’ హైదరాబాదు, త్యాగరాయగానసభలో నాట్య గురు శ్రీమతి ఝాన్సీరామ్ దర్శకత్వంలో ప్రదర్శించడం జరిగిందనీ, ఆ ప్రదర్శనకు తాను, నాట్య గురు ఝాన్సీ రామ్ కలిసి పాట పాడామని ఆనాటి గీత గాన అనుభూతి తనను ఇంకా సంతోషం కలిగిస్తూనే ఉన్నదనీ చెప్పారు ‘సరస్వతి సమ్మాన్’ గౌరవ స్వీకర్త డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి.
డాక్టర్ మంగళగిరి 2012లో అమెరికాలోని హూస్టన్, డల్లాస్ నగరాలలో జరిగిన సాహిత్య సభలలో ప్రసంగించి ఆయా సంస్థల చేత సత్కారాన్ని పొందారు. 2014లో జార్జియా అట్లాంటాలో జరిగిన నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) వారి తెలుగు సభలలో పాల్గొని గేయ అధ్యాత్మ రామాయణాన్ని గురించి సోదాహరణ ప్రసంగం చేసి ఆ సభలో సత్కారాన్ని పొందారు.
కృష్ణలీలా తరంగిణిలోని తరంగాలంటే తనకు చాలా ఇష్టమనీ, తాను పాడి, కొందరు మహిళా బృందాలకు నేర్పించి పాడించాననీ, అది తనకు సంతృప్తిని కలిగించిన విషయమని తెలియజేశారు.
ఇటీవల ప్రచురితమైన సంగీత, నృత్య నాటికలు ‘నారీ మంగళ మహాశక్తి’ ప్రథమ గణ్యమని అంటారు ఆమె. భారతజాతి గర్వించదగిన మహోన్నత స్త్రీ మూర్తులు, వారి గాధలను వివరిస్తూ నృత్య గేయ రూపంలో వచ్చిన పుస్తకమిది.
ఇదే సంపుటిలోనున్న ‘కలువభామ- విమల ప్రణయం’ అనే నృత్య నాటికను గురించి ఒక విషయం చెప్పాలి. ఇది ఆసాంతం భావ ప్రధానంగా నడిచిన భావ నాటిక. హిందీలోను కొన్ని గ్రంథాలను రచించి ఔత్తరాహులకు కూడా ఆంధ్ర వాగ్గేయకారులను పరిచయం చేశారు.
అనేక ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవికి అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళన్ వారి ‘సరస్వతీ సమ్మాన్’ గౌరవం దక్కడం అభినందనీయం.
ఆమె సంస్కృత, తెలుగు, హిందీ భాషల్లో పాండిత్యం గడించి దాదాపు 40కి పైగా గంథ్రాలను రచించారు. అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగ పాణి, భక్త కవుల రచనలలో సంగీత సాహిత్యాలపై విశేష పరిశోధన చేశారు. తెలుగులో పద్యగేయ నాటికలు రచించిన ఆమెకు 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.’’ పదసాహిత్య పరిషత్’’ అనే సాహిత్యసేవా సంస్థను స్థాపించి సేవలందించారు. ఆకాశవాణి దూరదర్శన్ల ద్వారా బహుళ ప్రజాదరణ పొందిన అనేక గేయాలను, సంగీత రూపకావ్యాలను రచించారు.
ప్రముఖ రచయిత్రీ సాహిత్య రత్న డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి(75) అనారోగ్యంతో 1-11-18 గురువారం మృతిచెందారు . మల్కాజిగిరి సర్కిల్ పరిధి మిర్జాల్గూడలో నివాసముంటున్న ప్రమీలాదేవి గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు . నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆమె అంత్యక్రియలు మల్కాజిగిరి స్మశానవాటికలో జరిగాయి. పలువురు సంతాపం తెలిపారు. జేశారు .
ఆధారం –ఆంధ్రభూమి లో ఆగస్ట్ 7న ప్రచురింపబడిన వ్యాసం
శ్రీమతి ప్రమీలాదేవిగారి సోదరులు ,హైదరాబాద్ ఆకాశవాణి విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ,ప్రముఖ సంగీత విద్వాంసులు, అపర ఘంటసాల, సరసభారతికి, నాకు అత్యంత ఆత్మీయులు మాన్యశ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు ఆమె మరణ వార్తను వెంటనే నాకు తెలియ జేశారు .నేను వెంటనే అందరికి తెలిపాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-11-18-ఉయ్యూరు
