శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

శోభన్‌బాబు, మంజుల హిట్‌ కాంబినేషన్‌!

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఎనిమిదో చిత్రం ‘మంచిమనుషులు’. అంతవరకూ అక్కినేని నాగేశ్వరరావుతో మాత్రమే సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తొలిసారిగా మరో హీరోతో నిర్మించిన చిత్రమిది. అత్యధిక భారీ వ్యయంతో రూపుదిద్దుకొని శోభన్‌బాబు కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్లు. ఈ సందర్భంగా చిత్రవిశేషాలను ఒకసారి గుర్తు చేసుకుందాం.

జగపతి ఆర్ట్‌ పిక్చర్స్‌ సంస్థ అంటే అక్కినేని సొంత బేనరు అనే అభిప్రాయం అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘అన్నపూర్ణ’లో తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ అక్కినేనే హీరో. జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తుందంటే చాలు అభిమానుల కోలాహలం అంతా ఇంతాకాదు. మంచి కథ, పాటలు ఆ సినిమాలో ఉంటాయనేది వారి నమ్మకం. అటువంటి సంస్థ తొలిసారిగా శోభన్‌బాబుతో ‘మంచిమనుషులు’ చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ చవిచూడాల్సి వచ్చింది. అయితే అక్కినేనితో బదులు శోభన్‌బాబుతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ సమయంలో అక్కినేని అమెరికా వెళ్లడం, అక్కడ ఆపరేషన్‌ జరిగి కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇవ్వడం జరిగింది. అన్ని రోజులు సినిమా చేయకుండా ఖాళీగా కూర్చోవడం కష్టం. పైగా ఆఫీసుపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చేలోగా వేరే హీరోతో సినిమా చేస్తానని రాజేంద్రప్రసాద్‌ చెప్పగానే అక్కినేని కూడా సరేనన్నారు. అయితే ఈ విషయం తెలియని అభిమానులు మాత్రం
ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాటని నిర్లక్ష్యం చేసి సినిమా తీసే విడుదల రోజున ప్రింట్లు తగలపెడతామనీ, ధియేటర్లో తెరలు చించేస్తామనీ బెదరించారు. కానీ రాజేంద్రప్రసాద్‌ ఆ బెదిరింపులకు వెరవలేదు. ధైర్యంగా సినిమా మొదలుపెట్టారు.
హిందీ రీమేక్‌
జీవన్‌ప్రభ దేశాయ్‌ రాసిన ఒక హిందీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఆ గలే లగ్‌ జా’(1973) చిత్రం ఆధారంగా ‘మంచిమనుషులు’ చిత్రం తయారైంది. శశికపూర్‌, షర్మిలాఠాగూర్‌ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్‌బాబు, మంజుల నటించారు. హిందీలో శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను జగ్గయ్య ధరించారు. తెలుగులో ఈ చిత్రం హిట్‌ అవడంతో 1976లో శివాజీగణేశన్‌, మంజులతో తమిళంలో ‘ఉత్తమన్‌’ పేరుతో నిర్మించారు. కథలో కీలకమైన బాలనటుడి పాత్రను మూడు భాషల్లోనూ మాస్టర్‌ టిటు పోషించడం విశేషం.
శోభన్‌, మంజుల తొలి కాంబినేషన్‌
‘మంచిమనుషులు’ చిత్రంలోనే శోభన్‌బాబు, మంజుల కలసి తొలిసారిగా నటించారు. ప్రేక్షకుల అభిమానజంటగా కితాబునందుకొన్నారు. అక్కడి నుంచి నాలుగేళ్ల కాలంలో ఎనిమిది చిత్రాల్లో వీరిద్దరు నటించారు. ఈ సినిమాలో ‘పడకు పడకు వెంటపడకు’ పాటలో లైలా, మజ్ను, అనార్కలి, సలీంగా మంజుల, శోభన్‌బాబు నటించి అభిమానులకు కనువిందు చేశారు. అలాగే సినిమాలో స్కేటింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉండటంతో శోభన్‌బాబు, మంజుల 45 రోజుల పాటు స్కేటింగ్‌ నేర్చుకోవడం విశేషం.
కశ్మీర్‌లో షూటింగ్‌
చిత్రంలోని కీలక సన్నివేశాలను కశ్మీర్‌లో పాకిస్థాన్‌ బోర్డర్‌లో చిత్రీకరించారు. దర్శకునిగా రాజేంద్రప్రసాద్‌కు ఇది మూడో చిత్రం. దర్శకునిగానే కాదు నిర్మాత కూడా ఆయన ఎక్కడా రాజీపడలేదు. తన గత చిత్రాలకంటే అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మించారు. భారీ సెట్స్‌, కొత్త లొకేషన్లు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకొన్నాయి.
మ్యూజికల్‌ హిట్‌
శోభన్‌బాబు నటజీవితంలోనే అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది. అంతకుముందు అడపాదడపా శోభన్‌బాబుకు పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం చిత్రంలోని అన్ని పాటలూ పాడటం గమనార్హం. ఈ సినిమా తర్వాత బాలు శోభన్‌బాబుకి పర్మనెంట్‌ సింగర్‌ అయ్యారు. ‘పడకు పడకు వెంట పడకు’, ‘నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు’, ‘విను నా మాట విన్నావంటే’, ‘నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని’, ‘పెళ్లయ్యింది ప్రేమ విందుకు వేళయింది’… ఇలా సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు మామ మహదేవన్‌ మధురమైన బాణీలు సమకూర్చారు. అలాగే ప్రేక్షకుల్ని కలల తీరంలోకి తీసుకువెళ్లేలా దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ ఈ పాటల్ని చిత్రీకరించారు.
పది కేంద్రాల్లో వంద రోజులు
1974 అక్టోబర్‌ 18న ‘మంచి మనుషులు’ చిత్రం 35 కేంద్రాల్లో విడుదలైంది. ఆంఽద్రప్రదేశ్‌ లో ఫుల్‌ రన్‌లో కోటి రూపాయలు వసూలు చేసిన శోభన్‌బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే. పది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.