మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం
16-3-1943 న మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలోని ఆఖ్రాని కోట దగ్గరున్న ఒక లోయ లో తల దాచుకొంటున్న వందలాది ఆదివాసీ స్త్రీలపైనా మగవారి పైనా బ్రిటిష్ సైన్యం , పోలీసులు ఆకస్మికం గా దాడి చేసి ,చాలామందిని దారుణం గా తుపాకులతో చంపేసి ,మిగిలిన వారిని లాక్కెళ్ళి జైలు పాలు చేశారు .అంతేకాదు వారినందర్నీ బందిపోట్లుగా చిత్రించారు . ఈ సంఘటన జరగటానికి నేపధ్యం ఉంది .ఆ వివరాలు తెలుసుకొందాం .
తలోడా జిల్లా ,మార్వాద్ తాలూకా మార్వాడ కు చెందినా ఆప్ గులాం మహారాజ్ అనే యోగి తన శిష్యులను సారా ,కల్లుతాగ వద్దని ,మరే విధమైన మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని బోధించేవాడు .శిష్యులు అత్యంత వినయం తో ఆయన మాటలు పాటిస్తూ వీటికి దూరం గా ఉంటూ జీవిస్తున్నారు .గులాం మహారాజ్ మరణం తర్వాత ఆయన చిన్న తమ్ముడు రామదాస్ మహారాజ్ సారా వ్యతిరేక ఉద్యమాన్ని స్వీకరించి నడిపి ఆది వాసుల జీవితాలలో వెలుగు రేఖలు నింపాడు .ఈ ఉద్యమమ వల్ల సారాషాపు యజమానులు తీవ్రం గా నష్టపోయారు .సారా తాగ్రేవాళ్ళకూ ఇబ్బందిగానే ఉంది .తాగుబోతులు ,సారా విక్రేతలు ఏకమై సారా వ్యతిరేకతను తీవ్రం గా ఎదుర్కొన్నారు .తరచూ వీరిద్దరిమధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి .
బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వైన్ ను, వైన్ షాపుల వాళ్ళు అమ్ముతున్నందున సహజం గా నే షాపు యజమానుల కొమ్ముకాసి ఉద్యమాన్ని బల పడకుండా చేస్తున్నారు .రామదాస్ మహారాజు ను ప్రభుత్వ వ్యతిరేక విప్లవ కారుడిగా ముద్ర వేశారు .అంతేకాక మహారాష్ట్ర నుండి ఆయన్ను,అనుచరులను బహిష్కరించారు .అనేకమంది నమ్మకమైన అనుచరులతో ,అందులో ముసలి వారితో కలిసి నర్మదా నది వెంబడి ప్రయాణం చేస్తూ మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించాడు మహారాజ్ .
జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ శంకర వినాయక్ ఠాకూర్ రామదాస్ మహారాజును బ్బహిష్కరణను వ్యతిరేకించి ప్రజల్లో కలిసి పొమ్మని కబురు చేశాడు .దానిని మన్నించి రామదాస్ మహారాజ్ అనుచరులతో వచ్చి ఆఖ్రానిరి కోట దగ్గరున్న లోయలో తల దాచుకొంటున్నారు .ఇదీ పై సంఘటనకు నేపధ్యం .నిరాయుధులు ,శాంతి యుతులు అయిన ఆదివాసీలపై బ్రిటిష్ సైన్యం ,పోలీసులు ఆకస్మికం గా దాడి చేసి నిర్దాక్షిణ్యం గా వందలాది మందిని తుపాకి గుళ్ళకు బలి టుచేశారు .చనిపోయిన వారి శవాలను ఎడ్ల బండీ మీద కట్టెల మోపులు పేర్చినట్లు పేర్చి తలోడా పోలీస్ స్టేషన్ కు చేర్చారు .ఈ దారుణ మారణ కాండకు ఆనాడు ఆరవ తరగతి చదువుతూ ,ఇప్పుడు మాజీ శాసన సభ్యుడుగా ఉన్న జనార్దన పోహార్య వాల్వి ప్రత్యక్ష సాక్షి .ఈ దారుణ కిరాతక హత్యలు సరిగ్గా ఏ ప్రదేశం లో జరిగిందో ఆయన గుర్తు చేసుకొని చెప్పాడు .
దీని తర్వాత రామ దాస మహారాజును అయన స్వగృహం లో గృహ నిర్బంధం లో ఉంచారు పోలీసులు .మిగిలిన వారిని అరెస్ట్ చేసి జైలు లో పెట్టారు .తరువాత శంకర్ వినాయక్ ఠాకూర్ వారిని జైలు నుండి విడిపించాడు .ఈ పోలీస్ కిరాత కృత్యం లో చని పోయిన ,అరెస్ట్ అయిన అమాయకులైన ఆది వాసీలను బంది పోటు దొంగలుగా పోలీసు రికార్డుల్లో నమోదు చేయటం మరీ దారుణం .మనకు స్వాతంత్ర్యం వచ్చి అరవై అయిదేళ్ళు దాటినా ఇంకా ఆ సమర యోధుల్ని ‘’డకాయిట్లు ‘’గా రికార్డుల్లో ఉంచటం జాతికే సిగ్గు చేటు .మన అసమర్ధ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఉదాహరణ .
ఈ వివరాలన్నీ సంతోష్ మిరాఘే అనే టీచర్ ‘’ట్రైబల్ ట్రబుల్స్’’ ‘పుస్తకం లో రాశాడు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-8-14-ఉయ్యూరు
