|
|
ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ నిరసన
ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్
అయినా, చప్పుడు చేయని జ‘గన్’
కేసులకు భయపడేనంటున్న నేతలు
అధినేత తీరుపై ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం
హైదరాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. మేము అధికార పక్షమో.. ప్రతిపక్షమో తేల్చుకోలేని గందరగోళంలో ఉన్నామంటూ టీడీపీ నేతలు కూడా బరువైన వ్యాఖ్యలే చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ ఏకంగా కోటి సంతకాల ఉద్యమమే ప్రారంభించింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మర్నాడే ఆ పార్టీ నేతలు జిల్లాల్లో ఆందోళనలు చేశారు.
ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందంటూ వామపక్ష నేతలు కూడా విమర్శలు గుప్పించారు. ఇక, విద్యావంతులు సోషల్ మీడియా వేదికగా తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తుంటే.. గ్రామాల్లో నిరక్షరాస్యులు కూడా తమ స్థాయిలో కేంద్రంపై ధ్వజమెత్తుతున్నారు! కానీ, ఏపీకి జరిగిన, జరుగుతున్న అన్యాయంపై కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని వ్యక్తి రాష్ట్రంలో ఒకే ఒక్కరు ఉన్నారు.. ఆయనే వైసీపీ అధినేత జగన్! యథా రాజా తథా ప్రజా అన్నట్లు.. ఆయనతోపాటు ఆ పార్టీ నేతల స్పందన కూడా అంతంతమాత్రమే! కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ప్రాథమిక పాఠశాల విద్యార్థి నుంచి ఉన్నతాధికారి వరకూ.. గల్లీ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకూ ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నా జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు!? ఏపీని అథః పాతాళానికి తోసేసే ఇలాంటి చర్యలకు ఒడిగడితే జగన్ కేంద్రాన్ని ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదు!? ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది! వాస్తవానికి, బడ్జెట్కు ముందు జగన్ ఢిల్లీ వెళ్లారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభు తదితరులను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలపై తనకు సంబంధం లేకపోయినా, తన ధర్మాన్ని నిర్వర్తించానని, ఏపీకి న్యాయం చేయాలని జైట్లీ, ప్రభులకు వినతి పత్రం ఇచ్చానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక జోన్ కావాలంటూ ప్రభుకు వినతి పత్రం ఇచ్చారు కూడా. ఆయన దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా, ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో కిమ్మనలేదు. సాధారణ బడ్జెట్ తర్వాత ఏపీలోని దాదాపు అన్ని వర్గాలూ స్పందించాయి. కానీ, జగన్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రైల్వే బడ్జెట్ తర్వాత ఆయన మాట్లాడకపోవడంతో, సాధారణ బడ్జెట్ వచ్చే వరకూ ఆగుదామని ఆయన కాస్త సంయమనం పాటించారేమోననే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ, సాధారణ బడ్జెట్పై జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహాదారు సోమయాజులు సన్నాయి నొక్కులు, పార్లమెంటు బయట ఆ పార్టీ ఎంపీల వ్యాఖ్యలు మినహా ఆ పార్టీ నుంచి స్పందన కరువైంది. మరీ ముఖ్యంగా, ఈ అంశంపై జగన్ మాట్లాడకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. ఇప్పుడు రాజకీయ వర్గాల అంతర్గత సంభాషణల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా రాష్ట్రాన్ని విభజించుకోవచ్చని అప్పట్లో బ్రహ్మాండమైన సలహా ఇచ్చి రాష్ట్ర విభజనకు కారణమయ్యారని, ఇప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతున్నా కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఏపీకి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడకపోవడానికి ఆయనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులే కారణమని వారు చెబుతున్నారు. ప్రధానికి, కేంద్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా సీబీఐ, ఈడీ ఉచ్చు మరింత బిగుసుకుంటుందని జగన్ ఆందోళన చెందుతున్నారని, అందుకే రాష్ట్రమంతా భగ్గుమంటున్నా ఆయన మాత్రం మౌనముద్ర దాలుస్తున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేనా.. జగన్ వ్యవహార శైలిపై ఆ పార్టీ నేతలే అంతర్గతంగా అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఇలా వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇక పార్టీ బతుకుతుందా!? అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏపీకి అన్యాయంపై స్పందించకపోయినా, ఏపీలో తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తుళ్లూరు ప్రాంతంలో మంగళవారం నాటి ఆయన పర్యటననను ఉదాహరిస్తున్నారు. సమీకరణ మొత్తం పూర్తయిపోయిన తర్వాత రైతులకు అన్యాయం జరుగుతోందంటూ ఇప్పుడు జగన్ అక్కడికి వెళుతున్నారని తప్పుబడుతున్నారు.
|
