రమణాచారి బాధ

అధికారులు రెండు రకాలు. ప్రభుత్వ నిబంధనలను తూచాతప్పకుండా పాటించేవారు ఒక రకమైతే నిబంధనలను పాటిస్తూనే- ప్రజల అవసరాలను గమనించి వాటిని తీర్చేవారు రెండోరకం. ఇటు రాజకీయనాయకులకు, అటు ప్రజలకు మధ్య వారధులుగా వ్యవహరించే అధికారుల పని ప్రతి రోజు కత్తి మీద సామే. అలాంటి బాధ్యతలను తనదైన శైలిలో నిర్వహించిన మాజీ ఐఏఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి జీవితానికి చీకోలు సుందరయ్య ‘ప్రజలు..ప్రభుత్వం.. ఒక ఐఏఎస్’గా పుస్తకరూపం ఇచ్చారు. అందులోనుంచి కొన్ని ఆసక్తికర భాగాలు…

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి అందరిలాంటి ముఖ్యమంత్రి కారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎవరెవరు ఏమిటో బాగా తెలిసినవారు. తన అధికారుల్లో ఎవరి బలాలు, బలహీనతలు ఏమిటో ఎరిగినవారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీగా జి. కుమారస్వామి రెడ్డి ఉండేవారు. కె.వి. రమణ పీఆర్వో. ఆయనతోపాటు కిషన్‌రావు, రాజేంద్రమోహన్ గోనెల తదితర అధికారులుండేవారు. రమణ రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకొస్తే రాత్రి రెండుగంటల వరకూ ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉండవలసి వచ్చేది. అది చాలా ఇబ్బందిగా ఉండేది. ఓ రోజు రమణ సాహసించి కుమారస్వామిరెడ్డిగారిని అడగనే అడిగారు.
‘రోజూ ఇంతంతసేపంటే కష్టం కదా సార్? రాత్రి పదింటికైనా ఇంటికెళ్తే బాగుంటుంది.’
రెడ్డిగారు వెంటనే అన్నారు.
“నేనే ఉంటే నీకేం ప్రాబ్లం! ఇది మన డ్యూటీ. ముఖ్యమంత్రిగారు వెళ్లేంతవరకు మనం ఉండాలి. తప్పదు!”
చెన్నారెడ్డి అలవాట్లలో ముఖ్యమైనది ఆయన ఆఫీసు నుంచి బయటకు వెళ్లేటప్పుడు తన కార్యాలయంలో ఎవరెవరున్నారు, ఎవరు లేరు… ఉన్న వారిలో సెల్యూట్ చేసిన వారెంతమంది… చేయని వారెవరెవరు… వంటి విషయాలు కూడా గమనించేవారు. ఎవరైనా కనిపించకపోతే రెండోరోజు ఆ విషయం ప్రస్తావన కొచ్చేది. దాంతో అధికారులు, సిబ్బంది విధిగా సి.ఎం. వెళ్లేంతవరకూ ఉండి ఆయనకు కనిపించి, సవినయంగా నమస్కరించి మరీ వెళ్లేవారు!
అందువల్ల రమణ ఆ విషయంలో రాజీపడ్డారు. ప్రభుత్వాధికారిగా తనకు పనివేళలు ఉండవు అన్న సత్యాన్ని గుర్తించారు. దానికి అలవాటుపడ్డారు.
చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన మిత్రుల్లో చాలామంది సచివాలయానికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి, సీనియర్ రాజకీయనాయులు జి. వెంకటస్వామి, హాషిం, రోడామిస్త్రీ, ఉమా వెంకట్రామిరెడ్డి, గీతారెడ్డి వంటివారు తరచూ వచ్చేవారు. అలా ఎవరైనా వచ్చినపుడు మరీ అవసరమయితే తప్ప ఆయన అధికారుల్ని పిలిచేవారు కాదు.
ఓ పర్యాయం ఆంధ్ర మహిళా సభలో కార్యక్రమానికి ఆయన వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారుచేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ఆయన్ని బాగా ఆకట్టుకుంది.
‘లోగోంకే పాస్ వక్త్ హై – నఫ్రత్‌కే వాస్తే
జబ్‌కే హయాత్ కమ్‌హై – మొహబ్బత్‌కే వాస్తే’
ఇదీ ఆ ఉర్దూ కవిత. (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది… కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు.) దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. “మా కొత్త పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు” అంటూ పలుమార్లు ప్రశంసించారు. ఇది రమణలో ఆత్మవిశ్వాసం పెంచింది. అప్పట్నించి చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరయ్యారు.
నందమూరికి ప్రాతఃకాల సేవ
“నన్నెప్పుడూ కులీకుతుబ్‌షా అని (ఎన్.టి. రామారావు గారు) పిలిచేవారు. ఎందుకంటే ఆయన కులీకుతుబ్‌షా నగరాభివృద్ధి సంస్థకు చైర్మన్. నేను వైస్ చైర్మన్. ఉదయం నాలుగున్నర గంటలకి దర్శనం చేసుకోవాల్సి వచ్చేది. మా పెద్దమ్మాయి వీణ పెళ్లికోసమని తార్నాకలో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడిని. తార్నాక నుంచి రోడ్ నెం.13 బంజారాహిల్స్‌లో ఉన్న ఎన్.టి.ఆర్. గారింటికి వెళ్లేవాడిని. రాత్రి ఏ మూడుగంటలకో లేవవలసి వచ్చేది. ముఖ్యమంత్రిగారింటికి నాలుగుంబావుకి చేరుకునేవాడిని. సాంబ్రాణి ధూపం… పరిమళాల మధ్య శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని నాలుగన్నర గంటలకల్లా వినిపింపచేయడం ఇన్ఫర్మేషన్ డిపార్టుమెంట్ కమీషనర్‌గా నా కర్తవ్యం. సుప్రభాతం వినిపింపచేసే టెక్నికల్ ఆపరేటర్ రాకున్నా కమీషనర్ రానట్టే లెక్క. టెక్నికల్ ఆపరేటర్ కూకట్‌పల్లిలో ఉండేవాడు. అతని అవస్థలు దృష్టిలో పెట్టుకొని ఆటోకోసం పాతిక రూపాయలు చెల్లించేవాళ్లం. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంట్లోనే అతను ఏదో ఓ మూలన ఉండాల్సి వచ్చేది పాపం. ఇంచుమించుగా నాతోపాటు లేదా కొంచెం ముందు డి.జి.పి. గారు వచ్చేవారు. మీరు ముందా నేను ముందా అన్నట్లుండేది మా స్థితి. సాధారణంగా డి.జి.పి.యే సీనియారిటీ దృష్టిలో ఉంచుకొని ముందుగా సియంని సందర్శించేవారు. నేను కొన్నాళ్లు ఓపిక బట్టి డి.జి.పి. గారితో అన్నదేమిటంటే “పోలీస్ శాఖకి సంబంధించిన విషయాలన్నీ – అక్రమాలు, లాఠీచార్జీలు, దోపిడీలు, దుర్మార్గాల గురించి ఉంటాయి. బ్రాహ్మీముహూర్తంలో సియం ఈ రకమైన విషయాలు వినేదానికంటే కమీషనర్‌గా నేను చెప్పే అంశాలు, వార్తలే ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి నేనే వెళ్లి చెబితే బాగుంటుందనే వాడిని.” ముందు నా విధిలో భాగమేమిటంటే వార్తాపత్రికల్లోని వివిధాంశాల్ని వారికి వివరించడం. ముందుగా పాజిటివ్, తర్వాత నెగిటివ్, తర్వాత మోర్ నెగిటివ్‌గా విషయాలను విభజించుకొని తెలిపేవాడిని. వార్తాపత్రికలు తేవడానికి ఒక అసిస్టెంట్‌ని ఉదయం నాలుగు గంటలకే ముఖ్యమంత్రి గారి ఇంటికి తెచ్చేలా ఏర్పాటు చేశాం. వార్తాంశాల్ని వివరిస్తున్నంతసేపు ఆయన బుద్ఢుడిలా కూర్చుని వినేవారు. ఆయన కళ్లు మూసుకుని వింటే తదేకంగా వింటున్నట్లు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల అభిప్రాయాల్ని, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని వివరించడం కూడా నా డ్యూటీలో భాగమే. అప్పుడప్పుడూ నా కంటే ముందే నందమూరి లక్ష్మీపార్వతి గారు కొన్ని చెప్తుండేవారు. ఒకనాడు ‘ఈనాడు’లో ఒక కార్టూను వచ్చింది. బండిని లాగుతున్న సియం, కొరడా ఝళిపిస్తున్న లక్ష్మీపార్వతి బొమ్మ ఉంది అందులో. ‘కమీషనర్‌గా ఏం చేస్తున్నట్లు మీరు’ అన్నారు.
‘పత్రికల్లో వచ్చే కార్టూన్లకి కమీషనర్‌కి సంబంధం ఉండదండీ’ అన్నాను.
‘నో… వెంటనే ఎడిటర్‌తో మాట్లాడండి. అవసరమైతే నా మాటగా చెప్పండి. మళ్లీ ఏ విషయం నాకొచ్చి చెప్పండి” అని ఆయన అన్నారు.
అప్పుడు ఎడిటరు ఎలాగూ ఉండడు. అది నాకు తెలుసు. అయినా ఆయన మూడ్ గమనించి నేను ఎడిటర్ గారిని కలుస్తాను అని చెప్పాను.
తర్వాత ఎడిటర్ గారిని కలవడం, సియంకి చెప్పడం అదో కథ.
ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్.
(డా. కె.వి. రమణాచారి జీవన తరంగాలు)
రచయిత: చీకోలు సుందరయ్య
పేజీలు: 208, ధర: 100 రూపాయలు
ప్రతులకు: ఎమెస్కో బుక్స్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.