ఈ భూపతికి అలుపేలేదు

ఈ భూపతికి అలుపేలేదు

ఆయన చదివింది ఏడో తరగతి. రాసింది 40 పుస్తకాలు. పేరు భూపతి నారాయణమూర్తి. 93 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ యువకుడిగా సైకిల్‌పై జోరుగా తిరుగుతుంటారు. సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది దళితకవిగా, అభ్యుదయవాదిగా, ఉపన్యాసకుడిగా భూపతి నారాయణమూర్తి పేరొందారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఘనతనూ దక్కించుకున్నారు..
ఈ పెద్దాయన పెద్ద చదువులేవీ చదువుకోలేదు. హంగులు ఆర్భాటాలు లేని సాదాసీదా           జీవితాన్ని గడుపుతూ.. తొమ్మిది పదులు దాటినా.. సైకిల్‌లోనే  తిరుగుతూ.. అక్షరసేవలో తరిస్తున్నారు. అంబేద్కరిజం, మార్క్సిజం భావజాలంతో                   పదుల సంఖ్యలో పుస్తకాలు రాసి.. ప్రజలకు పంచి       పెడుతున్నారు.
ఒక వ్యక్తి గురించి ప్రభుత్వ పాఠ్యపుస్తకంలో వచ్చిందంటే అతను ఎంత గొప్పవాడు అయ్యుండాలి? ఈ పెద్దాయనను చూస్తే సామాన్యుడిలా అనిపిస్తుంది. కాని ఇతను రాసిన డొక్కా సీతమ్మ కథనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పన్నెండో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా పెట్టింది. అదీ భూపతి గొప్పదనం. ఢిల్లీలోని అంబేద్కర్‌ఫెలోషిప్‌ను సాధించిన ఘనత ఆయనది.
తెలుగు మన మాతృభాష. అందులోనే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కొనసాగాలని ఇప్పుడో చర్చ నడుస్తున్నది కాని.. ఆ రోజుల్లోనే ఆ దిశగా ఆలోచించి.. ఒక పుస్తకాన్ని కూడా రాశారు భూపతి. ‘‘ఆ పుస్తకాన్ని ఇరవై ఏళ్ల కిందట రాశాను. తెలుగుజాతి పురుగతి సాధించాలంటే మన పాలన మనమాతృభాషలోనే ఉండాలన్నది నా లక్ష్యం. ఆ రోజుల్లో అనేక సదస్సులు పెట్టాను. ఉపన్యాసాలు ఇచ్చాను. పరిపాలన లేఖలను అందించాను’’ అన్నారాయన.
ఆ పుస్తకంతో పాటు ‘మద్యపానమా- మానవత్వమా’ అంటూ సామాజిక రచనలతోపాటు ‘దళితులపై దమనకాండ’, ‘శాస్త్రం విజ్ఞానం’, ‘నాటి నాగులే నేటి దళితులు’, ‘అంబేద్కర్‌ మార్క్సిజం’, ‘దళిత బహుజన రాజకీయం’… ఇలా యాభైకి పైగా పుస్తకాలు ప్రచురించారు. వాటితోపాటు ‘శృంగారానికి సంకెళ్లు’ అంటూ విభిన్న తరహా రచనలు అందించారు. అనేక పత్రికల్లో 500 పైబడి వ్యాసాలు రాశారు.
ఇప్పటికీ సైకిల్‌పైనే పయనం
93 ఏళ్లు వచ్చినా భూపతి నేటికీ యువకుడిలాగానే సైకిల్‌పై తిరుగుతుంటారు. వర్థమాన సంగతులను ఉపన్యాసాల ద్వారా తెలుపుతుంటారు. గతంలో మలికిపురం సర్పంచ్‌గా కూడా పనిచేశారీయన. ‘‘రైతు కూలీ ఉద్యమంలో రెండుసార్లు జైలుకెళ్లాను. 1953, 1957లలో రెండుసార్లు సర్పంచ్‌గాను, బూరుగుపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమ్యూనిస్టు అభ్యర్ధిగాను, రాజోలు అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేశా’’ అన్నారు. ప్రస్తుతం భూపతి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి స్వర్గీయ కమల కూడా స్ర్తీవాద ఉద్యమకార్యకర్త కావడం విశేషం.
– కత్తిమండ ప్రతాప్‌, సఖినేటిపల్లి

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.