ఆకాశవాణి, ఆ నలుగురూ…

ఆకాశవాణి, ఆ నలుగురూ…
నిన్నగాక మొన్న రావూరి భరద్వాజ, అటు మొన్న కె.చిరంజీవి , నిన్న పైడి తెరేష్‌ బాబు, నేడు తురగా జానకీరాణి…. ఇలా ఒకరికొకరుగా రాలిన ఆకాశవాణి తారలు. వీరందరిలో సానురూప్యత ఉంది . ఎవరి పంథాలో వారు ధిక్కార స్వరాలు. ప్రజలకు సేవచేయాలనే లక్ష్యంతో వారిస్థాయిలో వారు నినదించిన కంఠాలు-కలాలు. రావూరి జ్ఞానపీఠపురస్కారమందుకున్నారు. జీవితమంతాకష్టాలకొలిమిలో కొనసాగిన నేపథ్యం . ఆ నేపథ్యమే వారిని జనం మనిషిగా మార్చింది. ఇక కె.చిరంజీవి రేడియో నాటక ప్రయోక్తగా, రచయితగా, మనసున్న మనిషిగా సమాజానికి తనదైన బాణీలో సేవలందించారు. నాటకరంగంలో ఎందరో ఆయనకు ప్రత్యక్ష పరోక్ష శిష్య గణం. తెరేష్‌ బాబు ‘దళితవాదం’తో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం సృష్టించిన వాడు . తురగా జానకీరాణి ‘రేడియో అక్కయ్య’ గా ఆకాశవాణి ద్వారా అందరికీ సుపరిచితురాలు. అయితే సీ్త్రవాద రచయిత్రిగా, రాసిన దానిని ఆచరించిన వ్యక్తిగా సమాజశ్రేయస్సులో తాను ఎంచుకున్న బాటలో నడిచిన వ్యక్తి.
ఈ నలుగురూ …ఆకాశవాణి పొత్తిళ్ళ సాక్షిగా ఎదిగినవారు. ఆకాశవాణి తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించిన వారు . తెలుగు సాహిత్యంలో దళితవాదం , సీ్త్రవాదాలకు పైడి తెరేష్‌ బాబు , జానకీరాణీలు ప్రతీకగా నిలిచారు. చిరంజీవి సామ్యవాద రచయితగా జనం మనిషిగా ఎదురొడ్డారు. ఇక భరద్వాజ గురించి అందరికీ తెలిసిందే . పాకుడురాళ్ళతో ఆకాశవాణికి అందనంత ఎత్తుకు ఎదిగారు.
సమాజంలో వస్తున్న మార్పులకు దీటుగా ‘ఆకాశవాణి’ ధ్వని నిరంతరం విన్పిస్తూనే ఉంటుందనడానికి 2014లో రాలిన ఈ నలుగురు ‘తారల’ చరిత్రే చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం. సృజనశీలురకు , ప్రగతికాముకులకు, పురోగతిని వీక్షించే వారికి ‘ ఆకాశవాణి’ ఎప్పుడూ వెన్నంటే ఉంది . వారిని అల్లారు ముద్దుగా పెంచింది. వారి వారి భావాలకు బూజుపట్టకుండా గుండెలకు హత్తుకుంది . ప్రయోక్తల మనో భావాలకు , స్వేచ్ఛలకు బంధనాలు వేయలేదు . అందుకే అందరూ తారలయ్యారు. ఆకాశవాణి సాంస్కృతిక వారసత్వం నిలబ్టెటడంలో ధ్రువతారలయ్యారు.
నియమనిబంధనలున్నా , ప్రభుత్వ విధానాలున్నా ‘ఆకాశవాణి’ఆకాశమే హద్దుగా తన ఒడిలో తన పిల్లలను ప్రగతి శీలురుగా తీర్చి దిద్దింది. ఒక సామాజిక దృక్పథాన్ని , తాత్విక చింతనను నేర్పింది. ఆకాశవాణి ప్రాంగణంలోని వృక్షాల సాక్షిగా అందరూ జ్ఞానోదయంపొందిన వారే . ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో వికసించిన వారే . అందుకు ఈ నలుగురూ అతీతులు కారు . మినహాయింపులేదు. పరిణామక్రమంలో ఆకాశవాణి అందించిన సేవలు అజరామమైనవి. . ఆసేవలు సమాజంలో విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని కోరుకుంటూ పరితపించిన ఈ నలుగురూధన్యజీవులు . వీరు ఎప్పటికీ చిరంజీవులే . ఆకాశవాణిని ప్రజల వాణిగా మార్చే ప్రస్థానంలో సేవలందించిన ‘నలుగురు’ ఆకాశవాణి ముద్దుబిడ్డలను స్మరించుకుంటూ..
– వలేటి గోపీచంద్‌
రాష్ట్ర కార్యదర్శి , ఆకాశవాణి,
దూరదర్శన్‌ల కార్యక్రమాల సిబ్బంది సంఘం
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.