ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య
- -ముదిగొండ శివప్రసాద్
శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి-
రచన: పరశురామ పంతుల లింగమూర్తి
వెల: 350/-
ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్
21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి,
మురుగేశం కాంపౌండ్- కడప
నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వీరివి దాదాపు పదకొండు ఇతర కృతులు లభ్యమవుతున్నా విషయ ప్రాధాన్యాన్నిబట్టి ఈ గ్రంథానికి విశేషప్రాచుర్యం లభించింది. దీనికి వెనె్నలకంటి సుందరరామశర్మగారు తాత్పర్యము వ్రాయగా వేదాం తం లక్ష్మయ్య సద్గురువులు విశేషార్థ వివరణ ఇచ్చారు. దీనిని ఇప్పుడు బ్రహ్మస్పర్శిని సంస్థ -(కడప)వారు ముముక్షువులకు అందించారు. ఈ కృతి సంకలనం చంద్రగిరి ఎస్.సుబ్రహ్మణ్యంగారు చేశారు. పరశురామ పంతులవారి పూర్వీకులు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఎప్పుడో వచ్చి ఓరుగల్లులో స్థిరపడ్డారు. శివుడు పార్వతికి శ్రీరామతత్వము బోధించినట్లు గ్రంథ ఉపక్రమణికలో ఉంది. సాంఖ్యము తారకము అమనస్కయోగము వేరువేరు కావని ఇందులో ప్రతిపాదించారు. నిజమునకు ఇదొక ఆధ్యాత్మిక సంగ్రహ విజ్ఞాన సర్వస్వమువలె కన్పడుతున్నది. రామపరబ్రహ్మ తత్వము అనే మిషతో అసంఖ్యాక విషయములు ఇందులో చెప్పబడ్డాయి. రాములవారు రచయితను స్వప్నసాక్షాత్కారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. శ్రీరామ పట్ట్భాషేకానంతరము ఈ సంవాదము జరిగినట్లు కవిగారు చిత్రీకరించారు. ఇందులో షట్చక్రములు- సత్వ అస్తేయశౌచములు స్వాధ్యాయము చతుర్విధ శుశ్రూషా వివరణమూ వంటివేగాక భిన్నభిన్న యోగాసనములు ప్రాణాయామ పద్ధతులు కూడా చేర్చబడ్డాయి. అంటే ఇందులో తత్వశాస్త్రంతోబాటు తదనుభవ సామాగ్రి ఉపాసనా విధానము అందించారని తెలుస్తున్నది.
‘‘ఘటముంవీక్షించు వాడే గతిని తాగాక వేఱైన భంగిన్
పటుదేహద్రష్టనై పరమ సుఖమయ బ్రహ్మమై నట్టినేనె
నన్నటికిన్ దృశ్యంబు మాయానగర సమమసన్నామ రూపాత్మకంబున్
కుటిలా విద్యాకృతంబాకుల దమగుతనూ కోశముంగానువయ్యా!’’
(74వ పద్యము మహాస్రగ్ధర- పుట 317.)
ఈ విధంగా రచనాశైలి సాగింది. అపరిగ్రహము అంటే అసలు తీసుకోకపోవటం అని అర్థం చెప్పుకోకూడదు. శిష్యులిస్తే తీసుకోవచ్చు. అలాగే శౌచము బ్రహ్మచర్యము వంటి పదాలకు ఇందులో కొత్త అర్థాలు ఇవ్వబడ్డాయి. ఇదొక శాస్త్రగ్రంథము. పైగా పద్యములలో ఉంది. అందువలన కేవల మోక్ష పురుషార్థకామములకు నిర్దేశింపబడింది.

ఈ పుస్తకాన్ని ఎప్పుడో నలభైఐదు – ఏభై ఏళ్ళ క్రిందట అక్కడక్కడ చదివాను. ఈ పరమాధ్బుత సద్గ్రంథం మాయింట్లో ఉండేది. మా నాన్నగారు చదువుతూ ఉండే వారు అప్పుడప్పుడూ. అప్పటికి నాకు చిన్నతనం కాబట్టి దానిని ఎక్కువగా చదవలేక పోయాను. అందులో మొదటి పద్యం చిత్తగించండి.
గరిమన్ స్వర్ణ మనేక భూషణములన్ కన్పట్టు చందంబునన్
పరమాత్ముం డఖిల ప్రపంచ మయుడై భాసిల్లు నట్లౌటచే
సుర సిద్ధోరగ యక్ష కిన్నర నర స్తోమాది శశ్వత్ చరా
చర రూపోజ్వల సర్వభూతములకున్ సద్భక్తితో మ్రొక్కెదన్
బంగారం ఎలాగైతే అనేక ఆభరణాలో కనిపిస్తూ ఉంటుందో అలాగే పరమాత్ముడైన దేవుడు కూడా దేవతలు, సిధ్దులు, యక్షులు, నాగులు, కిన్నరులు, నరులు మొదలైన సమస్తమైన జీవరాసులలోనూ, అంతే కాకుండా అన్ని కదలిక లేని నిర్జీవులు, వృక్షాది జీవులలోనూ కూడా ఉజ్వలంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. కాబట్టి అన్ని విధాలైన జీవగణానికీ సద్భక్తితో నమస్కరిస్తున్నాను.
అంటే అన్ని రూపాల్లోనూ ఉన్న భగవంతుడిని కొలుస్తున్నాను అని అర్థం. ఇక్కడ చరాచర అని అఛరములైన పర్వతాదులు, వృక్షాదులూ చెప్పారు. ఇందులో పర్వతాదులు నిర్జీవులు అని తలచరాదు. భారతీయ తాత్విక దృష్టిలో రాళ్ళలోనూ చైతన్యం ఉంది – అవీ జీవులే. శిల్పశాస్త్రంలో పురుషస్తీవిబేధాలు శిలల్లోనూ నిరూపణగా చెబుతారు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువులేదు వంశపావన వింటే అని భాగవత వచనం. అంతా భగవన్మయమే.
ఇదీ ఈ శ్లోకానికి లఘువుగా అర్థప్రకాశనం. అన్నట్లు ఈ పద్యం మా నాన్నగారికి చాలా యిష్టమైనది. తరచు పైకే శ్రావ్యంగా గానం చేసేవారు.
ఎంతో గొప్ప పుస్తకం.
LikeLike