మహానాయకుడు –సర్దార్ పటేల్

మహానాయకుడు
‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్‌ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్‌. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో బలప్రయోగం చేపట్టి విజయం సాధించారు పటేల్‌. అందుకే పటేల్‌ను ఉక్కుమనిషిగా అభివర్ణించటం ఎంతో సముచితం.

గుజరాత్‌ రాష్ట్రంలోని నాడియర్‌లో 1875, అక్టోబర్‌ 31న జవేరి భాయ్‌, లోద్‌భాయి దంపతులకు వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యనభ్యసించినా ఇంగ్లండు లో బారిస్టర్‌ పట్టా పొంది స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తూ మంచి బారిస్టర్‌గా పేరును, ధనాన్ని సంపాదించారు. ఆనాడు దేశంలో జరుగుతున్న జాతీయోద్యమం పట్ల ఆకర్షితుడై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గాంధీ నేతృత్వంలో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణాన 1917లో ఖౌడా జిల్లాలో పంటలు దెబ్బతిన్న రైతులను భూమి శిస్తు కట్టాల్సిందేనని ప్రభుత్వం వేధిస్తుండటంతో గాంధీజీ నేతృత్వంలో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ రైతులకు మద్దతుగా సత్యాగ్రహ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ప్రభుత్వమే రైతులకు సాయమందించేలా చేశారు. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడై న్యాయవాద వృత్తిని వదిలి పూర్తిస్థాయిలో ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇక 1928లో బార్టోలీలో ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్‌ ఉద్యమాన్ని చేపట్టి గ్రామగ్రామాన పర్యటించి ప్రజలలో జాతీయ భావాలను పెంపొందించి వారిలో నైతిక బలాన్ని పెంపొందించటంలో వారందరూ కలిసి కట్టుగా క్రమశిక్షణతో అహింసాయుతంగా వ్యవహరించి చేసిన న్యాయమైన పోరాటం దేశాన్ని కుదిపేసింది. ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పరిష్కారానికి సంసిద్ధత తెలుపడంతో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ యావత్‌ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. జాతి యావత్తూ ఒక మహానేతగా గుర్తించి ‘సర్దార్‌’ అనే బిరుదుతో శ్లాఘించింది.

శాసనోల్లంఘన ఉద్యమంలో అరెస్టయిన తొలి నేత సర్దార్‌ పటేల్‌. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభకు అధ్యక్షత వహించారు. ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి అనేకమార్లు జైలు శిక్ష అనుభవించారు. 1946 సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో ఏర్పడిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో సర్దార్‌ హోం, సమాచార ప్రసార శాఖల మంత్రి అయ్యారు. 1947, ఆగస్టు 15న భారత సంపూర్ణ స్వాతంత్ర్యానంతరం నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉప ప్రధానిగా 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించే వరకు ఆ పదవుల్ని సమర్థవంతంగా నిర్వహించారు. నెహ్రూ మంత్రి మండలిలో ఉన్నప్పటికీ అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించారు. దేశవిభజన అనంతరం చిన్న చిన్న సంస్థానాలు వాటిని పాలిస్తున్న రాజులు, నవాబ్‌లు స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రయత్నిస్తుండటంతో అనేక మర్గాల ద్వారా 550 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు. బలవంతపు విలీనం ప్రధాని నెహ్రూకు ఇష్టం లేకపోయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా నెహ్రూ యూరప్‌ పర్యటనలో ఉండగా తనకున్న అధికారంతో లక్షద్వీప్‌ దీవులను, గుజరాత్‌లోని జునాగఢ్‌ ప్రాంతాన్ని, హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత భూభాగంలో కలిపిన మహనీయుడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌. నిజానికి 16 రాష్ర్టాల ప్రతినిధుల్లో 13 రాష్ర్టాల ప్రతినిధులు ప్రధాని పదవికి పటేల్‌ పేరును ప్రతిపాదించినప్పటికీ ప్రధాని కావాలన్న నెహ్రూ ఆలోచనను గాంధీ ద్వారా అర్థం చేసుకుని పోటీ నుంచి తప్పుకున్న గొప్ప వ్యక్తి సర్దార్‌. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
– కడియాల సాంబశివరావు
(నేడు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి)

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.