బ్రాహ్మణాల కధా కమామీషు -17-
గోపద బ్రాహ్మణం
అధర్వ వేదానికి చెందిన బ్రాహ్మణమే గోపద బ్రాహ్మణం అయినా అధర్వ సంహిత కు సాక్షాత్తుగా సంబంధం లేదు .యజ్న యాగాలతో బాటు ఇతరవిషయాలూ ఉన్నాయి .అధర్వ వేదం లో నిష్ణాతుడైన వాడే యజ్ఞాలలో బ్రహ్మ గా ఉండాలని ఇందులో చెప్ప బడింది .బ్రహ్మ విధులు ,ప్రాముఖ్యాన్ని గూర్చి ఇతర బ్రాహ్మణాలు చెప్పలేదు .కర్మ లోపం వల్లజరిగే పాపాలకు ప్రాయశ్చిత్తం ఉన్నది. రుత్విక్కులలో బ్రహ్మ కున్న ఉన్నత స్థానాన్ని వివ రిం చింది .
‘’ప్రాయశ్చి త్త రాను ధ్యానై రనుజ్ఞానాను మన్త్రనైహ్-హోమైశ్చ యజ్న విభ్రంశం సర్వం బ్రహ్మ ప్రపూరయేత్’’
ఇందులో నూరు ప్రపాఠకాలుఉండేవి అని తెలుస్తోంది దిరికినవి కేవలం పదకొండే పతంజలి మహర్షి పేర్కొన్న అవయవ లక్షణం దీని లోనిదే .ఓంకార స్వరూపం ,ప్రతి వేదం బ్రహ్మ చర్యం ,గాయత్రీ మంత్రం రహస్యార్ధం తెలుసుకోవటానికి గోపద బ్రాహ్మణం ఏంతో ఉప యోగ పడుతుంది .
ఈ బ్రాహ్మణం పూర్వభాగం ఉత్తర భాగం అని రెండుగావిభజింప బడింది .పూర్వం లో అయిదు ఉత్తరం లో ఆరు ప్రపాఠకాలున్నాయి .పూర్వ భాగం లో సృష్టి సముద్రాల పుట్టుక ,భ్రుగువు మహర్షి జననం ,అధర్వ మహర్షి ఉత్పత్తి ,అధర్వ వేదావిర్భావం బ్రహ్మ సృష్టి ,ఓంకారోత్పత్తి ,గాయత్రీ మాహాత్మ్యం ,బ్రహ్మ చారి ధర్మాలు ,యాగాలలో బ్రహ్మ స్థానం ,దేవ యజనం ,బ్రహ్మోదనం ,ఆత్రేయ యజ్ఞం ,ఋత్విక్కుల అర్హత ,స్వాహా శబ్ద ఉత్పత్తి ,యజ్న దీక్ష ,వాటిల్లో వేదం మంత్రం వినిమయం ఉంటాయి .ఉత్తర భాగం లో యజమాని ,అతిధులు ,నక్షత్రోత్పత్తి ,చాతుర్మాస్య యాగాలు ,,దేవాసుర యుద్ధం ,అగ్నీధ్ర నియమానం ,వషట్కార విశేషాలు ,దక్షిణ ,ఉక్త దేవతలు షోడశి నిర్వచనం ,శర్వం ,వాజపేయ ప్రశంస ,ఆప్తార్యామ ప్రశంస ,సంపాత మంత్రోత్పత్తి ,అహీన యాగ విశిష్టత ,మొదలైనవి చెప్ప బడ్డాయి .ఈ బ్రాహ్మణం గుజరాత్ ప్రాంతం లో ఏర్పడిందని క్రీ పూ అయిదవ శతాబ్ది ది అని తెలుస్తోంది .దీనికెవరూ వ్యాఖ్యానం రాసినట్లు లేదు
యజ్ఞం లో పాల్గొనే రుత్విక్కులలో బ్రహ్మ ప్రధానమైన వాడు .ఆయన అధర్వ వేదాం లో నిష్ణాతుడై ఉండాలి .యజ్న యాగాలలో జరిగేలోపాలకు బ్రహ్మ గారు చేయాల్సిన ప్రాయస్చిత్తాలు చెప్పారు.ఇందులో యజ్నక్రమ వైశిష్ట్యాన్ని బాగా తెలియ జేశారు .అగ్న్యా దేయం కంటే పూర్ణాహుతి ,దానికన్నా హోమం ,అంతకంటే దర్శ పూర్ణ మాసాలు ,వాటి కంటే ఆ ఆగ్రయణం ,దానికంటే చాతుర్మాస్యలు ,వాటికంటే పశు బంధం ,దానికన్నా అగ్ని స్టోమం , అంతకంటే రాజ సూయం ,దానికన్నా వాజ పేయం ,అంతకంటే అశ్వ మేధం ,దానికన్నా పురుష మేధం ,అంతకంటే సర్వ మేధం ,దానికన్నా దక్షిణా వంతాలు ,వాటికంటే దక్షిణలు , అదక్షినలు ,సహస్ర దక్షిణం ఉత్తమ మైనవని తెలియ జేయ బడిందిం . పురుషునికి సంవత్సరానికి పోలికలను మహా ఆశ్చర్యం గా చెప్పారు .దీనితోనే ఈ బ్రాహ్మణానికి ప్రాముఖ్యత పెరిగింది .
ప్రపంచ సృష్టి
ఏ వేదం లోనూ లేనంత గొప్పగా సృష్టి గురించి గోపధం తెలియ జేసింది .మొదట్లో పరబ్రహ్మ ఒకడే ఉండేవాడు .తనలాంటి మరో దైవాన్ని సృష్టించాలని తపస్సు చేసి తన దేహం లో వేడి పుట్టించి ఫాల భాగం నుండి చెమట కార్చాడు .ఈ స్వేదానికే సువేదం అనీ పేరు .అంటే బాగా జ్ఞానం కలిగింది అని అర్ధం .దీనివల్ల సమస్తమూ ఆయనకు అవగతమవుతుంది .మరింత తపస్సు చేశాడు .రోమ కూపాలనుంచి స్వేదం ధారలుగా ప్రవహించింది .ఆ దారాలతో ప్రపంచ సృష్టి చేసి ,సృష్టిని ధరించి పాలించాలనుకొన్నాడు .వెంటనే స్వేద ధారలలోకి తొంగి చూశాడు .తన ప్రతి బింబం కనిపించింది .ఆయన రేతస్సు ఆ స్వేదం లో జారి పడింది .స్వేదం లో వేడి పుట్టించి దాన్ని రెండు భాగాలుగా చేశాడు ..అందులో ఒకటి తాగటానికి వీలు లేని ఉప్పు సముద్రం ,మరొకటి తియ్యని నీరు ఏర్పడ్డాయి .ఈ తీయని నీటిలో వేడి పుట్టించాడు .అంతకు ముందే అందులో పడిన రేతస్సు ఎండిపోయి దాని నుంచి భ్రుగువు అనే రుషి జన్మించాడు .వెంటనే పరబ్రహ్మ అదృశ్యమైనాడు .
భ్రుగువు పరబ్రహ్మను వెతక టానికి అన్ని దిక్కులూ వెతికాడు .తూర్పులో వాయువు ,దక్షిణం లో మాత రిశ్వ ,,పడమర లో పవమానం ,ఉత్తరం లో వాతం అని అశరీర వాణి పలికి కింద నీటిలో చూడమన్నది .చూడగా నోటి నుండి అదర్వుడు అనే రుషి పుట్టాడు .కింద నుంచి పుట్టాడు కనుక అదర్వుడు అనే పేరు .ఆయన దేహం బ్రహ్మ దేహం లాగా తేజో వంతం గా ఉంది .ఆయనే సృష్టికార్యం జరిపే ప్రజా పతి .పర బ్రహ్మ అధర్వుని దేహాన్ని తపింపజేసి వేడేక్కించటం వలన ఆయన దేహం నుండి ఏకర్చ ,ద్వార్చ్య ,త్ర్యర్చ,చతుర్చపంచర్చ ,షడర్చ ,సప్తార్చ ,అస్టర్చ ,నవర్చ ,దశర్చ అనే పది మంది ఆదర్వణ ఋషులు జన్మించారు .వీరి నుంచి ఏకాదశర స్చ ,ద్వాదశర్చ ,త్రయోదశర్చ , చతుర్దశర్చ,పంచ దశర్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,త్రయోదశార్చ ,చతుర్ధశార్చ ,పంచాదశార్చ ,షోడశార్చ ,సప్త దశర్చ ,అష్ట దశర్చ ,ఎకోనవవిమ్షర్చ , విమ్శారస్చ అనే పది మంది అధర్వ ఋషులు తిరిగి పుట్టారు .అధర్వణుడు ,అధర్వ ఋషులు దర్శించిన మంత్రాలకే అధర్వ వ్రేదం అని పేరు .దీని నుండి ఓంకారం పుట్టింది .
పరబ్రహ్మం నుండి భూమి ,అంతరిక్షం ,స్వర్గ అనే మూడు లోకాలు పుట్టాయి .ఆయన పాదం నుండి భూమిని ,ఉదరం నుండి అంతరిక్షాన్ని ,తలనుండి స్వర్గాన్ని సృష్టించాడు .భూమి నుండి అగ్ని ,అంతరిక్షం నుండి వాయువు ,స్వర్గం నుండి ఆదిత్యుడు లను సృష్టించాడు .అగ్ని వలన ఋగ్వేదం ,వాయువు నుండి యజుర్వేదం ,ఆదిత్యుని నుండి సామ వేదం ,వెలశాయి .ఋగ్వేదం నుండి భూహ్ అనే వ్యాహృతి ,యజుస్సు నుండి భువః ,సామం నుండి సవః అనే వ్యాహృతులు పుట్టాయి .
ఉప్పు నీటి నుండి సముద్రం ,అన్ని వైపులకు వ్యాపించి తమకు ఒక దేవు డిని మ్మని ప్రార్ధిస్తే ,వరుణుడు అధి దేవత అయ్యాడు .వరుణుడి నుండి ముచ్యుడు ,పుట్టాడు ఇతనే మృత్యు దేవత .ఇతని దేహం నుండి రసాలు కారాయి.రసాల నుండి పుట్టిన వారే అంగీరస ఋషులు .ఇలా అధర్వాన్గీరసులు భ్రుగ్వాన్గీరస ఋషులు జన్మించారు .అంగీరసులు దర్శించినదే అంగీరస వేదం .దీని నుండి జనత్ అనే వ్యాహృతి పుట్టింది .పరబ్రహ్మ తూర్పు దిక్కు నుంచి సర్ప వేదాన్ని ,దక్షిణ దిక్కు నుండి పిశాచ వేదాన్ని ,పశ్చిమం నుంచి అసుర వేదాన్ని ,ఉత్తరం నుండి ఇతిహాస వేదాన్ని ,ఊర్ధ్వ ,అదో దిక్కుల నుండి పురాణ వేదాన్ని సృష్టించాడు .సర్ప వేదం నుండి ‘’వ్రుధాత్ ‘’,పిశాచ వేదం నుండి కారత్ ,అసుర వేదం నుండి గుహన్ ఇతిహాస వేదం నుండి మహాత్ ,పురాణ వేదం నుండి తత్ అనే వ్యాహృతులను సృష్టించాడు .తర్వాత చంద్రుడు ,గ్రహాలూ ,వృక్షాలు మొదలైనవి సృష్టించాడు .
పిమ్మట పర బ్రహ్మ ఒక యజ్ఞాన్ని చేసి దానిలో అగ్ని ని హోత గా ,వాయువు అధ్వర్యుగా ,సూర్యుని ఉద్గాత గా ,చంద్రున్ని బ్రాహ్మ గా ,పర్జన్యుడిని సదస్యునిగా ,ఓషధులు ,వృక్షాలు చమస్సులు (గరిట లాంటిది )గాను ,విశ్వేదేవతలను హోత గాను ,అధర్వాన్గీరాసులు గోప్తలుగాను నియమించాడు .గోప్తలు యజ్ఞం లో జరిగే లోపాలను సవరిస్తారు .ఇలా అధర్వ వేదం ,దాని ప్రాముఖ్యత ,అధర్వామ్గీరాసుల ప్రాశస్త్యం విశిష్టం గా గోపద బ్రాహ్మణం లో వివరించ బడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-14 –ఉయ్యూరు
