తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

1912లో ఎం ఆరె ఎన్ రామనాధ చెట్టియార్ ,సోదరులు కలిసి శ్రీ కాళహస్తి ఆలయం కుంభాభిషేకం మహా వైభవం గా జరిపి, ఆలయ చరిత్ర పుస్తకం ప్రచురించారు  .అప్పుడు అయ్యర్’’ తిరుకాళత్తిపురాణం ‘’ప్రచురించే సన్నాహం లో ఉన్నాడు  .భక్త కన్నప్ప గురించి అనేక విషయాలు సేకరింఛి కాళహస్తి మహా కుంభాభిషేక సమయం లో ఆవిష్కరించాడు .

 1915ఫిబ్రవరికి  అయ్యర్ కు 60ఏళ్ళు నిండాయి .షష్టిపూర్తి వైభవంగా చేయాలని మిత్రులు భావిస్తే  వద్దని వారించి కాళహస్తిలో కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపి స్వామి సేవలో ధన్యుడయ్యాడు .తర్వాత రెండేళ్లకు భార్య కమలమ్మ గతించింది ,రాజధాని కాలేజిలో ఆయన గడిపిన చివరి సంవత్సరాలలో పరిశోధన విస్తృతి చెందింది .సంగ కాలపు ‘’పరి పాడలు ‘’ ప్రచురించాడు .పరిమేలళగర్ వ్యాఖ్యానం ప్రకారం అది  70పద్యాల సంకలనం .ఎంత ప్రయత్నించినా సమగ్ర ప్రతి దొరకలేదు .దొరికిన 22పద్యాలు ఆధారంగా ప్రాచీన తమిళులు పూజించిన దేవతా విగ్రహాల ,సంగకాలపు సాంఘిక విషయాలతో దాన్నే ప్రచురించాడు .

   వారణాశి లోని ‘’భారత ధర్మ మహా మండల్’’వారు అయ్యర్ ను ఆహ్వానించి ‘’ద్రావిడ విద్యా భూషణ ‘’బిరుదు ప్రదానం చేసి , సత్కరించి గౌరవించారు .

   ఉద్యోగ విరమణ

స్వామి నాథయ్యర్ 1919లో మద్రాస్ రాజధాని కాలేజి లో ఉద్యోగ విరమణ చేశాడు .మరికొంతకాలం చేయమని కోరినా ,వినయంగా తిరస్కరించాడు .తన స్థానం లో తమిళ భాషాసేవ ఇంకా బాగా  చేసే ఆయన్ను నియమించమని కోరాడు .ఇ.వి .అనంతరామయ్యర్ ను అయ్యర్ సూచించగా ,ఆయననే నియమించారు .1919లో విశ్వకవి రవీంద్రనాధ టాగూర్ మద్రాస్ వచ్చాడు .టి.ఎస్ .రామస్వామి అయ్యర్ గృహం లో అతిధిగా ఉన్న టాగూర్ ను అయ్యర్ వెళ్లి దర్శించిమాట్లాడాడు .అయ్యర్ తన సాహితీ సేవ ఆయనకు వివరించగా ‘’ఇంత సాహిత్య సేవ ఎలా చేయ గలిగారు ??’’అని రవీంద్ర కవి చంద్రుడు ఆశ్చర్యపోయాడు .తమిళ ప్రాచీన ప్రతులకోసం ,ఎలా విస్తృత పర్యటన చేసిందీ అయ్యర్ వివరించగా టాగూరు ఆశ్చర్యం మరింత ఎక్కువైంది .ఆ సాయంత్రమే రవికవి అయ్యర్ ఇల్లు ‘’త్యాగరాజ విలాసం ‘’సందర్శించి ,చక్కగా  అలంకరింప బడిన తాళపత్ర గ్రంథాలను కాగిత ప్రతులను చూసి ముచ్చటపడి అయ్యర్ ను ప్రశంసించాడు. తాటి ఆకులపై ఎలా రాస్తారు అని టాగూర్ అడిగితె వ్రాసి చూపించి మరీ ఆశ్చర్యపరచాడు .అయ్యర్ ఉంటున్న ‘’తిరు వేట్టీశ్వరన్ పేట’’ మొత్తానికే ఇది అనుకోని  ఊహించలేని అద్భుత సంఘటన.ఆ నాటి నుంచి అయ్యర్ రోడ్డుమీద కనిపిస్తే గౌరవంగా రెండు చేతులతో వినయంగా నమస్కరి౦ చే వారు ఆపేట వాసులు. అంతగా ఆయన గౌరవం పెరిగి౦ది నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ టాగూర్ అయ్యర్ ఇంటికి స్వయంగా రావటం వలన .

  వయసు మీదపడుతోంది .కుటుంబ సమస్యల పరిష్కారం తోపాటు తిరువాడు దురై మఠం వారి వాదాల పరిష్కారం కూడా ఆయన చేశాడు 1920లో అంబాల వాణదేశికర్ పరమపదించగా ,మేనేజర్ వైద్య నాద తమ్బిరాన్ పీఠాధిపతి అయ్యారు .ఆయన ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ కొందరు కోర్టు కు వెళ్ళగా ఆయన అయ్యర్ సాయం కోరగా రెండువారాలు ఉండి,తాళపత్ర రచనలన్నీ సక్రమంగా అమర్చి గ్రంథాలయం లాగా మార్చాడు .తాను బోధించిన చోట ఒక పాఠశాల ప్రారంభించగా ఆ౦దరూ బాగా సంతోషించి ,మీనాక్షి సుందరం పిళ్ళై రోజులు జ్ఞాపకం చేసుకొన్నారు .

  1922జనవరిలో వేల్స్ రాజు మద్రాస్ రాగా ,ప్రభుత్వం తమిళ, సంస్కృత విద్వాంసులను సత్కరించే కార్యక్రమ౦ చేబట్టి అయ్యర్ ను ఆహ్వానించగా ,మద్రాస్ వచ్చి ‘’ఖిల్లత్ ‘’అందుకొన్నాడు అయ్యర్ .తిరువాడు దురై చనిపోగా వైద్యలింగ దేశికర్ ఆస్థానం భర్తీ చేశాడు .మద్రాస్ రాగానే  ‘’కొంగు వేల్    మాక్కదై’’అనే మరోపేరున్న ‘’పేరుం గదై’’-బృహత్కథ పరిశోధనలో నిమగ్నమయ్యాడు .అయిదేళ్ళు శ్రమించాడు చివరిభాగం లభించలేదు.బృహత్ సంహిత లోని విషయాలు సంస్కృత విద్వా౦సులద్వారా తెలుసుకొని ,విపులమైన గ్రంథం తయారు చేసి 1924లో ‘’పెరుంగదై ‘’పరిష్కరణ గ్రంథాన్ని ప్రచురింఛి ,తమిళ పండిత ప్రశంసలు పొంది ,లబ్ధ ప్రతిష్టుడయ్యాడు అయ్యర్ .

  ప్రాచీన తమిళ సాహిత్యం వెలుగు చూసినకొద్దీ ,కాలేజీలలో తమిళ శాఖ కు గౌరవం పెరిగి తమిళ సంస్కృత అధ్యయనానికి దారి తీయగా దీనికోసం అన్నామలై చెట్టియార్ గొప్ప ప్రోత్సాహం కల్పించాడు .తమిళ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి అయ్యర్ ను చెట్టియార్ ఒప్పించి  ప్రిన్సిపాల్ ను చేశాడు .నిత్యం నటరాజస్వామి దర్శనం లభిస్తుందని అయ్యర్ సంతోషంగా ఒప్పుకొన్నాడు .ఆలయ వంశపారం పర్య ధర్మకర్త దీక్షితార్ చాలా సంతోషించాడు .1924లో చిదంబర రాగా ఆయన ఉండటానికి మంచి వసతులు కల్పించారు .ఆయన నివాసం లోనే ‘’మీనాక్షి తమిళ కళాశాల ‘’ప్రారంభమైంది .ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ నీలకంఠ శాస్త్రి సహాయ సహకారాలు అందించాడు .

  1925 జూన్ 8న మదురై లో తమిళ సంగం 24వ వార్షికోత్సవం జరుపుకోగా సిపిరామస్వామి అయ్యర్ అధ్యక్షత వహించాడు .నిర్వాహకుల కోరికమేరకు అయ్యర్ ముందే అక్కడికి వెళ్ళాడు .అయ్యర్ రాక తమిళ భాషాభిమానులకు దివ్యౌషధం అయింది .కీర్తి ఉచ్చస్తిలో ఉంది .పౌరసత్కారం చేశారు .నిధి సమర్పించారు అయ్యర్ కు .కంచికామకోటి పీఠాధిపతిశ్రీ శ్రీ చంద్ర శేఖర సరస్వతి స్వాములు  అయ్యర్ కు జంట శాలువాలు ,కంకణం పంపి ‘’దాక్షిణాత్య కళానిధి ‘’బిరుదు ప్రదానం చేశారు  .మదురై పౌర నిధి అయ్యర్ కు ‘’శంకర నమశ్శి  వాయర్ నన్నూల్ ‘’గ్రంథ పరిష్కరణ ,ప్రచరణకు తోడ్పడింది .ఉపోద్ఘాతం లో విరాళాలు ఇచ్చినవారి పేర్లన్నీ ప్రచురించి కృతజ్ఞత ప్రకటించారు అయ్యర్ .

  కొత్తకాలేజి ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నా ,అయ్యర్ పరిశోధన కు ఏమాత్రం  ఆటంకం కలుగలేదు .చిదంబరం లో ఉన్నకాలం లో అయ్యర్ ‘’దక్క యాగప్పరణి’’సవ్యాఖ్యానం గా ప్రచురించే కృషి చేశాడు.1930లో దీన్ని ప్రచురించాడు. .అజీర్ణ వ్యాధి ,కడుపు నొప్పి తో బాధపడుతున్న అయ్యర్ తనను రిలీవ్ చేయని అన్నామలై ను కోరగా ,అంగీకరించి అయ్యర్ సలహాతో ‘’పోన్నోదు వార్ ‘’ని ప్రిన్సిపాల్ ను చేశాడు .చిదంబరం పౌరులు ఆత్మీయమైన వీడ్కోలు చెప్పగా అయ్యర్ మద్రాస్ చేరాడు .

   1930లో అయ్యర్ మెట్లమీద నుంచి దిగుతూ కాలుజారి ,పాదానికి దెబ్బతగిలితే పక్కనే ఉన్న వైద్యుడు చికిత్స చేసినా లాభం లేకపోగా ,ప్రముఖ శస్త్ర వైద్యుడు డాక్టర్ రంగాచారి నిపిలిపించి ,ఇంట్లోనే శాస్త్ర చికిత్స జరిపించగా ,మంచం లోనే ఉన్న అయ్యర్ ను ఎక్కువగా చదవటం రాయటం చేయవద్దని డాక్టర్ సలహా ఇచ్చాడు .హైకోర్ట్ లో ఉద్యోగిస్తున్న కొడుకు ఉద్యోగానికి వెళ్ళగానే శిష్యుడు ఈ పుస్తకం రచయిత కీ .వా .జగన్నాథన్  ను తమిళకావ్యం చదవమని అడిగి చదివించుకొనే వాడు ‘అయ్యర్ తానూ శిష్యుడుగా ఉన్నప్పుడు రోజుకు 300తమిలపద్యాలు బోధించేవారని గుర్తు చేసుకొన్నాడు . అప్పటికే అయ్యర్ గురువు పిళ్ళై గారి జీవిత చరిత్ర గురించి చాలా విషయాలు సేకరించి ఉంఛి కొన్నిభాగాలు రాసి మిగిలినవి రాస్తానో లేదో అని బాధ పడేవాడు .ఒక రోజు ఆకట్ట తీసుకురా అడిగితె శిష్యుడు డాక్టర్ చెప్పిన హెచ్చరిక గుర్తు చేయగా అయ్యర్ ‘’డాక్టర్ కు ఏం తెలుసయ్యా .నేను నాపని పూర్తి చేస్తే భగవంతుడే నన్ను రక్షిస్తాడు ‘’అనగా చేసేది లేక ఆ కట్ట తెచ్చి ఇవ్వగా ,కనులనుంచి నీరుకారుతుండగా ,అయ్యర్ డిక్టేట్ చేస్తుంటే శిష్యుడు రాసేవాడు .ఇలా అశ్రుపూరిత నయనాలతో గురువుగారు మీనాక్షి సుందరం పిళ్ళై జీవిత చరిత్రను రాసి అయ్యర్ ధన్యుడయ్యాడు .

  1932ఆగస్ట్ లో  మద్రాస్ విశ్వ విద్యాలయ స్నాతకోత్సవం నాడు అయ్యర్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు .దాన్ని తీసుకోవటానికి పిఎస్ శివస్వామి అయ్యర్ తగిన డ్రెస్ ను అయ్యర్ కి కుట్టించి తీసుకు వెళ్ళగా అయ్యర్ స్వీకరించి ముక్తసరిగా మాట్లాడాడు .సెందమిళు పత్రికలో అయ్యర్ ధారా వాహికంగా ప్రచురిస్తున్న వాటిని చూసి ,’’శివ నేశన్ ‘’పత్రికసంపాదకుడు తన పేపర్ కూ వ్యాసాలూ రాయమని కోరగా ,అలానే అని ,’’నలమలైక్కోళై’’,తిరుమయిలై,యమక అంతాది మొదలైనవి ధారా వాహికంగా ప్రచురణకు పంపాడు .మద్రాస్ లా జర్నల్ అధిపతి నారాయణ స్వామి అయ్యర్ పెట్టిన ‘’కలై మగళ్’’ అంటే కళాసరస్వతి పత్రికకూ అయ్యర్ వ్యాసాలు రాశాడు .అయ్యర్ ప్రముఖ రచనలన్నీ అందులో ప్రచురితాలే .

సశేషం

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-11-21-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

2 Responses to తమిళ తాత ఉ.వే.స్వామినాథయ్యర్-9

  1. seshubabugs's avatar seshubabugs says:

    Sir నమస్తే నా పేరు శేష బాబు బెంగళూరు లో ఉంటాను. మీ సరస భారతి శీర్షికల ను follow అవుతుంటాను. చదువుకున్న అమ్మాయిలు చిత్రం లో కిలకిల నవ్వులు చిందించే పాట కు మీ విశ్లేషణ అద్భుతం. ఈ విశ్లేషణ ను నేను మా సంగీత సమూహం లో వాడుకోవచ్చా. మిమ్ములను ఇబ్బంది పెడుతున్నందుకు క్షంతవ్యుణ్ణి భవదీయుడు శేష బాబుSent from my Galaxy

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.