నీలకంఠేశ్వర శతకం

నీలకంఠేశ్వర శతకం
తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం కోటయ్య ,శ్రీ సోమన బసవ రాజు గార్లు .వెల-రెండు అణాలు.పుస్తక ముద్రణకు ద్రవ్యసాయం చేసిన వారు శ్రీ దగ్గులూరి వాస్తవ్యులు సామంత పూడి పెద వెంకట నృపాలుని ప్రియ సుతుడు శ్రీమతి బంగారాయాంబ దంపతుల ప్రియపుత్రుడు శ్రీ సత్యనారాయణ .పీఠిక లో కవి గారు తాను అప్పుడప్పుడు భక్తి గ్రంధాలను చదివి వినిపిస్తున్నప్పుడు తనమిత్రుడు దగ్గులూరి వాస్తవ్యుడు కర్ణ వంశానికి చెందిన శ్రీ వాసా సూర్య సోమ లింగం గారు ,ఆగ్రామ పాలకుడైన శ్రీ నీలకంఠేశ్వరస్వామి పై ఒక శతకం రాయమని కోరితే,రాసి, తనగురువు శ్రీ చింతా వీరభద్రయ్య కవికి చూపించగా తప్పులు సరిచేసి ,శుద్ధ ప్రతి తయారు చేసి ఇచ్చారు .ఈ శతకం పై పెన్నాడ అగ్ర్హహార వాసి శ్రీ మల్లిపూడి వీరయ్య సిద్ధాంతి తన అభిప్రాయం రాస్తూ -కవి మృదుమధుర లలితా పదజాలంతో శతక రచన చేశాడని అన్నారు .పాలకొల్లు వాస్తవ్యులు ఉభయ భాషాప్రవీణ శ్రీ ధర్మపురి తిరుమల లక్ష్మీ కుమార వేదాంత తిరుమలాచార్యులు అభిప్రాయం తెలియజేస్తూ -సుధీ జన చిత్త రంజకంగా ,శబ్దాలంకార శోభితంగా కవిత్వం ఉందని మెచ్చారు .దగ్గులూరి వాస్తవ్యుడు శ్రీ పూడి భోగ లింగకవి ‘’సుధారసం తో ,మృదూక్తులతో ,గంగాలహరీ ప్రవాహంగా శతకం ఉన్నది ‘’అన్నారు .పాలకొల్లుకవి శ్రీ కడియం తమ్మన్న ‘’నీతి దాయకం భక్తి ముక్తి ప్రద౦గా ప్రాచీనకవుల ధోరణిలో శతకం నడిచింది .సర్వపాప సంహారకంగా ఉంది ‘’అని శ్లాఘించారు . లంకల కోడేరు వాసి పండిత బొండాడ లక్ష్మణ కవి ‘’బాలకవి బిరుదున్న ఈకవి రాసిన శతకం చదివి ముక్తిపొందాలి ‘’అని అభిప్రాయం రాశారు .వీరందరికి కవి కృతజ్నతలు తెలిపారు .ఇది సీస పద్య శతకం .’’దగ్గులూరి నివేశ ,పాతక వినాశ – నీలకంఠేశ నన్నేలు నిరతమీశ’’అనేది శతక మకుటం .
మొదటి పద్యం –‘’శ్రీమన్మహేశ్వరా శ్రీతాజన మందార -శంకర పాహిమాం -పాహి శరణు-భోగీశా వరాభూష ,ముని మనోంబుజ పూషా -సర్వేషా పాహిమాం పాహి శరణు శరణు
గజచర్మ పరీధాన కైవల్య సంధాన -సర్వజ్న పాహిమాం పాహి శరణు -లింగ ,సుచారిత్ర ,లేఖర్షభ స్తోత్ర -పరశివ పాహిమాం పాహి శరణు
గరీమతో సీసా శతకమను కమలములను -మాలగా గూర్చి యర్పింతు మది నుతింతు- దగ్గులూరి నివేశ పాతక వినాశ -నీలకంఠేశ-నన్నెలు నిరతమీశ’’. తర్వాత పద్యంలో శ్రీ వీరభద్రదేశికునికి నమస్కరించాడు .తనది దేవల బ్రహ్మ వంశమని ,ఇంటిపేరు బళ్ళ ఆశ్వాలాయన సూత్రులమని ,గౌరమాంబ మల్లికార్జునుల తనయుడు ,అచ్చమాంబ కు భర్త అయినకనకయ్య తన తండ్రి అని వారి ప్రధమకుమారుడైన తనపేరు మల్లయ అని తెలిపాడు.తనతలిదండ్రులు తన్ను ‘’శివ దత్తకుమారుడు ‘’అని పిలిచేవారని ,కనుక శివుడు తనకు అన్నయ్య ,అంబికా గంగలు అమ్మలు .గణపతి కుమారస్వామి వీరభద్రుడు అన్నలు .వాళ్ళ అర్ధ శరీరులు తనకు వదినెలు అని చమత్కరించాడు .ఓం నమ శివాయ పంచాక్షరీ మంత్రం లోని మొదటి అక్షరాలతో మరో సీసం అల్లాడు .అక్షరాలకు ఆద్యుడు ,బిందుయుత ప్రణవం , వర్ణత్రయంలో వాక్ సతీ,మా ఉమాకాంత లై పతులు నై శోభించాడు .పంచభూతాలు ,పగలు రాత్రి ,లోపల బయటివాడై ,సకల చరాచరమ్బై సర్వం శూన్యమై ,ఎంచటానికి అశక్తమై ,ఆది మధ్యాంతరహితుడవు నువ్వు అన్నాడు ,ఊపిరి వదిలేలోపు నిన్ను ఎన్నగలనో లేనో అని సందేహపడ్డాడు .
పౌలస్త్యుడు ఆర్టీతో ఆర్ధిస్తే నవనిధులు ,ఆగరాజసుత ఆర్చిస్తే అరమేను ,ఫల్గుణుడు తపిస్తే పాశుపతం ,ఇచ్చిన భక్త సులభుడవు అన్నాడు .మైదున రాముడిని కోర్కె తీర్చాడు .సంధ్యా నృత్యం చేసి అందర్నీ అలరిస్తావు .’’అత్యంత భారమౌ యవనీ తలంబొక శేషు౦డు శిరమున జెర్చి యుండే-నా భోగి కులనాధు నవలీలగా నొక కమతంబు వెన్నున గదలకుంచే -నా కచ్ఛపాంబును నతి సూక్ష్మముగా-నొక క్రోడంబు మునిపంట కూర్మి నుంచె-నా వరాహంబును అణుమాత్రముగనెంచి-జలధి మోయుచు నుండే గలత లేక – యోగ్యులగు ధీరులోరులకు నోపినంత -సాయమొనరింతురది వారి సఃజ గుణము ‘’అని చాలా చమత్కారంగా పద్యం అల్లి సూక్తి తో ముక్తాయింపు ఇచ్చాడు కవి .కోపం వదలటం ఘనం .శక్తిలేక వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులను కాపాడాలి .డబ్బుమదం గర్వం పతన హేతువు అని సూక్తి ముక్తావళి కూర్చాడు .’’ఏరననుబ్రోవ విదినీకు మేర యటర ‘’అని ఆర్తిగా ప్రార్థించాడు .శ్రీ ధాత్రు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఈశతకాన్ని స్వామికి ఆర్పణం చేసి ముగించాడు 101వ సీసం లో .తర్వాత గద్యంలో –‘’ఇది శ్రీ మదుమా రమణ పాదారవింద మకరంద పానేందిందిర,బాలపరమేశ్వరీకరుణా కటాక్ష వీక్షణ సమాలబ్ధ ,సరస కవిత వైభవ ,మన్మహారుషిగోత్ర పవిత్ర ,అశ్వలాయన సూత్ర ,బళ్ళవంశపయఃపారావార కైరవ మిత్ర ,కనకాభి దేయ సత్పుత్ర ,మల్లయ నామ ధేయ ప్రణీతంబగు నీలకంఠేశ్వరశతకము సర్వ౦బును సంపూర్ణము ‘’అని ముగించాడుకవి .
భక్తి ముక్తి దాయకమైన శతకం కవి ప్రతిభ ప్రతిపద్యం లోనూ కనిపిస్తుంది .లోకరీతి, జన ప్రవృత్తి,ధర్మ సూక్షాలు ,నీతులు,నిష్టూరాలు కలబోసి రచించిన శతకం .
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -9-9-22-కాంప్-మల్లాపూర్ -హైదారాబాద్

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.