ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్

ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం

ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి వృద్ధి మొదలైంది .ఫిన్నిష్ భాషలో మొదట రాసిన వారిలో ఫిన్నిష్ ,లూదరన్ ,మైకేల్ అగ్రికోలాలు 1510-1557 మధ్య రాశారు .అగ్రికోలా న్యు టెస్ట్ మెంట్ ను 1548 లో ఫిన్నిష్ భాషలోకి అనువదించాడు .

19 వ శతాబ్ది పూర్వ భాగం లో ఫిన్లాండ్ రష్యా పాలనలో ఉండేది .స్వాతంత్ర సముపార్జనకై ఉద్యమాలు సాగటం తో జానపద సాహిత్యం అభి వృద్ధి చెందింది .మొదట్లో ఇవీ స్వీడిష్ భాషలో ప్రారంభమై క్రమంగా ఫిన్నిష్ భాషలో వ్యాప్తి చెంది ఫిన్నిష్ అస్తిత్వాన్ని సాధించింది .వేలాది జానపద కవితలు సేకరి౦చి ప్రచురించారు .మొదటి ప్రముఖ కవితా సంకలనం 1835 లో వచ్చిన ‘’కలే వాల ‘’ .అలెక్సిస్ కివి రాసిన ‘’సెవెన్ బ్రదర్స్ ‘’ఫిన్నిష్ మొదటినవల 1870లో వచ్చింది ‘’.ఫ్రాన్స్ ఈ మిల్ సిలనపా ‘’రాసిన ‘’మీక్ హెరిటేజ్ ‘’కు మొదటి నోబెల్ బహుమానం వచ్చింది .మరో ప్రముఖ రచయిత వైనో లిన్నా.ఇలా ఫిన్నిష్ సాహిత్యం ప్రపంచ గుర్తింపు పొందింది .ఇప్పుడు ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయితల గురించి తెలుసుకొందాం .

1- ఫిన్నిష్ దేశపు మొదటి కవయిత్రి -క్రిస్టినా రేజీనా వాన్ బర్చేన్ బాం : 

17 వ శతాబ్దపు ఫిన్నిష్ రచయిత్రి క్రిస్టినా వాన్ బర్చేన్ బాం స్వీయ చరిత్ర వంటి ఒకే ఒక ఆక్రోస్టిక్ కవిత 24-7-1651 లో రాసిన ‘’ఎనాన్నన్ నీ వీసా (మరో కొత్త పాట ) మాత్రమే లభించింది .ఎనిమిది లైన్లు ఉన్న స్టాంజాలలో 29 లైన్లు మాత్రమె దక్కాయి .ఇది ఫిన్నిష్ జానపద పాటలాగా ఉంటుంది .దీన్ని లింకో పిన్ లైబ్రరీలో భద్ర పరచారు . బర్చేన్ బాం కేరేలియా లో జన్మించింది .మూడేళ్ళప్పుడే తండ్రి చనిపోయాడు .వరించి వచ్చిన వరుని వివాహమాడి’’ ముప్ఫై ఏళ్ళ యుద్ధం ‘’ లో పాల్గొనటానికి భర్త వెడుతూ ఒక సందేశం రాసి పంపితే విషయం తెలుసుకొన్నది .17 ఏళ్ళు అతని కోసం నిరీక్షించి ఇక తిరిగి రాడు అని నిశ్చయం చేసుకొని ,తన వలపు వయసు వ్యర్ధమైనాయని బాధపడి ఒక య౦గ్ నోబుల్ మాన్ ను మళ్ళీ పెళ్ళాడింది .స్వార్ధ పరుల పుకారుల మధ్య అక్కడ ఉండ లేక కొత్త జంట విడిపోయింది .తన కవితలో తాను ఒంటరి దానినని వేదన భరించలేక తాను ఈలోకాన్ని వీడి వెళ్లి పోతున్నానని రాసుకొన్నది .ఫిన్లాండ్ దేశపు మొట్ట మొదటి కవయిత్రి గా బర్చేన్ బాం గుర్తింప బడింది

2—నాటక రచయిత్రి -క్రేస్టి సాల్వేజ్ బెర్గ్రోత్ : 

24-1-1886 న జన్మించిన కరే స్టి సాల్వేజ్ బెర్గ్రోత్ ప్రముఖ రచయిత ,నాటక రచయిత కూడా .చిన్నతనం లోనే సాహిత్యాభిలాష అలవడిన అదృష్ట వంతురాలు .1920 వరకు స్వీడిష్ భాషలోనే రాసి ,ఇంగ్లీష్ ఫ్రెంచ్ సాహిత్యాన్ని ఫిన్నిష్ భాషలోకి అనువాదం చేసింది .ఆమెకు జర్మన్ భాషపైనా మంచి పట్టు ఉంది.కేరిలియన్ మాండలికం లో ఆమె రాసిన ’’అను జా మిక్కో ‘’,కుపార్ సారే అంటి ‘’నాటకాలు బహుళ ప్రచారం పొందాయి .నవలలు నాటకాలు జ్ఞాపకాలు ,పిల్లల కధలు అన్నీ కలిపి 70 దాకా రాసింది .
వాలంటైన్ వాలా అనే సినిమా దర్శకునితోకలిసి ‘’టేట్’’అనే మారుపేరుతో ‘’మొర్సిలయన్ య్లాట్ట ,తోషితార్కోటు క్షేల ,డైనమిట్టీతో,ఊక్రా సుల్హానేన్ ,వికాన్ టిట్టో అనే ,అయిదు సినిమాలకు పని చేసింది .ఇవన్నీ హాస్యపు గుళికలే ఆమె రచనా ప్రతిభకు ఉదాహరణలే .యుద్ధానంతర కాల ప్రజలు ఈమె రచనలను పెద్దగా మెచ్చలేదు. మనసు గాయపడి రోమ్ ,ఇటలీలు తిరుగుతూ అప్పుడప్పుడు ఫిన్లాండ్ వస్తూ 1970 లో ఫిన్లాండ్ లో స్థిర బడింది .1975 జనవరి 24 న 7 9 వ ఏట హెల్సింకి లో మరణించింది .

3 – మత్స్య కార నవలా రచయిత్రి -అన్ని బ్లోం క్విస్ట్ : 

7-10-1909 లో అన్ని బ్లోం క్విస్ట్ రష్యన్ సామ్రాజ్యం లో ఉన్న గ్రాండ్ డచి ఫిన్ లాండ్ లోని అలాన్ ఐ లాండ్స్ లోని వార్డో లో జన్మించింది .తండ్రిది చేపలు పట్టే వ్రుత్తి .పది మంది సంతానం లో పెద్దది ..అమ్మమ్మ అన్నా దగ్గర పెరిగి మూడు నవలల శ్రు౦ ఖల రాసింది .1936 లో వాల్టర్ బ్లూమ్ క్విస్ట్ ను పెళ్లి చేసుకొని నలుగురు సంతానం కని, చేపల వేట, షిప్పింగ్, కొద్ది పాటి వ్యవసాయం పై జీవించారు .చురుకు దనం ఉండటం వలన స్థానిక మార్తా సంస్థకు చైర్మన్ అయి ,వాక్సినేషన్ ను ప్రోత్సహించింది .ఆలాండ్ ఐలాండ్ కు విద్యుచ్చక్తి రావటానికి కృషి చేసింది .ఆమె రాసిన మొదటి చిన్నకధ పోటీలలో మొదటి బహుమతిని 1949 లో సాధించింది .
రెండేళ్ళ తర్వాత మూడు నవలల ‘’ స్టారంస్కార్స్ –మజ’’ సీరియల్ లో మొదటినవల ‘’వేగెన్ స్టిల్ స్టారం స్కారేట్ ‘’నుప్రచురించింది .అయిదు నవలల ఈ సీరియల్ చేపలు పట్టే వాని భార్య మజ జీవిత చరిత్ర .ఈ నవలలు 19 7 5 లో టెలి సీరియల్స్ గా వచ్చాయి .అశేష ఆదరణ పొందాయి .1973 లో ఈ సీరియల్ లోచివరినవల పూర్తీ చేయగానే ,హెల్సింకి యూని వర్సిటి లోని స్టిగ్ జటినేన్ తో కలిసి ఆలాండ్ ఐలాండ్ ప్రజల జీవితం పై అధ్యయనం చేసి,’’సిమ్ స్కాలా ‘’పేరుతో దీన్ని 1977 లో ప్రచురించింది

తర్వాత ‘’అన్నా బీటా ‘’ట్రయాలజి మొదలు పెట్టి మొదటి నవల ‘’అన్నా బీటా ‘’రాసి 1979 లో వెలువరించింది .ఇందులోని కధలన్నీ తన అమ్మమ్మ భర్త అయిన తాతయ్య జీవిత చరిత్రే .1987 లో ఆమె కొడుకు సముద్రం లో మునిగి చనిపోయాడు .ఈ విషాదాన్ని జీవిత చరిత్రగా ‘’హావేట్ ఫిన్స్ ఇంటర్ మెర్ ‘’పేరిట రాసి 1989 లో ప్రచురించింది .జీవితాంతం వార్డో లో గడిపి బ్లోం క్విస్ట్ 26-6-1990 న 80 ఏళ్ళ వయసులో మరణించింది .ఆమె గౌరవార్ధం ఆలాండ్ ఐలాండ్ ప్రభుత్వం 21-3-2009 న ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది .క్విస్ట్ రెండు ఫిక్షన్ లు ,మజ సీరియల్ లో 5 నవలలు ,అన్నా బీటా ట్రయాలజిలో 3 నవలలు ,స్వీయ చరిత్ర వంటి 3 రచనలు చేసి ఫిన్నిష్ సాహిత్యాన్ని సుసంపన్నం చేసింది .చేపలు పట్టే స్త్రీ ఒక్కొక్క మెట్టూ ఎక్కి అనితర సాధ్యమైన సాహిత్య కృషి చేసి తనకు తన వ్రుత్తి వారికి తన గ్రామానికి ఆలాండ్ ఐలాండ్ కు చిర యశస్సు నార్జించి పెట్టిన స్త్రీ రత్నం బ్లోం క్విస్ట్ .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.