కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7     

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -7

వారిధి చూపిన వసుధ -2

దక్షిణ బర్మా దేశానికి వెళ్ళిన మొదటి  తెలుగు వారు అక్కడ ‘’మన్’’జాతి స్త్రీలను పెళ్ళాడి ,ఒక రాజ్యాన్ని స్థాపించటం చేత ‘’తెలైంగు’’ లు అనే పేరోచ్చి౦దని ,బర్మా చరిత్రకారుడు ‘’పెయిర్ ‘’రాశాడు .ఈ తెలైంగు రాజ్యం క్రీశ 12శతాబ్ది వరకు ఉన్నది .కళింగ దేశం నుంచి బౌద్ధ భిక్షువులు మతప్రచారం కోసం దక్షిణ బర్మాకు  వెళ్ళారు .అతి ప్రాచీనకాలం నుంచి భారత్ లో నౌకాయానం ఉన్నట్లు తెలుస్తోందికాని నౌకానిర్మాణం గురించి విషయాలు తెలియదు .భోజరాజు రచించినట్లుగా చెప్పబడుతున్న ‘’ యుక్తి కల్పతరువు ‘’లో అశ్వ,గజ, రత్న పరీక్షలతో పాటు నౌకానిర్మాణ విషయం కూడా ఉన్నది .నౌకా నిర్మాణానికి కావలసిన కలపలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులున్నట్లు ,అందులో బ్రహ్మజాతిది తేలికగా మృదువుగా ,క్షత్రియ జాతిది తేలికగా గట్టిగా ,ఉండటం చేత ఇదే ప్రశస్తమని ,అగాధ సముద్ర ప్రయాణాలకు అనువైందని ,సుఖ సంపదలనిస్తుందని చెప్పబడింది ..చెక్కల బిగి౦పు కు ఇనుపమేకులు వాడ రాదనీ ,నదులలో వెళ్ళేవి సామాన్యాలు ,సముద్రం లో నడిచేవి విశేషమైనవని చెప్పి వాటి కొలతలు ,వాటి భేదాలపేర్లు  బంగారు, వెండి అలకరణలు ,వేసే రంగులు ,వాటి అగ్రభాగాన చెక్కాల్సిన సింహ, గజ ,వ్యాఘ్ర ,పక్షి భేదాకృతులు ,సర్వ మందిరాలు మధ్యమందిరాలు ,అగ్రమందిరాలు ,వాటిలో భేదాల వివరణలున్నాయి .సర్వ మందిరాలు రాజుల ధనం గుర్రాలు , వాటిని నడిపే జనాలను తీసుకు   వెళ్ళటానికీ ,మధ్యమందిరాలు వర్షాకాలానికి ,రాజులు విలాస ప్రయాణాలకు ,అగ్రమందిరాలు నౌకాయుద్ధాలకు వాడుతారని చెప్పారు .

  మౌర్యకాలం లో నౌకానిర్మాణం ప్రభుత్వమే భారీఎత్తున చేబట్టింది .చంద్ర గుప్తుని యుద్ధ కార్యాలయం లో ఉన్న ఆరు విభాగాలలో నౌకాధికార వర్గం ఒకటి అని  నావాధ్యక్షపదవి చాలా బాధ్యతలతో కూడినదని ,కౌల్యుని అర్ధ శాస్త్రం లో ఉంది .అలేగ్జాండర్ అపార సేనావాహిని దేశీయులు తయారు చేసిన 3 వేల నావల మీదనే సి౦ధు నదిని దాటింది.ఆంధ్రరాజుల నాణాలమీద ఉన్న రెండు కొయ్యలున్న పెద్ద ఓడలే గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ మొదలైనవారు చేసిన నౌకా వాణిజ్యాలకు  సముద్రం పై వారి ఆధిపత్యానికి తార్కాణం .మార్కోపోలో కూడా హిందూమహాసముద్రం మొత్తం మీద విహరించే నౌకలనిర్మాణ౦  గురించి రాశాడు .వీటిని దేవదారు కర్రలతో చేసేవారని ,బిగి౦పు కు ఇనుపమేకులు వాడారని ,ఖాళీలలో జనపనార దూర్చి, ఒకరకమైన  చెట్టు  నూనెతో సున్నంకలిపి కీలులాగా పూసేవారని ,ఈనావలు చాలా విశాలంగా ఉండి ,దాదాపు మూడు వందలమంది నావికులు తెరచాపలు తెడ్లతో నడిపేవారని ,వీటివెంట రెండు ,మూడు ఓడలు ,ప్రక్కల పది పన్నెండు నావలు వ్రేలాడగట్టి తీసుకొని పోయేవారని ,పైభాగం అంటే డెక్ కు కింద ఉన్న అంతస్తులో వర్తకులకోసం 20 గదులు ఉండేవని ,దీని కిందిభాగం లో దెబ్బతగిలినా ,లోపలి  నీళ్లు రాకుండా చిన్న చిన్న గదులుగా చేసి చెక్కలు బిగి౦ చేవారని రాశాడు మార్కోపోలో ..ఫిరోజ్ షా తుగ్లక్ భట్టి రాజ్యం పై దండ యాత్ర చేసినపుడు 90 వేల ఆశ్వసైన్యాన్ని ,480 ఏనుగులను ,సుమారు 5000ఓడలలో సి౦ధు నదిమీద పంపాడట .

  సశేషం

  ఆధారం –ఆచార్య కోరాడ రామకృష్ణయ్యగారి  వ్యాసం ‘’వారిధి చూపిన వసుధ –నౌకలు నావికులు ‘’

 స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -14-8-19-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.