కొమరం భీమ స్పూర్తి

ఆదిలాబాద్‌ జిల్లా జోడెఘాట్‌… 1940 సెప్టెంబర్‌ 1వ తేదీ. ఆదివాసీల పోరాట యోధుడు తలదాచుకున్నాడని నిజాం సైనికులకు సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకుని తుపాకులు ఎక్కుపెట్టారు. అయినా ‘భీం’ జంకలేదు. కొండగుట్టల్లో నుంచే సైనికులపైకి పదునైన బాణాలు వదిలాడు. ఆఖరికి ఆ పోరాటంలో సైనికుల కాల్పుల్లో కొమురంభీంతో పాటు పదిహేను మంది అనుచరులు నేలకొరిగారు. ఆదివాసీల జల్‌, జమీన్‌, జంగిల్‌పై హక్కుల కోసం అలుపెరుగని పోరు తలపెట్టిన వీరుడు అసువులుబాశాడు. అప్పటి నుంచి తెలంగాణ ప్రాంతానికే కాకుండా తెలుగు ప్రజలందరిలోను పోరాట స్ఫూర్తి నింపారు భీం.. సిర్పూర్‌ (యు)లోని పంగిడి, దోబిలా గ్రామాల్లో ఆయన మనుమళ్లు సోనేరావు, మాధవరావు ఉన్నారు. నేడు కొమురం భీం వర్థంతి సందర్భంగా సోనేరావుతో మాట్లాడింది ‘నవ్య’.

‘‘నేను కొమురం భీం వారసుడిని అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. భీం కొడుకు మాధవరావు, ఆయన కొడుకును నేను. మా తమ్ముడి పేరు కూడా మాధవరావే. భీం పోరాట యోధుడని చెప్పడమేకాని 73 ఏళ్ల నుంచి మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఆయన వర్ధంతి వచ్చినా మేము ఏమీ కోరకుండానే.. అదిగో అవి చేస్తాం, ఇవి చేస్తాం అని హడావిడి తప్ప.. ఆఖరికి చేసింది ఏమీ లేదు. కనీసం ఇప్పటి వరకు ప్రభుత్వ భూమి కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు లేవు. సొంత ఇళ్లు లేవు. మా బతుకులు చాలా దారుణంగా ఉన్నాయి. నా బిడ్డ వరలక్ష్మి ఇంటర్‌ చదువుతోంది. నా కొడుకు మాధవరావు టీటీసీ చేసిండు. వీళ్లిద్దరికి గవర్నమెంట్‌ ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరినం. ఆయన సరే అన్నరు. వ్యవసాయానికి భూమి అడుగుతున్నం. అప్పుడెప్పుడో మా నాన్న భూమి 2 ఎకరాల 8 గుంటలు ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నం. మా కుటుంబంతో సహా మేమంతా 60 మంది దాకా ఉంటాం. అందరం పేదరికంలోనే ఉన్నాం. మా సోదరి సోంబాయి జోడెఘాట్‌లో ఉంటోంది. కొమురం భీం ఏం కోరుకున్నారు? గిరిజనుల హక్కులు కోరుకున్నారు. భూమి మీద ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు.
భీం కోరిక నెరవేరేనా?
ఇన్ని సంవత్సరాలకు మా తాత కొమురం భీం కోరిక నెరవేరేటట్టున్నది. మా భూమిలో మా రాజ్యం ఏర్పడేటట్టున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 8వ తారీఖు జోడెఘాట్‌కు రావడం సంతోషంగా ఉన్నది. సీఎంకు ధన్యవాదాలు. గిరిజన యూనివర్శిటీ ఇస్తరట. మ్యూజియం, పెద్ద పార్కు పెడ్తమన్నరు. పర్యాటక
కేంద్రం చేస్తమన్నరు. మా ఆదివాసీల బతుకులు బాగు చేస్తమన్నరు. మాకు భూములిస్తమన్నరు. ఇంతకంటే ఎక్కువేం గావాలే. మా తాత కోరింది గూడ ఇదే. మా భూమి మాకు, మా అడవి మీద మాకు హక్కు కల్పిస్తరని నమ్ముతున్నం. మా తాత భూమికే పట్టాలేదట. మాకెక్కడ నుంచి వస్తది. ఆ పట్టాల కోసమే మా ఆదివాసీలు పోరాడుతున్నరు. జల్‌, జమీన్‌, జంగల్‌ కోసం మా తాత పోరాడి నేలకొరిగిండు. ఇంతకుముందు లీడర్లు ఐదెకరాల చొప్పున మాకు భూమి ఇస్తమన్నరు. ఇంకా చాలా హామీలిచ్చిండ్రు. ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు అమలు అయితయని కేసీఆర్‌ నమ్మకం బుట్టించిండు. తెలంగాణ వస్తే కచ్చితంగా ఆదివాసీల జీవితాలు బాగుపడతయని ఆయన 2007లో ఒకసారి జోడెఘాట్‌కు వచ్చినప్పుడు చెప్పిండు. మేమందరం కుటుంబ సభ్యులమంతా కలిసి జోడెఘాట్‌కు పోతున్నాం. జోడెఘాట్‌ వద్ద సీఎంను కలుస్తాం. మా తాత కలలు 73 ఏండ్ల తర్వాత నెరవేరుతున్నయనే సంతోషం చాలా ఉన్నది. ఆదివాసీలను కాపాడుకోవడమన్నది ప్రభుత్వ బాధ్యత. ఇక్కడి చెట్టును, పుట్టను నమ్ముకుని బతికే గరీబోళ్లం. అదే లేకుంటే మా బతుకులు ఎట్ల ఉంటయి. జ్వరాలొచ్చి చాలా మంది చచ్చిపోతున్నరు, తిండి లేక రక్తం ఉండటంలేదు. ఇటువంటి చాలా విషయాలున్నయి.

నిజాం సైన్యంపై తిరుగుబాటు..

1935 ప్రాంతంలో దేశాన్ని బ్రిటిష్‌వారు, రాషా్ట్రన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజులవి. అడవే జీవనాధారంగా ఉన్న గిరిజనులు బుక్కెడు బువ్వకోసం పడరాని పాట్లు పడుతుండే వారు. అటవీ ఉత్పత్తులు ఉంటేనే పొట్టనిండే పరిస్థితి. సొంతగా భూమిని కలిగి ఉంటే వ్యవసాయం చేసుకుని ఆహారధాన్యాలు ఉత్పత్తి చేసుకోవచ్చని గిరిజనులు భావించేవారు. అందుకోసం పోడు వ్యవసాయంపై దృష్టి సారించారు. కానీ వారి చర్యలను నిజాం సర్కారు గాని, స్థానికంగా ఉన్న జాగిర్దారులు గాని సహించలేదు. పోడు భూముల నుంచి వారిని తరిమివేసేవారు. దళారులు, అటవీ అధికారులు, నిజాం నవాబుల సైన్యం చేతిలో అడవి బిడ్డల బతుకులు దోపిడీ, పీడనకు గురి అయ్యాయి. ఈ తరుణంలో అడవి బిడ్డలకు బాసటగా నిలిచి వారిని సంఘటితం చేసి నిజాం సైన్యంపై తిరుగుబాటు చేసినవాడు కొమురం భీం. గిరిజనుల కోసం పోరాటం చేసి నిజాం సైన్యం చేతిలో 1940 సంవత్సరం అశ్వయుజ పౌర్ణమి రోజు వీరమరణం పొందాడాయన.

-ఎండీ. మునీర్‌, మంచిర్యాల

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.