కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4
తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం లేదుకదా ?’’అని ఒక్కమాట అడిగితె ఈయన కళ్ళనుంచి దుఖం ధవలేశ్వర డాం నుంచి గోదావరి ఉబికినట్లు కారింది .’’తెలివితేటలు బానే ఉన్నాయి ఊరుకో ‘’అని ,తానుకోడుకును పలకరించినట్లు లోపలివారికి తెలిసిపోతుందేమో అని గబగబా లోపలి వెళ్ళిపోయారు .తనకు ఆక్షణం లో అంత దుఖ౦ ఎందుకు వచ్చిందో తెలీదన్నారు శాస్త్రిగారు .ఏడవకుండా ఉంటె ఇంకో రెండుమాటలు మాట్లాడి ఉండేవారేమో అనుకోని తనను తాను సముదాయి౦చు కొన్నారు .ఆనాటి కొందరిపెద్దల తీరు అలానే ఉండేది .మానాన్నగారూ అలానే ఉండేవారు .తండ్రిగారి టోపీ కనపడకుండా చేసి ,ఆయన తిరుగుప్రయాణం హడావిడిలో దాన్నిమర్చిపోతే పడవల రేవుకు తీసుకు వెళ్లి ఇస్తే ,’’నేను మర్చిపోలేదు నీకోసమే ఉంచాను ‘’అని రెండు పొడిమాటలుమాట్లాడి స్నేహితులతో కబుర్లలో పడ్డారు తండ్రి .
మాఖమాసం లో శాస్త్రిగారి ఉపనయన ముహూర్తం పెట్టి తండ్రికి ఈయనద్వారానే ఉత్తరం రాయించి సంతకం ‘’లింగయ్య శాస్త్ర్ృల్లు వ్రాలు’’అని దస్కత్తు చేశారు. శాస్త్రులు అని రాయటానికి వచ్చినతిప్పలు ఇవి రెండుతప్పులు అందులో గమనించారు మనవడు గారు .పూర్వపు సంస్కృత పండితులకు తెలుగుపై దృష్టి ఉండేది కాదని ,తాతగారు తాటాతాకుల మీద రాయగలరుకాని కాగితాలమీద రాయలేరని శాస్త్రిగారు ఉవాచ .ముహూర్తానికి ముందే బలగం అంతా చేరింది .ఆ ఇంట్లో మామిడాకు తోరణం కట్టి 40ఏళ్ళు అయిందని ,కనుక మనవడికి ఉపనయనం తాము చేసే అవకాశం ఇవ్వమని మామ్మ,తాత శాస్త్రిగారి తండ్రినికోరటం వారు అంగీకరించటం జరిగి తాత బామ్మల చేతులమీదుగా శాస్త్రిగారి మెడలో జందెపు పోగుపడింది .తమ తలిదండ్రులది త్యాగంగా అందరూ భావించారు .దీనికి శాస్త్రిగారు ‘’వాత్సల్యం వంక చూడగలిగితే అది మహాత్యాగమే ‘’అని చెప్పారు .సంధ్యావందనం నేర్పే బ్రహ్మగారు ‘’అచ్యుత ,జనార్దన ,ఉపేంద్ర ,హరేః శ్రీ కృష్ణః’’అని చెబుతుంటే ‘’ఇవి సంబోధనలు సున్నాలు ఉండకూడదేమో?’’అని దువ్వూరి వారు ఆయనతో అంటే ‘’మీ సాహిత్యాలిక్కడ పనికిరావు .ఇదేమన్నా కుమారసంభవం, మేఘ సందేశం అనుకొన్నావా ? సున్నాలు అలా ఉండాల్సిందే కదల్చటానికి వీల్లేదు ‘’’’అని గదమాయిస్తే, ఆయన అమాయక విశ్వాసానికి శాస్త్రిగారు జాలిపడి ‘’స్మార్తం లో భాషా కృషి చేసినవారు లేరు ‘’అని బాధపడ్డారు .వేదపాఠశాలలు సంస్కృత పాఠశాలలు పెడుతున్నారుకాని స్మార్తం చెప్పిస్తూ సాహిత్యగ్రంథాలు కూడా కొద్దిగా చదివించే పాఠశాలలు వస్తే బాగుండును అనుకొన్నారు .’’ఆత్మనామ గురోన్నామ —-నృహ్లియ్యాత్’’అని పెద్దలశాసనం కూడా ఉన్నట్లు గుర్తు చేశారు .రెండేళ్లలో తాతగారి వద్ద సాహిత్య గ్రంథాలన్నీ పూర్తయ్యాయి .14వ ఏట ఇల్లువదిలి బయట ఎక్కడైనా వ్యాకరణం నేర్వాలని మనసుపడ్డారు .
మూడుమైళ్ళ దూరం దంగేరులో వేదార్ధవిశారదులైన ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి తండ్రిగారు వేదవేత్త గంగాధరశాస్త్రిగారికి మనవడిని అప్పగించారు తాతగారు .కౌముది ప్రారంభించి సంజ్ఞా పరిభాషలు అచ్ సంధి చదివారు .వేదామూ శాస్త్రమూ చదివిన పండితులు అప్పుడు అరుదు .ఇక్కడ చదివినప్పుడు దగ్గర బంధువు ఉప్పులూరి సూర్యనారాయణ గారింట్లో ఉండేవారు .గంగాధరం గారు కొద్దికాలానికే కాకినాడకు మకాం మార్చారు .అప్పటికే దాక్షారామ లో సంస్కృత పాఠశాల వచ్చింది .చిలుకూరి చతుస్టయ౦ అని వ్యాకరణం లో పేరుపొందిన వారిలో పాపయ్య శాస్త్రిగారి గారి రెండవకుమారుడు చిలుకూరి కొండయ్య శాస్త్రులుగారు అక్కడ వ్యాకరణ బోధకులని దువ్వూరి వారికి తెలిసింది .అక్కడ చేరి హల్ సంది ప్రారంభించారు .40కి పైనే విద్యార్ధులు ఉండేవారు .ఈ బాచ్ లో అనిపెద్ది వెంకటశాస్త్రి దీ గురువుగారు కొండయ్యగారిదీ సమానవయస్సే .అందుకని గురువుగారు ఈయన్ను ‘’వెంకట శాస్త్రిగారు ‘’అనే గౌరవంగా పిలిచేవారు. ఇది మిగిలినవారిలో అసూయకు కారణం అయి౦ది కూడా .ఒక సాయిబు చేత వేంకటశాస్త్రిని ‘’వెంకన్న గారు ‘’అనిపిలిపించి ,గురువుగారికోపానికి గురై కూకలేయి౦చుకొన్నారు దువ్వూరి అండ్ కో .పొయ్యిమీద ఉడుకుతున్న అన్నం గిన్నె దించలేక కిందపదేసినందుకు గుర్విణి తోనూ చీవాట్లు తిని ఇకా అక్కడ ఉండలేక వెళ్లిపోతుంటే ‘’ఏదోకోపం లో నాలుగు అంటే వెళ్ళిపోవాలా “?అని వాత్సల్యంగా అడిగినా ముగ్గురు ముఠా వెళ్ళిపోయారు .
దాక్షారామకు సుమారు 8మైళ్ళ దూరం లో ఉన్న కొంకుదురు లో కొత్తగా పాఠశాలపెడుతున్నారని వేదుల సూర్యనారాయణ శాస్త్రిగారు వ్యాకరణం బోధిస్తారని తెలిసి అక్కడికి చేరి పాఠాలు ప్రారంభించారు ఈముగ్గురు. వేదులవారు మహామహోపాధ్యాయ తాతారాయుడు శాస్త్రులుగారి మొదటి శిష్యులు .వ్యాకరణం లో అపారపా౦డిత్యమున్నవారు .ఒకగంట చెప్పాల్సిన పాఠాన్ని 2లేక 3న్నరగంటలు బోధించేవారు .సూత్రాలు విమర్శలు అన్నీ వివరంగా బోధించటం వలన మళ్ళీ ఇంటిదగ్గర చదవాల్సిన అవసరం ఉండేది దికాదన్నారు దువ్వూరివారు .కౌముది దాదాపు పూర్తయింది .వారి బోధనలో ‘’ఉత్సాహకరమైన అనుభవం కలిగింది ‘’అని మురిసిపోయారు .వేదులవారికి పిఠాపుర సంస్థానాధీసులనుంచి పండితులుగా చేరటానికి ఆహ్వానం వచ్చింది .వెళ్ళే ప్రయత్నం లో ఉండి దువ్వూరి వారినిపిల్చి తరువాత ఏమి చదువుతావని అడిగితె ఆయనతో పిఠాపురం వెళ్లి అక్కడే చదువుతాను అనగా ‘’ఇప్పటినుంచే నిర్ణయం లో ఉండకు అప్పుడు ఆలోచిద్దాం ‘’అన్నారు .
తాతగారు రాసిన కార్డు ప్రకారం వెళ్ళారు .15రోజుల్లో పెళ్లి ముహూర్తం అని ఆయన చెప్పటం ,గురువుగారికి పెళ్లి విషయం కార్డ్ రాయటం జరిగిపోయాయి .వధూవరుల ఇష్టాయిష్టాలతో జరిగే పెళ్ళిళ్ళు ఆనాడులేవు .బాధ్యతంతా పెద్దలదే నిర్ణయాలూ వారివే .పెళ్లి చూపులూ లేవు ‘’చిన్నవయసులో పెళ్లి విషయం వధూ వరులు నిర్ణయి౦చు కోలేరుకనుక అప్పటి సంఘం ఆ అపద్ధతే పాటించింది ‘’అంటారు శాస్త్రిగారు .వివాహం నాటికఈయనకు 15, ఆమెకు 10ఏళ్ళు .అమలాపురం తాలూకా ఇందుపల్లిలో వంక జగన్నాధం గారమ్మాయి పెళ్ళికూతురు .స్నాతకానికీ వివాహానికీ మధ్యకాలం లో నదులు దాటరాదు అనే నియమం ఉండటంవలన గోదావరి దాటినఅవతలి ఒడ్డున అంటే ‘’ అద్దరిని ‘’ముక్తేశ్వరం లో మాతామహుల ఇంట స్నాతకం చేసి అమ్మ,అమ్మమ్మ కోరికా తీర్చారు .దువ్వూరివారితల్లి బాగా చదువువుకొన్న అంటే సాహిత్యం చదివిన ఇల్లాలు ‘’వర్ధనమ్మది తెలుగులో మంచి జ్ఞానమండీ ‘’అని అతా చెప్పుకొనేవారు తనతల్లి గురించి .భాషాజ్ఞానం ఎక్కువ.పురాణాలన్నీ తేలికభాషలో అందరికీ చెప్పేది .
పెళ్లి నాటి ఒకముచ్చట గుర్తు చేసుకొన్నారు శాస్త్రిగారు .తాతగారికి సంస్కృతం నేర్పిన గురువుగారిదీ అదే వూరు .తాతగారు నూతనవదూవరులను బంధువులను వారింటికి తీసుకువెళ్ళి ఆశీర్వచనం ఇప్పించారు .తనగురువుగారితో ‘’తమరు నాకు చెప్పినది అంతా తుచ తప్పకుండా నా మనవడికి తృప్తిగా చెప్పేశా’’అన్నారు గురువుకు నమస్కరిస్తూ తాతగారు ‘’ఐతే ఏవైనా శ్లోకాలు అడగనా ?’’అన్నారు ఆముసలి వగ్గు .ఆయన అడిగినవాటికి వాటికి సరైన శ్లోకాలే చెప్పారు దువ్వూరివారు .వారి దర్శనం ‘’పరమగురు దర్శనం ‘’గా భావించి ఆశీస్సుల౦దు కొన్నారు దంపద్యుక్తంగా. ‘’సమానానా ఉత్తమ శ్ల్లోకో అస్తు ‘’అని ఆ శతాధిక జ్ఞాన వృద్దు ఆశీర్వదించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-19-ఉయ్యూరు
—
