తిరుపతి వెంకటాద్రి రాముడు

అనే తిరుపతి కొదండరామ స్వామి దేవాలయ విశిష్టత

అనే పుస్తకాన్ని శ్రీ తలుపూరు రామ రమేష్ కుమార్ రచించగా తిరుమల తిరుపతి దేవస్థానం 2004లో ప్రచురించింది ,వెల-ఉచితం .దీనిని సీతా లక్ష్మణ భక్తాంజనేయ సమేత శ్రీ కోదండరామికి అంకితమిచ్చారు .దీనికి మున్నుడి వ్రాస్తూ భక్తా౦ఘ్రిరేణువు శ్రీ సింగరాజు సచ్చిదానందం ‘’ఒకప్పుడు తిరుపతి కపిల తీర్ధం దగ్గర విజయ నగర సామ్రాజ్యం కాలం లో అచ్యుత రాయపురం అని పిలువబడేదని,అప్పటి మహమ్మదీయ దండయాత్రలో అక్కడి కోదండరామాలయం శిధిల మవగా , తిరుపతి నడి బొడ్డున ఈనాటి కోదండ రామాలయం పునర్నిర్మితమైంది అని రచయిత రాసినమాటలు యదార్ధం .ఆలయం వంట శాలలో వకుళమాలిక విగ్రహం ఉండేదని,రాముడికి ఎదురుగా ఆస్థాన మండపం ,ఆంజనేయ దేవాలయం ,వీరికి జరిగే నిత్యోత్సవ ,పక్షోత్సవ ,మాసోత్సవాదులన్నీ వివరించి  రాశాడు .కోదండ రాముడిని ‘’వెంకటాద్రి రాముడు ‘’అనటం అత్యంత సముచితం ‘’అని రాశారు .

  రచయిత ఈ ఆలయ విశేషాలు వివరిస్తూ రిరుమల వెంకన్నకు జరిగినట్లే కోదండ రాముడికీ ఆగమ విధానం లో బ్రహ్మోత్సవాలతో సహా అన్నీ జరిగేవి అని చెప్పాడు .స్థానిక స్థలపురాణ విషయాలన్నీ క్రోడీకరించి తాను ఈ పుస్తకం రాశానన్నాడు .రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాలక్ష్మణ సుగ్రీవ హనుమ జాంబవంత అంగద సమేతంగా తిరుమలకు వచ్చిన సందర్భంగా ఈ ఆలయం నిర్మించబడింది .భవిష్యత్ పురాణం లో సీతాన్వేషణ సఫలమైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు .అందుకే రామస్వామి పడమర వైపుకు తిరిగి ,తూర్పు వైపు చూస్తున్న బాలాజీకి ఎదురుగా నిలుచుని ఉన్నాడు .ఆనాటి పడమటి వైపున్న గుంట నే ఇప్పుడు రామచంద్ర తీర్ధం లేక కోనేరు అంటారు .జనమేజయ చక్రవర్తి ఈ తీర్ధం లో స్నానానికి దిగినప్పుడు ఈ ఆలయ విగ్రహాలు దొరికినట్లు వాటిని స్థాపించి దేవాలయం నిర్మించినట్లు చెప్పుకొంటారు .ఇది జాంబవంతుని ప్రతిష్ట అనీ అంటారు. ఒంటిమిట్ట కొదందరాముని,వాయల్పాడు పట్టాభి రాముడిని కూడా జాంబవంతుడే ప్రతిష్టించాడని అంటారు .శ్రీసాధు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు దీనిపై విశేష కృషి చేసి రాసిన ‘’తిరుపతి వెంకటేశ్వర ‘’  పుస్తకం లో ‘’సవాల్ ఎ జవాబ్ పట్టీ ‘’అధ్యాయలం లో కొదండరామాలయచరిత్ర ఉంది .త్రేతాయుగం లో రాముడు వానర సైన్యంతో ఇక్కడ ఒకరాత్రి విశ్రమించాడు .అప్పుడు ఆ౦జనేయాదులు వైకుంఠ గుహనుంచి వెలువడుతున్న తేజస్సు చూసి రాముడికి చెబితే ఈ పర్వతం అంతా తేజోమయమే అన్నాడు .రావణ వధ తర్వాత మళ్ళీ వచ్చికొంతకాలం ఉండి గుర్తుగా  తిరుపతిలో కోదండరామాలయం నిర్మించాడు .రామ,సీతా  లక్ష్మణ హనుమ విగ్రహాలు నెలకొల్పారు .

జనమేజయ చక్రవర్తిశిధిలావస్థలో ఉన్న  ఈ ఆలయాన్ని వైభవోపేతంగా పునర్నిర్మించాడు .యాదవ రాజులు క్రీశ 834లో మండప ,ప్రాకారాలు కట్టించారు .ఆలయ చరిత్ర చెప్పే శాసనాలు దొరకలేదు .ఆలయం ఉత్తర గోపురం దగ్గర అచ్యుత దేవరాయలు సమర్పించిన  రథం గురించి ఒకటి ,వంటశాలలో పెద్ద రాతి గిన్నె పై నారాయణన్ అనే నేలటూరు గ్రామస్థుడు స్వామికి ఒక గిన్నె సమర్పించినట్లు ఉన్నది .గోవిందరాజస్వామి ఆలయం లో ‘’కూరత్తాల్వార్’’మండపం ఉత్తరగోడ లోపలిభాగం లో దొరికిన శాసనాలలో కోదండరామాలయ విశేషాలు ఎక్కువగా ఉన్నాయి .క్రీ శ.1480లో శఠ గోప దాసర్ నరసింహమొదలియార్  అనే ఆయన నరసింహ ఉడయ్యార్ కాలం నాటి సంస్కృతీ సంప్రదాయాల చిహ్నంగా ‘’రఘునాథుడు ‘’అనే పేరుతొ రాముడి విగ్రహాన్నిచ్చి ,గోవిందరాజాలయానికి ఉత్తరాన కోదండ రామాలయం నిర్మించాడు  .ఇతడే వీర సాలువ నరసింహరాయలు అని సాధు సుబ్రహ్మణ్యంగారు గుర్తించారు .ఈ రాయాలే అవిలాల గ్రామం లో 15ఎకరాలు స్వామి వారి కై౦కర్యాలకోసం ఇచ్చినట్లు శాసనం ఉంది .1494లో ఈరాయలు ,కొడుకు ఇక్కడికి వచ్చి మార్చి 9న మొదటిసారిగా శ్రీరామనవమి ఉత్సవం జరిపి ఒక ‘’అప్పపడి’’స్వామికి సమర్పించి హనుమంతునికి కూడా నైవేద్యం సమర్పింఛి ఉత్సవ మూర్తులకు వైభవోపేతంగా ఊరేగింపు అనే గ్రామోత్సవం జరిపారని శాసనం ఉంది .’’కనుప్పొడి’’రోజున సీతాదేవి అభిషేకం చేసి ,రెండు సార్లు ‘’తిరు పోనక్కం ‘’నైవేద్యం పెట్టారు .అంటే శ్రీరామనవమి ఉత్సవాలుఏ కోదండ రామాలయం లో సుమారు 560ఏళ్ల నుంచీ జరుగుతున్నాయని తెలుస్తోంది .14-1-1529న అచ్యుతదేవరాయలు శ్రీ కుమార రామానుజ అయ్యర్ ఆధ్వర్యం లోఫల్గుణి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉపయోగించే  ఒక అద్భుత కొయ్య రథాన్నిసమర్పించాడు   .నాలుగు మాడ వీధులలో స్వామి వారిని ఊరేగించేవారు .అంటే బ్రహ్మోత్సవాలుకూడా సుమారు 500 ఏళ్లుగా ఇక్కడ చేస్తున్నారన్నమాట .1859లో ఉద్దాన ధార్వర్ ఉళగప్పన్  అనే భక్తుడు ‘దివ్య ప్రబంధ పారాయణం ‘’చేసే ‘’అధ్యయ నోత్సవం జరిపాడు.ఆరవ రోజున రామానుజ అయ్యంగార్ ‘’శాత్తుమొర’’జరిపించారు తెప్పోత్సవం ఒక రోజు జరిగింది .తాళ్ళపాక పేద తిరుమలాచార్య కుమారుడు ,వెంకటేశ్వరస్వామి ఆస్థాన గాయకుడు శ్రీ తాళ్ళపాక తిరుమలాచార్యులు ‘’ఇడ్డలిపడి’’అనే స్పెషల్ నైవేద్యం 1547లో సమర్పించాడు .1540నుంచి తిరువే౦గడ రామానుజ జియ్యర్ గారి ఆధ్వర్యం లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-12-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.