’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59

’ సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం -59

‘’రావణుడు అలా సీతను బెదిరించి వెళ్ళగానే కాపలా రక్కసులు వినరానిమాటలతో ఆమెను బెదిరించారు .వాళ్ళ మాటలను ఆమె గడ్డిపోచలాగా తీసిపారేసింది –

‘’తృణవద్భాషితం తాసాం గణయామాసజానకీ ‘’

సీత దృఢ నిశ్చయాన్ని వాళ్ళు రావణుడికినివేది౦చారు.తమప్రయత్నాలన్నీ భగ్నం కాగా వాళ్ళు సీతను చుట్టుకొని నిద్ర పోయారు .24వ సర్గలో రాక్షసస్త్రీలు వేర్వేరుగా సీతను ఎలా బెదిరించారో వివరంగా ఉంది. దాన్నిక్కడ హనుమ వదిలేశాడు .వాళ్ళమాటలను గడ్డిపరకగా భావించినట్లు ఇక్కడ హనుమ చెప్పాడు .అక్కడ ఆమాట లేదు .రావణుడికి తెలియజేసినట్లూ అక్కడ లేదు .ఆమె చుట్టూమూగి నిద్రించారు అని ఇక్కడ ఉన్నది .అక్కడ ఆమాట లేదు .అవసరాన్ని బట్టి పెంపు కుదింపు చేయటమేకాక ‘’ఎమ్ఫాటిక్’’గా చెప్పటం హనుమ ఉద్దేశ్యమేమో ?

‘’వాళ్ళు అలా నిద్ర పోగా ,పతి హితమేకోరే సీత దయనీయంగా శోకంతో ఏడ్చి౦ది .రాక్షస స్త్రీల మధ్య ఉన్న  త్రిజట నిద్ర లేచి ‘’పాపులారా !కావాలంటే నన్ను చంపండి .సీత జోలికి మాత్రం వెళ్ళకండి .నేనిప్పుడే గగుర్పాటు కలిగించే ఒక కల గన్నాను .దాన్ని బట్టి రాక్షస నాశనం ,ఆమె పతి విజయ సూచకం గా ఆ కల ఉన్నది .మనల్ని కాపాడమని ఆమెనే ప్రార్ధిద్దాం .కొద్దిరోజుల్లో ఆమె సకల దుఃఖ విముక్తురాలై గొప్ప సుఖాలు పొందుతుంది .తనకు ప్రణమిల్లిన వారిని జానకీ దేవి వారి అపరాధాలు మన్నించి ప్రసన్ను రాలు అవుతుంది ‘’అనగానే ‘’త్రిజట చెప్పింది నిజమే అయితే ,నేను మిమ్మల్ని కాపాడుతాను ‘’అని సీత చెప్పింది .ఈమాటకూడా 27వ త్రిజటా స్వప్న సర్గ లో లేదు .

‘’తస్సా సా హ్రీమతీబాలా భర్తుర్విజయ హర్షితా –‘’అవోచ ద్యది తత్తధ్యం భవేయం శరణం హివః’’

‘’నేనప్పుడు సీత దారుణ దుఖం చూసి,  ఆమెను చూశాను అనే ఆనందంకూడా కలగలేదు .సీతతో ఎలామాట్లాడాలా అని ఆలోచించి దానికి అనుగుణంగా ఇక్ష్వాకు వంశాన్ని కీర్తించాను .ఆమె విని కన్నీటితోనే నాతో ‘’వానర శ్రేష్టా!ఎవరు నువ్వు ఎలావచ్చావ్ ,నీకు రామునిపై ఆదరం ఎందుకు కలిగింది ?ఆ వివరాలన్నీ చెప్పు ‘’అని అడిగింది .ఈమాటలు చాలా సందర్భ శుద్ధిగా ఉన్నాయి –

‘’కా చ రామేణ తే ప్రీతి స్తన్మేశంసితు మర్హసి ‘’

నేను ఆమె మాటలకు సమాధానంగా ‘’అమ్మా !నీ భర్తకు సహాయకుడు వానరరాజు సుగ్రీవుడి సేవకుడనైన హనుమంతుడను .మహా కార్య నిర్వాహకుడు రాముడు పంపగా వచ్చాను .ఈ ఉంగరం నీకు గుర్తుగా ఇమ్మన్నాడు .ఇప్పుడు నన్ను ఏమి చేయమంటావు?దాన్ని బట్టే చేస్తాను .నీకు ఇష్టమైతే నిన్ను రామ లక్షణుల దగ్గరకు తీసుకు వెడతాను’’అన్నాను ఆమె క్షణం ఆలోచించకుండా ‘’రాముడు రావణుడిని చంపి నన్ను తీసుకు పోవుగాక ‘’అన్నది –

‘’అహ రావణ ముత్సాద్య రాఘవో మాం నయత్వితి ‘’

‘నేను ఆమె మాటలకు సంతోషించి ఆమె ఆనవాలు ఇమ్మని అడిగాను .ఆమె తన చూడామణి నాకు ఇస్తూ ‘’దీన్ని చూసి రాముడు నిన్ను మహా గౌరవిస్తాడు ‘’అని రామునికి చెప్పాల్సిన మాటలన్నీ వివరంగా నాకు చెప్పింది .నేను వెంటనే ఇక్కడికి రావాలనే తొందరలో ఆమెకు ప్రదక్షిణ చేసి ,ప్రణమిల్లాను  –

‘మణి ర్యేవమహాబాహో రామస్త్వాం బహుమన్యతే’’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-20-ఉయ్యూరు

 

 

 

 

 

 

‘’

 

 

 

‘’

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.